ఉప్మా పెసరట్టు వేసి, అమ్మకు తినిపించిన మెగాస్టార్.. ద రియల్ మ్యాన్!
on Apr 23, 2020
మెగాస్టార్ చిరంజీవి.. ద రియల్ మ్యాన్ అనిపించుకున్నారు. ఇల్లు శుభ్రం చేసి, స్టైల్గా ఉప్మా పెసరట్టు వేసి, అమ్మ అంజనాదేవికి తినిపించారు. మూడు రోజులుగా టాలీవుడ్లో #BeTheRealMan ఛాలెంజ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. జక్కన్న ఛాలెంజ్ మేరకు ఇంటిని శుభ్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ ఛాలెంజ్ను మెగాస్టార్కు విసిరాడు. దాన్ని స్వీకరిస్తున్నట్లు బుధవారం తెలిపిన చిరంజీవి ఈరోజు ఆ ఛాలెంజ్ను పూర్తి చేశారు. అయితే కేవలం తాను #BeTheRealMan ఛాలెంజ్ కోసం ఈ రోజు మాత్రమే ఈ పనులు చేయట్లేదనీ, ఇవి తాను రోజూ చేసే పనులేనని ఆయన తన సోషల్ మీడియాలో రాశారు. "నేను రోజు చేసే పనులే...ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం" అని ఆ వీడియోను షేర్ చేశారు.
ముందుగా వాక్యూమ్ క్లీనర్తో ఇంటి ఫ్లోరింగ్ను క్లీన్ చేసిన చిరంజీవి, ఆ తర్వాత కిచెన్లో తనదైన స్టైల్లో ఉప్మా పెసరట్టు వేశారు. పెసరట్టుపై ఉప్మా వేశాక స్టైల్గా పెనం పట్టుకొని పెసరట్టును తిరగేశారు. ఆశ్చర్యకరంగా ఉప్మా చెక్కు చెదరకుండా పెసరట్టును అంటిపెట్టుకొని పెనంపై అలాగే పడింది. దీన్ని బట్టి ఉప్మా పెసరట్టు మేకింగ్లో మెగాస్టార్ ఎంతటి నిష్ణాతుడో అర్థమైపోతోంది. ఆ తర్వాత దాన్ని డైనింగ్ టేటుల్ దగ్గర కూర్చొని ఉన్న అమ్మ అంజనాదేవికి ఇచ్చి, ఆమె చేత తినిపించారు. ముందు ఆమె ఒక ముక్క తుంచి కుమారుడి నోట్లో పెట్టడం.. ఆ తల్లీకొడుకుల అనుబంధానికీ, ఆత్మీయతకూ అద్దం పట్టింది. కాగా #BeTheRealMan ఛాలెంజ్ను తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్కూ, తన మిత్రుడు రజనీకాంత్కూ విసిరారు చిరంజీవి.