సెట్స్పైకి వెళ్తున్న చిరంజీవి-కొరటాల సినిమా!
on Dec 27, 2019
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలియవచ్చింది. అక్టోబర్లోనే అధికారికంగా ఈ సినిమా లాంచ్ అయినప్పటికీ ఇప్పటిదాకా సెట్స్పైకి వెళ్లలేదు. కారణం.. ఈ సినిమా కోసం చిరంజీవి మేకోవర్ లుక్ కోసం ఆగడమే. ఇప్పుడు కొరటాల ఆశించిన విధంగా చిరంజీవి తయారయ్యారనీ, అందుకే సెట్స్పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారనీ యూనిట్ వర్గాల సమాచారం. కోకాపేటలో ఇప్పటికే భారీ సెట్ను నిర్మించారు. ఇందులోనే జనవరి 3 నుంచి రెగ్యులర్ షూట్ జరపనున్నట్లు తెలుస్తోంది. కొన్ని యథార్థ ఘటననల ఆధారంగా ఈ మూవీ స్టోరీని కొరటాల రాశారనీ, సింహాచల క్షేత్రం బ్యాక్డ్రాప్లో ఈ కథ ఉంటుందనీ ప్రచారం జరుగుతోంది.
ఈ మూవీలో మెగాస్టార్ రెండు రూపాల్లో కనిపించనున్నారు. నాయిక పేరును అధికారికంగా ప్రకటించకపోయినా త్రిష పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇదివరకు 'స్టాలిన్'లో చిరంజీవి, త్రిష జంటగా నటించారు. చాలా కాలం తర్వాత ఒక టాప్ స్టార్కు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న సినిమా ఇదే. తిరు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా చేస్తున్నారు. చిరంజీవి మునుపటి రెండు సినిమాలు - 'ఖైదీ నంబర్ 150', 'సైరా.. నరసింహారెడ్డి'లను నిర్మించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధినేత రాంచరణ్ ఈ చిత్రాన్నీ నిర్మిస్తుండగా, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్రెడ్డి మరో నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది చిరంజీవికి 152వ చిత్రం.