బాహుబలి తర్వాత ఐటీ టార్గెట్ ఎవరు..?
on Nov 12, 2016
బాహుబలి.. తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా. ఒక ప్రాంతీయ చిత్రం బాలీవుడ్ చిత్రాలను వెనక్కునెట్టి మరి కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. విడుదలైన ప్రతిచోటా ప్రభంజనం సృష్టించి..రివార్డులతో పాటు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి బాహుబలి ప్రతిష్టను మసకబార్చే సంఘటన నిన్న జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లను రద్దు చేయడం అన్ని రంగాలను షాక్కు గురిచేసింది. ఇంకేముంది నల్లధనాన్ని పోగేసిన వారు దానిని వైట్ మనీగా మార్చుకునే పనిపై ఫోకస్ చేశారు. ఇలాంటివి జరుగుతాయని ముందే అంచనా వేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో దాడులు నిర్వహించి బ్లాక్మనీ గుట్టురట్టు చేశారు.
అదే విధంగా బాహుబలి సినిమాను కొన్న అగర్వాల్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్గా మార్చే పనుల్లో ఉండటంతో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదే సమయంలో బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు.. ఈ దాడుల్లో రూ.55 కోట్ల దాకా నగదు బయటపడినట్లు సమాచారం. ఈ వార్త టాలీవుడ్ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. అంతేనా తమ సినిమాలు అంత కలెక్ట్ చేశాయి..ఇంత కలెక్ట్ చేశాయి అని ప్రకటించిన వారందరి నోట్లో వెలక్కాయ పడేలా చేసింది. దీంతో ఎప్పుడు..ఎవరిపై ఐటీశాఖ విరుచుకుపడుతోందనని కొందరు బిక్కుబిక్కుమంటున్నారు.