పెళ్ళాలు రాలేదు... అదొక్కటే ఫ్రస్ట్రేషన్!
on Dec 31, 2018
ఫన్... ఫన్... ఫన్... విశాఖలో జరిగిన 'ఎఫ్2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫన్తో సాగింది. సినిమా కాప్షన్ 'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' అయినప్పటికీ... థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు ఎటువంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా ఫన్తో ఇంటికి వెళతారని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. స్టేజి మీద మాట్లాడిన ప్రతి ఒక్కరూ వినోదం పంచాలని ప్రయత్నించారు. వెంకటేష్ కూడా ఫన్నీగా మాట్లాడారు. విశాఖపట్టణంలో 'స్వర్ణ కమలం', 'సుందరాకాండ', 'గురు' సినిమా షూటింగులు చేశానని, ఇదే సముద్రతీరంలో 'మల్లేశ్వరి'లో కట్రీనాతో నడిచానని వెంకీ చెప్పారు. తరవాత సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి డుమ్మా కొట్టడంపై వెంకటేష్ సెటైర్స్ వేశారు.
"అందరూ ఫన్ ఫన్ అంటున్నారు. అయితే.. సినిమాలో మా పెళ్ళాలుగా నటించిన ఇద్దరూ ఇక్కడికి రాలేదు. అదొక్కటే ఫ్రస్ట్రేషన్. వాళ్ళు కూడా వచ్చి ఉంటే బావుండేది" అని వెంకటేష్ అన్నారు. ఆయన కామెడీగా చెప్పినా... మాటల్లో సీరియస్నెస్ ఏంటనేది ఇండస్ట్రీ జనాలకు తెలుసు. హీరోయిన్లు ఫంక్షన్స్కి డుమ్మా కొట్టడంపై గతంలో పలువురు ప్రముఖులు మీడియా సాక్షిగా విమర్శించారు. వెంకీ కాస్త సుతిమెత్తగా చెప్పారు. మిగతా ప్రమోషన్ కార్యక్రమాలకు హీరోయిన్లు ఇద్దరూ వస్తారని సమాచారం. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్2' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.