సినీ ప్రముఖులకు ఏపీ సీఎం ప్రామిస్ చేశారు కానీ...
on Oct 16, 2020
కరోనా కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు... కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్), వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ప్రత్యేకంగా కలిశారు. ఇద్దరితో వేర్వేరుగా సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. అప్పుడు ఇద్దరికీ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా థియేటర్ల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరారు.
థియేటర్లు మూసివేసినప్పుడు విద్యుత్ వినియోగించకపోయినప్పటికీ మినిమమ్ బిల్లు లక్షల్లో వస్తుందని ఎగ్జిబిటర్ల సమస్యను వివరించారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని సినీ ప్రముఖులకు ఏపీ సీఎం ప్రామిస్ చేశారు. కానీ, ఇప్పటివరకూ మాఫీ చేయలేదని యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ సెక్రటరీ దామోదర ప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు థియేటర్ విద్యుత్ బిల్లుల విషయమై ఒక్క జీవో కూడా రాలేదని ఆయన అన్నారు. పైగా, అన్ని థియేటర్ల నుండి ఫ్యూజులు పీకేశారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ థియేటర్లు మళ్ళీ తెరచుకోవాలంటే ఆ బిల్లులు చెల్లించాలని దామోదర ప్రసాద్ తెలిపారు.