వారిద్దరి తర్వాత స్థానం త్రివిక్రమ్ దే!
on Nov 7, 2017
నాటి పింగళి నాగేంద్రరావుగారి నుంచి నేటి సాయిమాధవ్ బుర్రా వరకూ తెలుగు సినిమా చాలామంది రచయితలను చూసింది. ఎవరి ప్రయాణం వారిది. ఎవరి సంతకం వారిది. వీరిలో ఉద్దండులు కానివారు ఎవరూ లేరు. అయితే.. సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండాలని లేదు. తెలుగు సినిమాకు చెందిన ఎక్కువమంది రచయితల విషయంలో అదే జరిగింది. ఒకరిద్దరు రచయితలు మాత్రం సరస్వతితో పాటు, లక్ష్మీ కరుణా కటాక్షాలను కూడా పొందగలిగారు. వారిలో పరుచూరి బ్రదర్స్ ది మొదటి స్థానం అయితే.. తర్వాత చెప్పుకునే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్.
పరుచూరి వారు దాదాపు మూడొందల పై చిలుకు సినిమాలకు మాటలు రాశారు. విచిత్రం ఏంటంటే.. త్రివిక్రమ్ దర్శకుడు కాకముందు మాటలు రాసిన సినిమాల సంఖ్య కేవలం ‘6’.. వందల సినిమాలకు మాటలు రాసి.. పరుచూరి బ్రదర్స్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులను కేవలం ‘ఆరు’ సినిమాలతో దక్కించుకున్న ప్రతిభాశాలి త్రివిక్రమ్.
అంతేకాదు.. దర్శకులపై రామ్ గోపాల్ వర్మ ఏ స్థాయిలో ప్రభావం చూపారో... రచయితలపై త్రివిక్రమ్ ఆ స్థాయిలో ప్రభావం చూపాడు. ఆయన్ను చూసి రైటర్లు అయిన వారు చాలామందే ఉన్నారు. ఆయన శైలిలో మాటలు రాయాలని తపించే రచయితలూ ఉన్నారు. ఆ విధంగా తక్కువ సినిమాలతోనే తెలుగు సినిమా సాహిత్యంపై బలమైన ముద్ర వేసిన ఘనాపాటి త్రివిక్రమ్.
తెలుగు సినిమా పుట్టిన తర్వాత మెగా ఫోన్ పట్టుకొని సక్సెస్ అయిన దర్శకుల్లో దాసరి నారాయణరావు, జంద్యాల తర్వాత స్థానం త్రివిక్రమ్ దే. ప్రస్తుతం రచయితలందరూ మెగా ఫోన్ వంక చూస్తున్నారు. దీనికి ప్రేరణ కూడా త్రివిక్రమే. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు కూడా త్రివిక్రమే.
ఇదంతా ఒక రచయిత సాధించిన ఘనత. సినిమా అనేది పేపర్ వర్క్ తోనే పూర్తవుతుంది. మిగిలిందంతా ఒట్టి తంతు మాత్రమే. ఇది మేధావులు సైతం అంగీకరించిన నిజం. ఆ విధంగా చూసుకుంటే రచయితని మించిన దర్శకుడు ఎవరుంటారు చెప్పండి? అందుకే... మొన్నటి దాసరి, నిన్నటి జంధ్యాల, నేటి త్రివిక్రమ్ లెజెండ్స్ అయ్యారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ మాటల మాంత్రికుడు పుట్టిన రోజు నేడు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలుపుతోంది.. ‘తెలుగువన్’. .