అతిలోక సుందరికి కష్టాలు తప్పవా..?
on Oct 21, 2016
బాలీవుడ్, టాలీవుడ్లను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన అతిలోక సుందరి ఆమె...షష్టీ పూర్తికి దగ్గరవుతున్నా ఇప్పటికీ అదే అందంతో కుర్ర హీరోయిన్లకు పోటి ఇస్తూ దూసుకెళ్తొన్న శ్రీదేవికి కష్టాలా..? కానీ ఇది నిజం. యూరీలోని భారత సైనిక స్ధావరంపై ఉగ్రదాడి హిందీ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఘటనపై దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా పాక్కు సరైన సమాధానం చెప్పాలని యావత్ భారతావని కోరుకుంటోంది. దీనిలో భాగంగా పాక్ నటీనటులు బాలీవుడ్లో నటించిన సినిమాలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కరణ్జోహార్ నిర్మించిన యే దిల్ హై ముష్కిల్, షారుఖ్ ఖాన్ నటించిన రయీస్లలో పాక్ కళాకారులు నటించారు. దీంతో ఈ సినిమాలు చిక్కుల్లో పడ్డాయి. తాజాగా దీని ప్రభావం అతిలోకసుందరి శ్రీదేవిపై పడనుంది. శ్రీదేవి ప్రధాన పాత్రలో ఆమె భర్త బోనీ కపూర్ నిర్మిస్తున్న"మామ్" చిత్రంలో అద్నాన్ సిద్ధిఖీ, సజల్ అలీ అనే ఇద్దరు పాకిస్థాన్ నటులు నటిస్తున్నారట. ఇప్పటి వరకు షూటింగ్ వేగంగా జరిగ్గా..తర్వాతి షెడ్యూల్ ముంబయిలో జరగాల్సి ఉంది. అయితే ఉరీ ఘటన తర్వాత పాక్ కళాకారులపై నిషేధం విధించడం, పాక్ నటీనటులు దేశం వదిలి వెళ్లాలని రాజ్థాకరే హెచ్చరించడంతో వారు దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో మామ్ భవిష్యత్ సందిగ్థంలో పడింది.