'మా' రగడ.. పబ్లిక్ గా గొడవపడ్డ రాజశేఖర్- చిరంజీవి
on Jan 2, 2020
మా అసోసియేషన్ వేదికగా మరోసారి చిరంజీవి,రాజశేఖర్ మధ్య ఉన్న విభేదాలు గుప్పుమన్నాయి. 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఈ భేధాభిప్రాయాలకు వేదిక అయింది. తాజాగా పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో..పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి రాజశేఖర్ మైకు లాక్కోవడంతో వివాదం నెలకొంది. మొదటగా ఈ సభలో మాట్లాడిన చిరంజీవి.. ‘మా’లో మంచి ఉంటే మైక్లో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెబుదాం అని అన్నారు.
చిరంజీవి మాట్లాడుతున్నంతసేపు ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డ రాజశేఖర్.. తరువాత చిరంజీవి వ్యాఖ్యలకు నిరసనగా వేదిక పైకి వచ్చి.. వ్యాఖ్యాత పరుచూరి నుంచి మైకు లాక్కున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. చిరంజీవి ప్రసంగాన్ని తప్పుబట్టారు. సినీ పెద్దలు చెప్పేది ఒకటి.. చేసేది మరోకటి అని తీవ్ర విమర్శలు చేశారు. మా అసోషియేషన్లో గ్రూపులు ఫాం అయినట్టుగా చెప్పిన రాజశేఖర్, కొంత మంది వ్యక్తులు తెర మీద హీరోలుగా ప్రవర్తించినా నిజ జీవితంలో మాత్రం అలా హీరోగా ప్రవర్తించే వారిని తొక్కేస్తున్నారన్నారు. మాలో అంతా సవ్యంగా లేదని చాలా తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘మా’ డైరీ ఆవిష్కరణలో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. చిరంజీవి ’మా’ లో ఒక మెంబర్ మాత్రమే.. ఆయనకు అంతలా ప్రాధాన్యత ఇవ్వడం బాగోలేదన్నారు. అంతేకాదు వేదికపై ఉన్న చిరంజీవి సహా పెద్దలకు కాళ్లు మొక్కి వేదిక దిగి వెళ్లిపోయారు.
దీనిపై స్పందించిన చిరంజీవి.. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. రాజశేఖర్ వేదిక మీద ఉన్న పెద్దలను అవమానించేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవల గురించి పబ్లిక్గా చర్చించ వద్దని చెప్పినా వినకుండా రాజశేఖర్ వేదిక మీద మాట్లాడటం సరికాదన్నారు. కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని.. అలాంటి వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చిరంజీవి కోరారు.