కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ రావాలి: మెగాస్టార్ డిమాండ్
on Jan 6, 2020
"మన సౌత్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ యాక్టర్ కృష్ణగారు.. అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదనేది నా అభిప్రాయం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చేలా కృషి చేయాలి.. ఈ అవార్డు కృష్ణగారికి వచ్చే గౌరవం కాదు.. మనకి వచ్చే గౌరవం" అన్నారు చిరంజీవి. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక మీద ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. "350 సినిమాలు చేయడమే కాదు.. ధైర్య సాహసాలకు ఆయన పెట్టింది పేరు. కొత్త టెక్నాలజీ వస్తే.. దాన్ని ప్రేక్షకులకు అందించడంలో ఆయన ముందుంటారు. హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ కావడానికి ఆయనో కారణం. పద్మాలయా స్టూడియో పేరుతో పెద్ద స్టూడియో నిర్మించారు. అలాంటి వ్యక్తి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అన్ని విధాలా అర్హుడు. ఒకప్పుడు కృష్ణగారి అబ్బాయి మహేశ్.. కానీ ఇప్పుడు మహేశ్ సాధిస్తున్న విజయాలు చూస్తుంటే మహేశ్ తండ్రి కృష్ణగారు అనే స్థాయికి మహేశ్ వస్తున్నారు. నిజంగా మహేశ్ను చూసి కృష్ణగారు గర్వపడాలి. ప్రతి తండ్రికి అంతకంటే ఏం కావాలి! తను సాధించిన తర్వాత తనకు పేరు తెచ్చేలా.. తన కొడుకు పేరు వెనుక తన పేరు రావడం కంటే ఏం కావాలి!" అని చిరంజీవి చెప్పారు.
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి తనను పిలవగానే ఆశ్చర్యం వేసిందని ఆయన అన్నారు. "షాక్ తిన్నాను.. ఆనందం వేసింది. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ ఇంత స్పీడ్గా, క్వాలిటీగా సినిమాలు చేస్తే ఇంతకంటే ఇంకేం కావాలి.. అందరూ ఇలాగే చేయాలి.. అప్పుడే ఈ పరిశ్రమ పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది.. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉంటుంది. థియేటర్స్ కళకళలాడుతుంటాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తయ్యే వరకూ మహేశ్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదంటే దాని వల్ల నిర్మాతలకి ఎన్నో కోట్లు, వడ్డీ డబ్బులు మిగులుతాయి.. అది మంచి ఆరోగ్యకరమైన సంప్రదాయం. నేను కూడా సినిమా పూర్తయ్యాకే డబ్బు తీసుకునేవాణ్ణి. దాన్నిప్పుడు రామ్చరణ్ కూడా ఆచరిస్తున్నాడు. మహేశ్కూడా అలా చేసి, నిర్మాతలకి వెన్నుదన్నుగా నిలబడటం గ్రేట్.. ఈ రోజుల్లో అది అవసరం. షూటింగ్ డేస్ పెరగడం వల్ల బడ్జెట్ వృథా అయిపోతోంది.. నా తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ కూడా 80 నుంచి 99 రోజుల్లోనే పూర్తి చేస్తానని మాటిచ్చాడు.. అలా చేయకుంటే మర్యాదగా ఉండదు (నవ్వుతూ). చరణ్ విషయంలో నాకూ అంతే. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా పెద్ద హిట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అనీల్ సుంకర, ‘దిల్’ రాజు లాంటి నిష్ణాతులున్నారు. ఈ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదలవుతున్న ‘అల వైకుంఠపురం’, మా ఫ్రెండ్ రజనీ సినిమా ‘దర్బార్’తో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలూ సూపర్డూపర్ హిట్స్ అవ్వాలి.. సినిమా పరిశ్రమ బాగుండాలి.. వాటి దర్శక–నిర్మాతలు బాగుండాలి" అని చెప్పారు చిరంజీవి.