హీరోయిన్ దర్శకుడి మధ్య చాడీలు
on Mar 14, 2014
"సరదాగా కాసేపు", "షాడో" వంటి పలు చిత్రాలలో నటించిన హీరోయిన్ మధురిమకు ఓ తమిళ సినిమా దర్శకుడి వలన నిందలు వచ్చాయి. ప్రస్తుతం మధురిమ "సేరెందు పోలమా" అనే తమిళ చిత్రంలో నటిస్తుంది. అయితే ఇటీవలే ఈ చిత్ర దర్శకుడు అనిల్ ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... "మధురిమ ఎప్పుడూ సెట్ కు చాలా ఆలస్యంగా వస్తుందని, దాని కారణంగా షూటింగ్ ఆలస్యం అవడమే కాకుండా బోలెడంత డబ్బు కూడా నష్టమని తెలిపాడు. ఈమెకోసం కొన్నిసార్లు చిత్ర యూనిట్ మొత్తం వేచి ఉన్నప్పటికీ.. తనకేం సంబంధం లేనట్లుగా ఉండేది" అని అన్నారు.
దర్శకుడు ఇలా మాట్లాడేసరికి ఈ విషయం తెలుసుకున్న మధురిమ స్పందిస్తూ... “విదేశాలలో షూటింగ్ కు వచ్చే ముందు నాకు 10శాతం రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. అంతేకాక వీళ్ళు చేసిన పనుల వలన మా అమ్మ వీసా సమయానికి అందలేక మొదటిసారిగా నేను ఒక్కదానినే విదేశాలకు రావలిసి వచ్చింది. ఇదేంటని అడగబోతే నాపైనే లేనిపోని నిందలు వేస్తున్నారని” తెలిపింది.
మరి ఈ ఇద్దరు చెప్పినదాంట్లో ఎవరిది ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇక్కడ నష్టం మాత్రం మధురిమకే అని తెలిసిపోతుంది. అసలే అవకాశాలు రాక అల్లాడిపోతున్న ఇలాంటి సమయంలో ఇలా నిందలు వస్తే... భవిష్యత్తులో అవకాశాలు ఎలా వస్తాయో చూడాలి మరి.