ఇందిరమ్మ సినిమాకు తొలగిన అడ్డంకి
on Oct 21, 2016
భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా దేశప్రజలపై చెరగని ముద్రవేశారు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ. తన పాలనతో దేశం అగ్రరాజ్యాల సరసన నిలిచేందుకు బాటలు వేశారు. అయితే అక్టోబర్ 31, 1984న సొంత అంగరక్షకులు జరిపిన కాల్పుల్లో ఆమె మరణించారు. ఆమె హత్యానంతరం దేశం రావణకాష్టంలా రగిలిపోయింది. అనేక చోట్ల మత కల్లోలు జరిగి ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఆ ఉదంతాన్ని కథాంశంగా తీసుకుని "థర్టీ ఫస్ట్ అక్టోబర్" అనే సినిమాను రూపొందించారు. అయితే ఆ సినిమా ధియేటర్ల దాకా రావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సెన్సార్ వారు అనేక కత్తెర్లను సూచించగా, వాటిని తీసేసి మళ్లీ పంపించడం, ఆ తర్వాత ఇంకొన్ని మార్పులు చెప్పడం, అవి చేసి మళ్లీ సెన్సార్ బోర్డ్ కమిటీకి పంపించడం ఇలా దర్శక నిర్మాతలు అనేక ఇబ్బందులు పడ్డారు.
చివరకు సెన్సార్ బోర్డు విడుదలకు ఆమోదం తెలిపింది. దీంతో ఆనందంగా రిలీజ్కు సన్నాహాలు చేస్తుండగా..మరోసారి ఈ సినిమాకు న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. ఈ సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే అదృష్టం నిర్మాతల వైపు ఉండటంతో న్యాయస్థానం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఈ పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు నిరాధారమైనవి, అస్పష్టమైనవని..చిత్రాన్ని సెన్సార్ బోర్డు ధ్రువీకరించిందని, ఇందులో జోక్యం అనవసరమని తెలుపుతూ ఈ నెల 21న సినిమాను విడుదల చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. శివాజీ లోథన్ పాటిల్ దర్శకత్వంలో వీర్ దాస్, సోహా అలీఖాన్లు కీలకపాత్రలు పోషించారు. ఇవాళ రిలీజైన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.