జక్కన్న@15 ఇయర్స్...
on Sep 28, 2016
ఆ పేరు భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. అతడు తీస్తోన్న సినిమా కోసం దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అతనికి అభిమానులే. అతనే తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు, పద్మశ్రీ ఎస్ఎస్.రాజమౌళి. ఇంతటి అభిమానం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్థానం మొదలై 15 ఏళ్లు గడిచాయి. ఎడిటింగ్ అసిస్టెంటుగా తన యాత్రను ప్రారంభించిన రాజమౌళి..రాఘవేంద్రరావు పర్యవేక్షణలో "శాంతినివాసం" సీరియల్ను విజయవంతంగా నడిపి..గురువు గారి ప్రోత్సహంతో తొలి చిత్రంగా స్టూడెంట్ నెం.1ను మొదలుపెట్టాడు .
ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా పర్వాలేదు అన్న మాట నుంచి ప్రభంజనాన్ని సృష్టించింది. అయితే ఈ సినిమా క్రెడిట్ అంతా రాజమౌళికి కాకుండా దర్శకేంద్రుడి ఖాతాలోకి వెళ్లింది. అందుకు "దర్శకత్వ పర్యవేక్షణ" రాఘవేంద్రరావు కావడమే కారణం. ఆ ముద్రను తన తర్వాతి చిత్రానికే చేరిపేసుకున్న రాజమౌళి సింహాద్రి నుంచి తన మార్క్ చూపెడుతూ వచ్చాడు. అక్కడి నుంచి ఛత్రపతి, సై, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాదరామన్న, ఈగ, బాహుబలి వంటి సినిమాలతో పరాజయమన్నది లేకుండా దర్శకుడిగా 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్లో మరో కళాఖండాన్ని చెక్కుతున్న జక్కన్న తెలుగు జాతి గర్వించే మరిన్ని సినిమాలు తెరకెక్కించాలని కోరుకుందాం.