ఈ దర్శకులకు తప్పని ద్వితీయ గండం..!
on Sep 23, 2016
తెలుగు సినిమాకు సెంటిమెంట్కు అవినాభావ సంబంధం ఉంది. నిర్మాతలకు ఆడి కార్ కలిసి రాదని, హీరోలకి మెర్సిడెజ్ అంత స్యూటబుల్ కాదని, శనివారం రెయిన్ సీన్స్ షూట్ చెయ్యకూడదని, పలానా హీరో సినిమా టైటిల్ మూడక్షరాల్లో ఉంటే హిట్టని ఇలా బోలెడన్ని సెంటిమెంట్లు. అలాగే టాలీవుడ్ దర్శకుల విషయంలో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. తమ తొలిసినిమాతో హిట్ కొట్టిన దర్శకులు రెండో సినిమా విషయంలో బొక్కబొర్లాపడ్డారు.
ప్రజంట్ టాప్ డైరెక్టర్లుగా చలామణి అవుతోన్న దర్శకులు కూడా దీనిని తప్పించుకోలేకపోయారు. ఈ ద్వితీయ విఘ్నాన్ని అతికొద్ది మంది డైరెక్టర్లు మాత్రమే సక్సెస్ అయ్యారు. తాజాగా విరించి వర్మ ఆ విఘ్నాన్ని ఎదుర్కొబోతున్నాడు. అతని దర్శకత్వంలో తెరకెక్కిన మజ్ను ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మరి రెండోసినిమా గండాన్ని తప్పించుకుంటాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఈ సందర్భంగా టాలీవుడ్లో ద్వితీయ విఘ్నాన్ని తప్పించుకోలేకపోయిన దర్శకులపై ఓ లుక్కేద్దాం..
వివి.వినాయక్:
ఆది సినిమాతో యంగ్టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్కు ఆదిరిపోయే హిట్టిచ్చిన వివి.వినాయక్ తన రెండో సినిమాగా నందమూరి బాలకృష్ణతో చేసిన చెన్నకేశవరెడ్డి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
పూరి జగన్నాథ్:
పవర్స్టార్ పవన్కళ్యాణ్ బద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు పూరి. ఆ మూవీలో పూరి మార్క్ మ్యానరిజమ్, డైలాగ్స్తో ఆడియాన్స్ ఊగిపోయారు. ఈ సినిమా తెలుగునాట ఒక ట్రెండ్ సెట్ చేసింది. అలాంటి మాస్ హిట్ తర్వాత జగపతి బాబు హీరోగా పూరి తీసిన బాచీ ఘోరంగా దెబ్బతింది.
కరుణాకరన్:
ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న కరుణాకరన్ తొలిప్రేమ సినిమాతో హిట్ కొట్టి..అనంతరం సుమంత్తో తీసిన యువకుడితో డిజాస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
సుకుమార్:
ఆర్య సినిమాతో అల్లుఅర్జున్కి లవర్బాయ్ ఇమేజ్ తీసుకువచ్చాడు సుకుమార్. అనంతరం ఎనర్జిటిక్ హీరో రామ్తో తీసిన జగడం అట్టర్ఫ్లాపయింది.
క్రిష్:
గమ్యం సినిమాతో టాలీవడ్కు కొత్త తరహా కథను అందించాడు క్రిష్. ఇతగాడి సినిమా అనగానే ఏదో వేరియేషన్ ఉంటుంది అని ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. గమ్యం తరువాత క్రిష్ డైరెక్ట్ చేసిన వేదం సినిమా విమర్శకుల ప్రశంసలైతే అందుకుంది కాని ధియేటర్లలో ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది.
సురేందర్రెడ్డి:
అతనొక్కడే మూవీతో నందమూరి కళ్యాణ్రామ్కు హీరోగా ఇమేజ్ తీసుకువచ్చిన సురేందర్ రెడ్డి ఆ తర్వాత ఎన్టీఆర్తో తీసిన అశోక్ డిజాస్టర్గా మిగిలిపోయింది.
సంతోష్ శ్రీనివాస్:
రామ్ హీరోగా కందరీగ లాంటి హిట్ కొట్టిన సంతోష్ శ్రీనివాస్ ఆ తర్వాత ఎన్టీఆర్తో తెరకెక్కించిన రభస ఫ్లాప్గా నిలిచింది.
నందినిరెడ్డి:
లేడి దర్శకులు హావా అంతగా లేని ఇప్పటి తెలుగుసినిమాలో దర్శకురాలిగా సత్తా చాటారు నందిని. ఆమె దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది చిన్న సినిమాగా విడుదలై ఊహించని హిట్ని సొంతం చేసుకుంది. అనంతరం నందిని తెరకెక్కించిన జబర్దస్త్ రిలీజైన విషయం కూడా జనాలకు తెలియలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.