చెప్పడమే మా ధర్మం... వినకపోతే మీ ఖర్మం!
on Aug 13, 2017
ప్రతి దాన్నీ బూతద్దంలో చూడకపోతే.. మీడియాకు తృప్తి ఉండదు పాపం. ఇంతదాన్ని అంత చేసి చెప్పడంలో ఎంత ఆనందాన్నిపొందుతారో!. ప్రస్తుతం మనం వింటున్న వార్తల్లో కూడా వాస్తవాలు కొన్నే ఉంటాయ్. మిగిలినవన్నీ ‘అతిశయోక్త్యలంకారాలే’.రజనీకాంత్ ‘2.0’ చిత్రం తెలుగు రైట్స్ పై వస్తున్న వార్తలను వింటుంటే... మనవాళ్ల ఊహలను అభినందించకుండా ఉండలేం.
విడుదలకు ముందు వరకూ‘బాహుబలి’కి ఉన్న హైప్ గురించి ప్రత్యేకించి చెప్పాలసిన పనిలేదు. మళ్లీ ఇప్పుడు అంత హైప్ ఏ సినిమాకు ఉందేంటే..? టక్కున వచ్చే సమాధానం ‘2.0’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో. అక్షయ్ కుమార్ విలన్. శంకర్ దర్శకుడు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం. దాదాపు 200 కోట్ల నిర్మాణ వ్యయం. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమాపై ఆ మాత్రం అంచనాలు ఉండటం సహజమే కదా. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే... ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్ విషయంలోనే ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. గ్లోబల్ సినిమాస్ వారు ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ని 75 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రస్తుతం ఫిలింనగర్ టాక్. దీంట్లో నిజం ఎంతుంది? అనే విషయాన్ని వాకప్
చేస్తే... ఈ చిత్రం రైట్స్ ను భారీగానే అమ్మిన్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత రాజు మహాలింగం ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే... ‘ఎంతకు అమ్మింది?’ అనే విషయాన్ని మాత్రం ఆయన పొందుపరచలేదు. దీన్ని బట్టి 75 కోట్లకు కొన్నట్టు వినిపిస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.
ఏది ఏమైనా... జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బయ్యర్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘కబాలీ’ రైట్స్ 32 కోట్లకు కొన్నారు. ‘లింగా’రైట్స్ కూడా ఫ్యాన్సీ రేట్ కే దక్కించుకున్నారు. రజనీకాంత్ త్రీడీ చిత్రం‘విక్రమసింహా’ విషయంలో కూడా అదే జరిగింది. ఆ తర్వాత ఏం జరగిందో అందరికీ తెలిసిందే. ఈ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ముందుకెళ్తే మంచిది. సూపర్ స్టార్ కేపాసిటీని తక్కువ చేసి చెబుతున్న మాటలు కావివి. బయ్యర్ల క్షేమం కోరి చెబుతున్న మాటలు. దట్సాల్!