నలుగురిలో గెలిచేదెవరు..? పరువు నిలిపేదెవరు..?
on Feb 6, 2018
ఈ ఏడాది అభిమానులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మెగా హీరోలు.. జనవరి నుంచి మార్చి వరకు బాక్సాఫీస్ వద్ద వీరిదే హవా.. ఆల్రెడీ పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో తీవ్రంగా నిరాశపరచడంతో.. మిగిలిన వారిపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఫిబ్రవరిలో వరుణ్తేజ్ తొలిప్రేమతో, సాయిథరమ్ తేజ్ ఇంటిలిజెంట్తో.. మార్చిలో రామ్చరణ్ రంగస్థలంతో.. అల్లు అర్జున్ నా పేరు సూర్యతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఫిదా లాంటి కూల్ హిట్ తర్వాత మళ్లీ అలాంటి డిసెంట్ లవ్ స్టోరీనే ఎంచుకున్నాడు వరుణ్ తేజ్. అలనాటి తొలిప్రేమను టైటిల్గా పెట్టి తెరకెక్కించిన తొలిప్రేమలో కూడా డిఫరెంట్ లవ్స్టోరీనే ట్రై చేశాడు వరుణ్.. స్టూడెంట్గా.. ప్రేమను పొందేందుకు తపించిపోయే వ్యక్తిగా మెగాప్రిన్స్ జీవించేశాడని ఫిలింనగర్ టాక్.. ఇక గత రెండు సినిమాలు ఘోరంగా దెబ్బతినడంతో.. వివి వినాయక్ని నమ్మి ఇంటిలిజెంట్గా వస్తున్నాడు సాయి.. ట్రైలర్ చూస్తే.. వినాయక్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తప్ప కొత్తగా ఏం లేదనే పెదవి విరుపులు వినిపిస్తుండగా.. మరోవైపు ఏమో సినిమా చూస్తే కానీ చెప్పలేం కదా.? అనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
కమర్షియల్ కథలకి ఫుల్స్టాప్ పెట్టి.. ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకున్న మెగా పవర్ స్టార్ రామ్చరణ్.. ఆ దారిలో చేసిన సినిమా రంగస్థలం.. చెవిటివాడుగా.. 80ల నాటి గెటప్తో చెర్రీ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ అంచనాలను పెంచేసింది. సుకుమార్ టేకింగ్ కూడా రంగస్థలంపై అంచనాలకు మరో కారణం. లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. కోపాన్ని దాచుకోలేని వ్యక్తిగా.. ఆ ఎగ్రెసివ్నెస్తో చిక్కుల్లో పడ్డ ఆర్మీ ఆఫీసర్గా.. బన్నీ కొత్తగా ట్రై చేసిన నా పేరు సూర్యపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. మరి వీరందరిలో గెలిచేదెవరు..? పరువు నిలిపెదెవరు..? అంటూ సోషల్ మీడియాలో మెగాభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు.