LATEST NEWS
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అన్న నానుడి ఇప్పుడు జగన్ కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. గతంలో తనకు అండగా నిలబడి, తన కోసం కష్టపడి పని చేసిన సన్నిహితులను దూరం చేసుకోవడం జగన్ కు ఉన్న అలవాటు. అలా జగన్ దూరం చేసుకున్న వాళ్ల జాబితాలో సొంత  తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా కొండవీటి చాంతాడంత పొడవుకు మించి ఉ:టుంది.   ఈ నేపథ్యంలోనే..   2029లో జరగనున్నఏపీ సెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? అన్న చర్చ మొదలైంది. ఒకప్పుడు జగన్ కోసం నిలబడి, 2019 ఎన్నికలలో ఆయన విజయం కోసం నిర్విరామంగా కృషి చేసిన సొంత సోదరి షర్మిల, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కూడా జగన్ కు కుడి భుజం, ఎడమ భుజం కూడా తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయ సాయిలే 2029 ఎన్నికలలో జగన్ విజయానికి స్పీడ్ బ్రేకర్ లుగా నిలుస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికలలో జగన్  తనకు గట్టి పట్టున్న రాయలసీమలో ప్రతికూల ఫలితాలు రావడానికి ఆ ప్రాంతంలో జగన్ అంత కాకపోయినా, ఆయనతో సమానమైన పట్టు ఉన్న షర్మిల కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో వైసీపీకి గత ఎన్నికలలో సీట్లు గణనీయంగా తగ్గడానికి వైఎస్ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రచారమేననడంలో ఎలాంటి సందేహాలకూ తావు లేదు.  ఎందుకంటే వైఎస్ బిడ్డగా.. షర్మిలకు కూడా కడప ఖిల్లాపై గట్టి పట్టు ఉంది.  ఇక ఇప్పుడు విజయసాయి సొంత పార్టీ ప్రకటన చేసిన క్షణం నుంచీ జగన్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. నిజమైన సీమ పౌరుషం ఏమిటో తన పార్టీ ముందుముదు రుజువు చేస్తుందంటూ.. జగన్ ఇలాకాలో ఆయనను బలహీనుడిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  అంతే కాకుండా జగన్ క్రైస్తవుడని పేర్కొంటూ.. తాను రాజకీయ పార్టీ పెట్టి జనంలోకి వస్తున్నది రెడ్డి సామాజికవర్గం కోసం పోరాడటమేనని చెబుతున్నారు.  నిజానికి విజయసాయి రెడ్డి స్వస్థలంనెల్లూరు జిల్లా ప్రాంతమే అయినా.. వైఎస్ రాజశేఖరెడ్డి నుంచి వైఎస్ జగన్ వరకూ ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా విజయసాయికి రాయలసీమలోనూ సత్సంబంధాలు ఉన్నాయి.  ఈ పరిణామాలు జగన్ కు సీమపై ఇప్పటికే సడలిన పట్లు.. వచ్చే ఎన్నికల నాటికి మరింత సడలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రస్తతం జగన్ పరిస్ధితి చేయి (కాంగ్రెస్ )దగ్గరకెడితే చేతి దెబ్బ అన్నట్లుగా తయారైంది. ఇటు షర్మిల, అటు విజయసాయిరెడ్డి కూడా జగన్ కు గట్టి పట్టున్న సీమ, మరీ ముఖ్యంగా కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో  జగన్ కు కచ్చితంగా రాజకీయంగా భారీ నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [YS Sharmila, Vijaya Sai Reddy, YS Jagan Mohan Reddy, Dangerbells,  YCP, Andhra Pradesh Politics, 2029 Elections, Telugu One]
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూషకు వైసీపీ కీలక పార్టీ పదవిని కట్టబెట్టింది.   భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.   గతంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను  ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. చిన్న శ్రీను స్వయంగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు కావడం గమనార్హం. మజ్జీ శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో  భీమిలి వైసీపీలో ఏర్పడిన  ఖాళీని జగన్ డాక్టర్ బొత్స అనూష నియామకంతో భర్తీ చేశారు.    ఈ నియామకం ద్వారా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువ నాయకత్వానికి, అలాగే మహిళా నేతలకు పార్టీలో పెద్దపీట వేస్తున్నట్లు సంకేతాలు పంపారు.  భీమిలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, క్రియాశీలక కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే  బాధ్యతను బొత్స అనూషకు జగన్ అప్పగించారు.  ఈ సందర్భంగా జగన్ కు కృతజ్ణతలు తెలిపిన డాక్టర్ అనూష..  పార్టీ అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భీమిలిలో వైసీపీని మరింత పటిష్టం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. స్థానిక కేడర్‌ను కలుపుకొని పోతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం   శ్రమిస్తానన్నారు.     [Botsa Anusha, YCP Bheemili Constituency Incharge, Botsa Satyanarayana, Daughter, AP Politics, Telugu One]
వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి, రాజకీయ విభేదాలు సమసిపోయేలా లేవు.  తాజాగా వైఎస్ కుటుంబం ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉందని ఆశించిన వైఎస్ అభిమానుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు.  సాధారణంగా  కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను పక్కన పెట్టి కుటుంబ వేడుకల్లో కలవడం కద్దు. అయితే..   వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో.. ఆ వివాహానికి హాజరు కాకుండా స్కిప్ చేయడానికా అన్నట్లు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, షర్మిల సోదరుడు అయిన జగన్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.  షర్మిల కుమార్తె వివాహం, జగన్ విదేశీ పర్యటన రెంటినీ బేరీజు వేస్తూ.. ఆ వివాహ వేడుకకు దేశంలోనే ఉండి హాజరు కాకపోతే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందన్న భావనతోనే జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు.   వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం డాక్టర్ సోమలా రఘురామ్ రెడ్డితో నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఏర్పాట్లలో భాగంగా షర్మిల తన కుమార్తెతో కలిసి కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్‌ను సందర్శించారు. అక్కడ దివంగత నేత వైఎస్సార్ సమాధి వద్ద  నివాళులు అర్పించి, తొలి వివాహ పత్రికను ఆయన పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు కోరారు. ఇక వివాహ పనులు కుటుంబ పరంగా ముమ్మరంగా సాగుతున్నాయి.  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లో,  సెప్టెంబర్ 25న బెంగళూరులో  వివాహ నిశ్చయ తాంబూలాలు, ఎంగేజ్‌మెంట్ వేడుకలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్ 25న వివాహం జరగనుంది. డిసెంబర్ 5న హైదరాబాద్‌లో   రిసెప్షన్ నిర్వహించనున్నారు. మరోవైపు, సరిగ్గా ఇదే సమయానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన కోసం సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. దాదాపుగా అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 మధ్య కాలంలో సుమారు 25 రోజుల పాటు యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు 15 రోజుల విదేశీ ట్రిప్ కు అనుమతి ఇచ్చింది. జగన్ విదేశీ పర్యటన షెడ్యూల్, షర్మిల కుమార్తె రిసెప్షన్, వివాహ తేదీలు క్లాష్ అయ్యేలా ఉండటం గమనార్హం. ఆ విషయమూ మరోసారి షర్మిల, జగన్ మధ్య విభేదాలు, ఆస్తుల పంచాయతీపై చర్చను తెరపైకి తెచ్చాయి.   స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.   వైఎస్ కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన వివాదాలు ప్రజల్లోనూ, మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా.. షర్మిల కుమార్తె వివాహం,  జగన్ విదేశీ పర్యటనకు సంబంధించిన తాజా పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.   [YS Sharmila, YS Jagan Mohan Reddy, Anjali Reddy Marriage, YS Family Disputes, Jagan Foriegn Tour, Telugu One]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో సారి విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి  యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఆయన  హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.  తన కుమార్తెల వద్దకు వెళ్లేందుకు, అలాగే కుటుంబంతో కలిసి యూరప్‌లో పర్యటంచే నిమిత్తం పాతిక రోజుల పాటు విదేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఆయన విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 1 నుంచి నవంబర్ 30 లోపు ఎప్పుడైనా 15 రోజుల పాటు యూరప్  పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే పలు షరతులు కూడా విధించింది.   అక్రమాస్తుల కేసులలో నిందితుడిగా ఉండటం,  ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉండటంతో, వైఎస్ జగన్  విదేశాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. కాగా కోర్టు జగన్ యూరప్ పర్యటనకు విధించిన షరతులు ఇలా ఉన్నాయి.  జగన్  యూరప్ పర్యటనకు బయలుదేరే ముందే పూర్తి పర్యటన షెడ్యూల్‌ను  సీబీఐ అధికారులకు  అందజేయాలి. అలాగే విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.   ప్రస్తుతం స్థానిక ఎన్నికల హడావుడి మరియు రాజకీయ పరిణామాల వేళ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.  [YS Jagan, CBI Court, Europe Tour, YCP, Andhra Pradesh News, Jagan Foreign Travel, Green Signal, Conditions Apply]
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023  అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.   2024 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే , కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, ఆయనపై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం (సెప్టెంబర్ 18) సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 23, 2024 నుంచే ఆయనపై అనర్హత వేటు వేసింది. అంటే ఆ రోజు నుంచే దానం నాగేందర్ తన  శాసనసభ్య సభ్యత్వాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో మార్చి 11, 2026న దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై వచ్చిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ వారికి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అల్లె మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది.  ఈ తీర్పుపై స్పందించిన దానం నాగేందర్ తాను సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు.  హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని, ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్తేమీ కాదనీ దానం పేర్కొన్నారు. ప్రజల మధ్యలోకి వెళ్లేందుకు, ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఏ క్షణమైనా మళ్లీ పోటీ చేసి ఘనవిజయం సాధిస్తానన్నారు.  అదలా ఉండగా, దానంపై అనర్హత వేటుతో   ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.   [Danam Nagender, Telangana High Court, MLA Disqualification, Khairatabad Bypoll, Anti Defection Law, BRS Congress News, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
వరంగల్ ప్రజల ఎన్నో ఏళ్ళ కల అయిన మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో శంకుస్థాపన జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసి ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించినట్లు రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెడితే బాగుంటుందో సూచించాలని ప్రజలను కోరారు. దీనికి నెటిజెన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సైతం రెండు పేర్లు సూచించడం విశేషం. తన సొంత ఊరైన వరంగల్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కల ఎట్టకేలకు నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని సందీప్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. ఆ ఎయిర్‌పోర్ట్‌కు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో రెండు పవర్‌ఫుల్ ఆప్షన్లను సూచించారు.  అందులో మొదటిది "రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్" (RIA). వీరనారి రాణి రుద్రమదేవి గొప్పతనానికి, శౌర్యానికి గుర్తుగా ఈ పేరు సమంజసంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రెండో ఆప్షన్ చూస్తే "కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్" (KIA). కాకతీయుల వారసత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ పేరు ఉండాలని ప్రతిపాదించారు. సందీప్ రెడ్డితో పాటు మెజారిటీ నెటిజెన్లు కూడా వరంగల్ ఎయిర్‌పోర్టుకు రుద్రమదేవి, కాకతీయ పేర్లనే ఎక్కువగా సూచిస్తుండటం విశేషం. ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ.. చిరంజీవితో సినిమా ఆగిపోయిందా? https://x.com/imvangasandeep/status/2101308893385367857 https://x.com/revanth_anumula/status/2101234850938212793       [Warangal Airport, Mamnoor Airport, Sandeep Reddy Vanga, Revanth Reddy, Rani Rudrama Devi, Kakatiya Dynasty, Telangana News, Telugu News]  
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ 'కల్ట్‌'. విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాలు చేసే విశ్వక్ ఈ చిత్రంలో నటించడంతో పాటు రచన-దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఫ‌ల‌క్‌నుమాదాస్, దాస్‌ కా ధమ్కీ తర్వాత విశ్వక్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియాస్ ఫస్ట్ అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని కలవరపరిచే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డార్క్, ఇంటెన్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా #CULT తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ప్రపంచాన్ని, కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ క్యూరియాసిటీ పెంచింది. అలాగే స్నేహాన్ని పరిచయం చేస్తూ విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా మేకర్స్ 'కల్ట్‌' రిలీజ్ డేట్‌ను థ్రిల్లింగ్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. ఇది కూడా చదవండి: ఇట్లు అర్జున టీజర్.. సైలెంట్ లవ్ స్టోరీ.. సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్.! రిలీజ్ డేట్ గ్లింప్స్ మరోసారి సినిమా కథా నేపథ్యంపై ఆసక్తిని పెంచింది. విశ్వక్ సేన్ ఇంటెన్స్ కిల్లింగ్ స్ప్రీ, కోపంతో కూడిన యాటిట్యూడ్ ఈ వీడియోను మరింత షాకింగ్‌గా మార్చాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్ తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. సినిమా ఎలాంటి డార్క్ వరల్డ్‌లోకి తీసుకెళ్లబోతుందో ఈ విజువల్స్ హింట్ ఇచ్చాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్, క్యూరియాసిటీని మరింత పెంచింది. ఇంటర్నేషనల్ అప్పీల్ ఉన్న కథను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో 'కల్ట్‌'ను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో మల్టీలింగ్వల్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  మీకు నచ్చవచ్చు: ఏ పువ్వు ఏ తేటిదన్నది.. 'ఆకాశం ఏనాటిదో' పాటలో ఆ లైన్లకు అర్థం తెలుసా.?       [CULT Release Date Promo, CULT Movie Release Date, Cult Movie Telugu, Vishwak Sen, Gayatri Bharadwaj, Telugu Movies 2026, Telugu Film News, Telugu News]  
  హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఉండేలా కొంత మంది సినీ తారల్ని దేవలోకమే ఇండస్ట్రీకి పంపిస్తుంది. అలాంటి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. మరి ప్రస్తుత సినీ లోకంలో వరుసగా రెండు డిజాస్టర్స్ వస్తే పెట్టా, బేడా సద్దుకొని సొంత ఊరుకి వెళ్లాల్సిందే. అలాంటిది నాలుగు డిజాస్టర్స్ వచ్చినా భాగ్యశ్రీ బోర్సే కి క్రేజీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఆ కోవలోనే లెనిన్ రావడం, హిట్టు కొట్టడం చకచక జరిగిపోయాయి. ఇప్పుడు ఈ భామ డై  హార్డ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చినంత పని చేసింది.    రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో భాగ్యశ్రీ మాట్లాడుతు గ్లామర్ రోల్స్ తో మాత్రమే కాకుండా, బలమైన నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్  కూడా చేయాలని ఉంది. నటనే నాకు ముఖ్యం. తద్వారా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఉందని చెప్పుకొచ్చింది. అంటే ఫ్యూచర్ లో భాగ్యశ్రీ ని నెగిటివ్ రోల్స్ లో కూడా చూస్తామేమో. ఏది ఏమైనా 'వెన్నపూస' సైతం భాగ్యశ్రీ నటన చూస్తే కరిగిపోతుందనేది పక్కా.    ఇది కూడా చదవండి: పల్లెల్లో 'ఇరుముడి' ప్రొజెక్టర్ పండుగ: పుణ్యం చేసుకుంది ఎవరు!     ప్రస్తుతం శివ కార్తికేయన్ తో 'సెయెన్' లో చేస్తుంది. రామ్ చరణ్, సుకుమార్ ల కొత్త చిత్రంలో కూడా ఉండబోతుందనే రూమర్ అయితే చాలా రోజుల నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంది.    మీకు నచ్చవచ్చు : శ్రీ వినాయక విజయము: గణపతి భక్తులు తప్పక చూడాల్సిన క్లాసిక్ మూవీ.!     [Bhagyashri Borse, Villain Role, lenin, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]  
న్యాచురల్ స్టార్ నాని పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు  శ్రీకాంత్ ఓదెల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.  ‘ది ప్యారడైజ్’ కథకు స్ఫూర్తి ఏమిటి? -ఈ కథకు నిజ జీవిత సంఘటన, కొన్ని పాత్రలు, అలాగే ఫిక్షన్.. ఈ మూడు ఉన్నాయి.  -మా అమ్మగారు ఆడపిల్ల పుడితే బాగుంటుందని భావించారు. కానీ పుట్టలేదు. నాకే జడలు వేసి, గౌన్ వేసి పెంచారు. నా రెండో క్లాస్ వరకు నాకు జడలు ఉండేవి. జడలు అక్కడి నుంచి తీసుకున్నాను. దీని వెనుక కూడా చాలా ఎమోషన్ ఉంటుంది.  - ఇందులో ఉండే రెవల్యూషన్, ఆ పాత్రలను నేను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతం నుంచి స్ఫూర్తి పొందినవి. ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాల మధ్యలో జరిగిన సంఘటనలు తీసుకున్నాను. నేను సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో ఉన్నాను. ఆ పక్కన ఉండే బస్తీలో జరిగే కథలాగా డిజైన్ చేశాను. మా ఊర్లో నేను చూసిన సంఘటనలన్నీ మళ్లీ ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యాయి. ఇందులో నానిని ఎలా చూపించాలని అనుకున్నారు? దసరాలో మిస్ అయిన నాని ఇందులో చూపిస్తారని విన్నాం ?  -‘దసరా’ని ఒక మంచి డ్రామాగా చేయాలనేది నా ఉద్దేశం. కాకపోతే ప్రమోషనల్ కంటెంట్ చూసి అదొక ‘కేజీఎఫ్’లా చాలా మాస్‌గా ఉంటుందని అనుకున్నారు. థియేటర్‌లోకి వెళ్లి చూసిన తర్వాత ప్యూర్ డ్రామా ఉంది. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యారని నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. కాకపోతే రెండు రోజుల తర్వాత దానికి ట్యూన్ అయిపోయారు. సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. రికార్డ్స్ వచ్చాయి. -కాకపోతే అప్పుడు ఆడియన్స్ కోరుకునేది తీస్తే అది కమర్షియల్‌గా హై ఫీల్ అవుతారు కదా అని అనిపించి, అలా నాని గారి దగ్గరికి వెళ్లి ఈ ఆలోచన చెప్పాను. ఆడియన్స్ కోరుకునేది ఇవ్వాలని ఉద్దేశంతో ఇప్పుడు ‘ప్యారడైజ్’ తీసుకొస్తున్నాం. -‘ప్యారడైజ్’లో యాక్షన్, ఎమోషన్స్, మదర్ అండ్ సన్ ఎమోషన్ అన్నీ కూడా బ్లెండ్ అయి ఉంటాయి. అయితే నాకు అడిగితే యాక్షన్ కంటే ఎమోషన్ డామినేట్ చేస్తుందని భావిస్తున్నాను. ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్‌కు చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతారు. ఇది కూడా చదవండి: డ్రాగన్‌లో లవ్ సాంగ్.. ఎన్టీఆర్ కోసం రూట్ మార్చిన నీల్..  ఫ్లాష్‌బ్యాక్ ట్విస్ట్ లీక్.! ట్రైలర్ ఇవ్వకపోవడం వెనుక కారణం? -ముందే చెప్పినట్టు ఆ ట్రైలర్ కట్ చేయడానికి చాలా సమయం కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత సమయం ట్రైలర్ కి కేటాయించలెం. నేను ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలనుకుంటున్నాను. కానీ నాకు పర్సనల్‌గా అడిగితే.. మనం చిన్నప్పుడు ఏమీ చూడకుండానే థియేటర్‌లోకి వెళ్లి ప్రతి మూమెంట్‌కు సర్‌ప్రైజ్ అయ్యేవాళ్లం. నాకు పర్సనల్‌గా అలా నేరుగా థియేటర్‌కి వెళ్లి సర్‌ప్రైజ్ అవ్వడమే ఇష్టం. నా నెక్స్ట్ సినిమాకి సాధ్యమైనంత తక్కువ అప్‌డేట్స్‌తోనే సినిమాని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాను. చివరి 40 రోజులుగా మీరు, మీ టీం అసలు ఇంటికి కూడా వెళ్లలేదని విన్నాము? -నేను ఏదైనా మనస్ఫూర్తిగా, నేను అనుకున్నది వచ్చేంతవరకు చేస్తాను. ఈ విషయంలో మా టీంను ఇబ్బంది పెట్టాను. (నవ్వుతూ) నేను అనుకున్న షాట్ వచ్చేంతవరకు వందసార్లు అయినా తీస్తాను. కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత మళ్లీ రీషూట్ జోలికి వెళ్లను. షూటింగ్‌లో జాప్యం జరగడానికి కారణం? -నేను అనుకున్న విధంగా షూట్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. దాని కారణంగా డేస్ పెరిగాయి. ఒకరోజు టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్‌లో ఫినిష్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఆ టార్గెట్ ఫినిష్ చేయలేకపోయాను. దానివల్ల మళ్లీ అందరి డేట్స్ అడ్జస్ట్ చేసి చేయాల్సి వచ్చింది. అంతేగానీ కంటెంట్, రీషూట్ అనేది సమస్య కాదు. ఈ సినిమా కోసం ఎక్కడా రీషూట్‌లు చేయలేదు. అలాగే మొదట ఏదైతే బౌండ్ స్క్రిప్ట్ అనుకున్నానో దాని ప్రకారమే చేశాను. నాని గారితో మీకు చాలా అనుబంధం ఉంది కదా? -నాని గారు, నేను అన్నదమ్ముల్లాగే మాట్లాడుకుంటాం. నాకు దర్శకుడిగా జీవితం ఇచ్చారు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయనతో నేను ప్రతిదీ చెప్తాను. అనిరుధ్ మ్యూజిక్ గురించి? -అనిరుధ్‌తో పని చేయడం చాలా హాయిగా ఉంటుంది. నేను ఏం చెప్పాలనుకున్నానో క్లియర్‌గా అర్థం అవుతుంది. మనకున్న మెంటల్ మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా ఉంటే దాని కిక్కు వేరుగా ఉంటుంది. (నవ్వుతూ) ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో అలా చేశాం. ఇందులో బిట్స్ సాంగ్స్ కలుపుకొని మొత్తం ఆరు పాటలు ఉంటాయి. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా? -ఈ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ ఏమీ లేదు. ఇది సింగిల్ మూవీ. ‘ఏష నాగుల’ పాట గురించి? -నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఆటోలో ప్రతిరోజూ ఆ పాట పెట్టేవారు. అనిరుధ్‌కి ఐడియా చెబితే చాలా అద్భుతంగా చేశాడు. నిజానికి ‘దసరా’లోనే ఆ పాట పెట్టాలని అనుకున్నాను. ఇందులో కుదిరింది. నాకు జానపద గీతాలు అంటే చాలా ఇష్టం. ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు? -170 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొదట ప్లానింగ్ ప్రకారం 160 రోజుల్లో అయిపోతుంది అనుకున్నాను. కానీ సినిమా వెళ్తున్న ఫ్లోలో ఒక పది రోజులు పెరిగింది. అసలు మీకు సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది? -నేను తొమ్మిదో క్లాసులో ఉండగా ‘జగడం’ సినిమా వచ్చింది. ఆ సినిమాని థియేటర్‌లో చూసి నేను కూడా సినిమా తీయాలని బలంగా ఫిక్స్ అయిపోయాను. ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. నేరుగా సుకుమార్ గారిని కలవడానికి  వెళ్లాను. పొద్దున లేచి ఆయన గేటు దగ్గర నిలబడటమే నాకు పని. అలా నాలుగేళ్లు అయిన తర్వాత ఆయన ఒక షార్ట్ ఫిలిం చేసి తీసుకురమ్మన్నారు. అది చూసి జాయిన్ చేసుకున్నారు. ఆయన దగ్గర ‘రంగస్థలం’ సినిమాకి పని చేశాను. చిరంజీవి గారితో సినిమా గురించి? -‘ప్యారడైజ్’ రిలీజ్ అయిన తర్వాత ఒక మూడు నెలలు  రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. బ్రెయిన్‌కి రెస్ట్ కావాలి. ఇదే విషయాన్ని చిరంజీవి గారితో కూడా చెప్పాను.(నవ్వుతూ) కాస్త ఫ్యామిలీ సమయం గడపాలని అనుకుంటున్నాను. చిరంజీవి గారితో సినిమా 100% ఉంటుంది. మీకు నచ్చవచ్చు: పెళ్ళంటే పందిళ్ళు.. పెళ్ళి పాటను ఇలా రాయడం ఆత్రేయకే సాధ్యం.!       [Srikanth Odela Interview, The Paradise Movie, Natural Star Nani, Paradise Stoy, Nani Paradise, Megastar Chiranjeevi, Srikanth Odela, Telugu Film News, Telugu News]  
The teaser of Itllu Arjuna, starring debutant Aniesh and Anaswara Rajan, has been unveiled, offering a glimpse into a youthful love story packed with romance, comedy and action. The film has generated curiosity through its songs and promotional glimpses, with Aniesh’s decision to play a mute character in his debut becoming a talking point. The teaser introduces Arjun (Aniesh), a mute young man who falls in love with his neighbour Keerthy (Anaswara Rajan). While others struggle to understand his gestures, Keerthy quickly connects with him. As their relationship grows, troubles surrounding her escalate, pushing Arjun into his own Kurukshetra as he fights to protect the woman he loves. Aniesh appears confident in the challenging role, with his expressions, body language and dancing skills adding to the character. He handles the romantic, comic and action sequences with ease. Anaswara brings charm to Keerthy, while the teaser’s lively exchanges and comedy of errors suggest that the film will avoid a melodramatic treatment of its central premise. Directed by Mahesh Uppala and produced by Venky Kudumula, Itllu Arjuna features music by S Thaman, whose background score adds energy to the teaser. The film is scheduled for a theatrical release on October 30.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి చేస్తున్న మూవీ 'ఇట్లు అర్జున'. యంగ్ హీరో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ సినిమాకి మహేష్ ఉప్పాల దర్శకుడు. అక్టోబర్ 30న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలయింది. ఇందులో హీరో అనీష్ మాటలు రాని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి హీరోయిన్ అనస్వర రాజన్ ప్రేమ ఎలా పొందాడు? ఇద్దరి మనసులు ఎలా మాట్లాడుకున్నాయి? అనేది టీజర్ లో ఆసక్తికరంగా చూపించారు. హీరో పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. "అతను చాలా చెప్పాలనుకుంటాడు, కానీ ఎవ్వరికీ అర్థం కాదు" అంటూనే.. అతని ప్రేమను, ఎమోషన్ ని ఎవరైనా సరే ఫీల్ అవ్వాల్సిందే అని ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. హీరోయిన్ తో కనెక్ట్ అవ్వడానికి హీరో పడే ఆరాటం, సైగలతోనే చెప్పే క్యూట్ లవ్ సీన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉన్నట్టుగా టీజర్ లో చూపించారు. విజువల్స్, థమన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకున్నాయి.  ఇది కూడా చదవండి: 37 సీక్రెట్ ఇదే.. అల్లు అర్జున్ 'రాకా'లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్.! మీకు నచ్చవచ్చు: పెళ్ళంటే పందిళ్ళు.. పెళ్ళి పాటను ఇలా రాయడం ఆత్రేయకే సాధ్యం.!       [Itllu Arjuna Teaser, Itlu Arjuna Teaser, Aniesh, Anaswara Rajan, Venky Kudumula, Mahesh Uppala, Thaman S, Telugu Film News, Telugu News]  
ఇరుముడి మేకర్స్ పుణ్యం చేసుకున్నారో, నటీనటులు పుణ్యం చేసుకున్నారో, లేక ప్రేక్షకులు పుణ్యం చేసుకున్నారో లేదో తెలియదు గాని మీ పుణ్యం చల్లగుండా అనే వర్డ్ ని   నిత్యం తెలుగు సినిమా ప్రేమికులు, ప్రేక్షకులు చెప్పుకునే పరిస్థితి.  ఇరుముడి నిన్న శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి  వచ్చింది. సాధారణంగా ఒక సినిమా ఓటీటీలోకి వస్తే ప్రజలు తమ ఇళ్లలోనే స్మార్ట్ టీవీల్లో లేదా మొబైల్ ఫోన్లలో డిజిటల్ స్క్రీన్లకు పరిమితమై ఒంటరిగా వీక్షిస్తుంటారు. కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం పల్లెటూర్లలో సరికొత్త విప్లవాత్మక దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామీణ సెంటర్లు, వీధులు, గల్లీలలోని మండపాల వద్ద స్థానికులు పెద్ద టీవీ స్క్రీన్లు, బిగ్ ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి ఉచితంగా చూపిస్తున్నారు. Also Read: నాలుగేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి గేటు బయటనే: శ్రీకాంత్ ఓదెల వ్యాఖ్యలు వైరల్ రాత్రి వేళల్లో ఊరి పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఒకేచోట కలిసి కూర్చుని సినిమా చూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిత్రంలోని 'ఇరుముడి కట్టు', 'మల్లెపూల పల్లకి' వంటి ప్రజాదరణ పొందిన జానపద, భక్తి గీతాలు ప్లే అవుతున్న సమయంలో వయస్సుతో సంబంధం లేకుండా పిల్లా పెద్దలు ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్నారు. మరోవైపు తండ్రీకూతుళ్ల బాండింగ్ క్లైమాక్స్ సన్నివేశాలు వస్తున్నప్పుడు వేలాది మంది కంటతడి పెట్టుకోవడం ఆ సన్నివేశాలలోని గాఢతను చాటిచెబుతోంది.     ఒకప్పుడు ప్రొజెక్టర్ రయ్యిమని తిరుగుతుంటే కళ్లప్పగించి చూసే ఆనాటి టూరింగ్ టాకీస్ అనుభూతిని ఈ దృశ్యాలు పునరావృతం చేస్తున్నాయి. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన 'ఇరుముడి' ఇప్పుడు ఓటీటీ ద్వారా పల్లెటూరి వీధుల్లో పండగ వాతావరణాన్ని నింపి, తెలుగు ప్రజలను మళ్లీ ఒకే వేదికపైకి తెచ్చి కట్టిపడేస్తోంది. అందుకే మీ పుణ్యం చల్లగుండా అనే వర్డ్ నిత్యం తెలుగు ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతూ ఉంది. మీకు నచ్చవచ్చు : తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా..' తెలుగు వారి మనసుల్లో గుడి కట్టుకున్న పాట.!   [Irumudi Village Open Screenings,  Irumudi Ott Records, Irumudi, Raviteja, Shiva Nirvana, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]    
సినీ రంగంలో దర్శకుడు అవ్వడమంటే అంత ఈజీ కాదు. కానీ డైరెక్టర్ అయ్యి  బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం ఏ జన్మలో చేస్తుకున్న అదృష్టమో అని అందరూ చూసి అసూయా పడే పరిస్థితి. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో ఉండే అత్యున్నత పదవులు కూడా సినీ డైరెక్టర్ ముందు దిగదుడుపు అని సినీ అభిమానులు చెప్తుంటారు.  ఇప్ప్పుడు ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పరిస్థితి కూడా అదే. నానితో 'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టి, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 121 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిన  శ్రీకాంత్  తెలంగాణలోని గోదావరిఖనికి చెందిన ఈ యంగ్ డైరెక్టర్, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి తన కలని  నిజం చేసుకున్నాడు . ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల తన గురువు, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ను కలవడానికి పడిన నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ గురించి పంచుకున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సుకుమార్ దర్శకత్వ శైలికి ఎంతగానో ఆకర్షితుడైన శ్రీకాంత్ ఓదెల, ఆయన వద్ద సహాయ దర్శకుడిగా పనిచేయాలని బలంగా నిశ్చయించుకున్నారు. అందుకోసం ప్రతిరోజూ సుకుమార్ ఇంటి ముందుకు వెళ్లి గేటు బయటే గంటల తరబడి నుంచొనేవారు. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా 4 సంవత్సరాల పాటు ఓపికగా నిరీక్షించారు. ప్రతిరోజూ గేటు బయట తనకోసం నుంచుంటున్న ఈ కుర్రాడి పట్టుదలను గమనించిన సుకుమార్, ఒకరోజు శ్రీకాంత్‌ను లోపలికి పిలిచి మాట్లాడారు. ముందుగా ఒక షార్ట్ ఫిలిం చేయమని ప్రోత్సహించి శ్రీకాంత్ ప్రతిభను పరీక్షించారు. శ్రీకాంత్ చేసిన ఆ ప్రయత్నం నచ్చడంతో ఆయనలోని మేధస్సును, సినిమా పట్ల ఉన్న అంకితభావాన్ని గుర్తించి తన దర్శకత్వ శాఖలోకి సహాయకుడిగా తీసుకున్నారు. ఇది కూడా చదవండి: మేకర్స్ ,హీరో, హీరోయిన్స్ కి షాక్: జయహో ప్రేక్షక మహాదేవా! ఆ తర్వాత సుకుమార్ తెరకెక్కించిన 'నాన్నకు ప్రేమతో' (2016), మరియు రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'రంగస్థలం' (2018) చిత్రాలకు శ్రీకాంత్ ఓదెల అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ రెండు పెద్ద ప్రాజెక్టులపై పనిచేస్తున్న సమయంలోనే సినిమా మేకింగ్, కథనంలో ఉండాల్సిన డెప్త్, ప్రతి పాత్రను మలిచే విధానంలో సుకుమార్ పాటించే మెళకువలను ప్రత్యక్షంగా నేర్చుకున్నారు. 'రంగస్థలం' సినిమా నిర్మాణం సమయంలో సుకుమార్ ఏ రూమ్‌లో, ఏ కుర్చీలో కూర్చుని కథా చర్చలు సాగించేవారో, సీన్లు ప్లాన్ చేసేవారో శ్రీకాంత్ దగ్గరుండి చూశారు. కాలం ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ లైవ్ ఉదాహరణగా నిలిచింది.   తన మొదటి చిత్రం 'దసరా' ఘన విజయం సాధించిన తర్వాత, నానితోనే తన రెండవ భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' ను శ్రీకాంత్ ఓదెల ప్రారంభించారు. ఈ చిత్ర ఆఫీస్ పనుల కోసం ఆయన ఎంచుకున్న రూమ్ మరేదో కాదు, ఒకప్పుడు తన గురువు సుకుమార్ 'రంగస్థలం' మేకింగ్ కోసం ఉపయోగించిన అదే ఆఫీస్, అదే రూమ్! అంతేకాదు, ఒకప్పుడు తను అసిస్టెంట్‌గా నిలబడి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న ఆ గదిలో, ఈరోజు అదే సుకుమార్ కూర్చున్న కుర్చీలోనే శ్రీకాంత్ ఓదెల ఒక స్టార్ డైరెక్టర్‌గా కూర్చుని 'ది ప్యారడైజ్' పనులను పర్యవేక్షిస్తున్నారు. తొలిసారి ఆ కుర్చీలో కూర్చునే ముందు "నేను ఈ కుర్చీలో కూర్చోవచ్చా లేదా" అని కాస్త తడబడ్డానని, ఆ క్షణం కళ్లలో నీళ్లు తిరిగాయని ఎమోషనల్ అయ్యారు శ్రీకాంత్. నాలుగేళ్లు గేటు బయట నుంచున్న చోటు నుండి, 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే స్థాయికి ఎదిగిన శ్రీకాంత్ ఓదెల ప్రయాణం ప్రతి ఒక్క సినీ ప్రేమికుడికి, సినీ ఆశావాదులకి గొప్ప స్ఫూర్తినిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.     మీకు నచ్చవచ్చు : అందాల ఆడబొమ్మ: బాలయ్య ఆల్ టైం క్లాసిక్ సాంగ్.! 
సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  "వేట్టువం" సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్స్ ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్ నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న "వేట్టువం" సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  తాజాగా "వేట్టువం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వేట్టువం వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోకు తెలుగులో రానా దగ్గుబాటి, మలయాళంలో సౌబిన్ షాహిర్, కన్నడ వెర్షన్ కు కిచ్చా సుదీప్, తమిళంలో పా. రంజిత్ వాయిస్ అందించారు.  ఈ సినిమాలో ఎలాంటి కథను ప్రేక్షకులకు చూపించబోతున్నారో వరల్డ్ ఆఫ్ "వేట్టువం" వీడియోలో మేకర్స్ తెలియజేశారు. పూర్వకాల ప్రజల జీవన విధానం వల్ల ఏర్పడిన ప్రభావం ప్రస్తుతాన్ని ఎలా మార్చింది దాని ఫలితంగా ప్రకృతి సృష్టించే విపత్తు ఏంటి ? భవిష్యత్ లో ఎలాంటి మార్పులు రాబోతాయంటూ మూడు కాలాల గురించి డిస్కస్ చేస్తుందీ సినిమా. ఎవరు బలవంతులు, అధికారం ఎవరికుండాలి అని నిరూపించుకోవడానికి కొన్ని తెగల మధ్య జరిగే పోరాటే ఈ "వేట్టువం" సినిమా అంటూ వరల్డ్ ఆఫ్ వేట్టువం తెలుపుతుంది.  ఇది కూడా చదవండి: భూ కబ్జా.. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ పై కేసు నమోదు.! ఈ చిత్రంలో ధర్మరాజన్ అనే పాత్రలో ఆర్య, సేంబియన్ క్యారెక్టర్ లో షబీర్, కలైయరాసన్ పాత్రలో వీరవర్మన్, రాధి క్యారెక్టర్ లో శోభిత ధూళిపాళ్ల, వె.ర.దినేష్ నందన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నటీనటులు ఎంతో శ్రమించి అడిమురై, మాల్కమ్ వంటి సంప్రదాయ యుద్ధకళలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకున్నారు అనేది ఈ వీడియోలో ఆకట్టుకుంటోంది. "వేట్టువం"తో దర్శక నిర్మాత పా.రంజిత్ మరో భారీ ప్రయత్నం చేసినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. మీకు నచ్చవచ్చు: అందాల ఆడబొమ్మ.. బాలయ్య ఆల్ టైం క్లాసిక్ సాంగ్.!        [World Of Vettuvam, Vettuvam First Look, Director Pa Ranjith, Sobhita Dhulipala, Pa Ranjith Movies, Telugu Film News, Telugu News]  
  కొన్ని సినిమాలు అంతేనండి బాబు. ఆ మాటకొస్తే కొన్ని సినిమాలు ఏముందిలే మాగ్జిమమ్ చాలా సినిమాల్లో డ్రగ్, హింస చాలా ఎక్కువ మోతాదులో ఉంది. విచిత్రంగా హీరో నే వాటికి బానిసగా ఉంటాడు. హీరోయిన్ కూడా ఎంకరేజ్ చేసి ఇద్దరు తమ మధురమైన ప్రేమ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా అదే బాపతుని అవలంబించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రేక్షకుడు 'స్వామి వివేకానంద. అవతారం కాదు కదా! వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2026  సినిమాటోగ్రాఫ్ చట్టం కింద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) కోసం సరికొత్త మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల్లో అత్యంత ప్రధానమైన మార్పు డ్రగ్స్ , మత్తు పదార్థాల దృశ్యాలకి  సంబంధించినది. సినిమాలో మాదకద్రవ్యాల వాడకం, విక్రయం లేదా ట్రాఫికింగ్ సన్నివేశాలు వచ్చినప్పుడు, తెరపై ఖచ్చితంగా "అక్రమ మత్తుపదార్థాలు ఆరోగ్యానికి హానికరం మరియు ఖచ్చితంగా జైలు శిక్షకు దారితీస్తాయి. డ్రగ్స్‌కు నో చెప్పండి" అనే చట్టబద్ధమైన హెచ్చరిక సందేశాన్ని ప్రదర్శించడం ఇకపై తప్పనిసరి చేశారు. గతంలో సిగరెట్, మద్యం సన్నివేశాలకు మాత్రమే పరిమితమైన ఈ హెచ్చరికలు, ఇకపై మత్తు పదార్థాల దృశ్యాలకు కూడా వర్తిస్తాయి. కేవలం సినిమాలకే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లకు కూడా ఇదే తరహా నిబంధనలను పాటించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దీనితో పాటు, సినిమాల వయస్సు వారీ వర్గీకరణలో కూడా స్పష్టత తెచ్చారు. మే 2025లో అమల్లోకి తెచ్చిన 'U/A 7+', 'U/A 13+' మరియు 'U/A 16+' వర్గీకరణలను ఈ నూతన గైడ్‌లైన్స్‌లో మరింత బలోపేతం చేశారు. దీనివల్ల తమ పిల్లలు ఏ రకమైన కంటెంట్ చూస్తున్నారో తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు మరింత స్పష్టమైన అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా, సమాజంలో హింస, నేర విధానాలు, అసాంఘిక కార్యకలాపాలను ప్రాచుర్యంలోకి తెచ్చేలా లేదా గ్లామోరైజ్ చేసేలా చూపించకూడదని సీబీఎఫ్‌సీ స్పష్టం చేసింది. దేశద్రోహ ఆలోచనలు, మత విద్వేషాలు, శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధమైన విషయాలు, విదేశాలతో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే అంశాలు లేకుండా జాగ్రత్తలు వహించాలని బోర్డు తేల్చిచెప్పింది. ఇది కూడా చదవండి: విజయ్ ఫోన్ కాల్ సీక్రెట్ బయటపెట్టిన విజయ్ సేతుపతి.. ఫుల్ వైరల్ మామ!     మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదో ఒక సన్నివేశాన్ని మాత్రమే విడిగా చూడకుండా, సినిమా మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించి సర్టిఫికేషన్ ఇస్తారు. కళాత్మక స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య సరైన సమతుల్యత సాధించడమే లక్ష్యంగా సెన్సార్ బోర్డ్‌ను 18 మంది ప్రముఖులతో ఇటీవల పునర్వ్యవస్థీకరించారు. నటులు ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, పల్లవి జోషి, డైరెక్టర్ ప్రియదర్శన్ మరియు ఆస్కార్ విజేత రిక్కీ కేజ్ వంటి ప్రముఖులు ఈ కొత్త బోర్డులో సభ్యులుగా ఉన్నారు.దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, అంటే డిసెంబర్ 1991 నాటి పాత నిబంధనల స్థానంలో ఈ కొత్త గైడ్‌లైన్స్ అమల్లోకి రావడం విశేషం. ఈ సరికొత్త నిబంధనలు చలనచిత్ర రంగానికి మరియు ప్రేక్షకుల వీక్షణ విధానానికి అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనున్నాయి.    మీకు నచ్చవచ్చు : నా మనసుకేమయింది: 90s కిడ్స్ ఫేవరెట్ సాంగ్.. సిరివెన్నెల కలం చేసిన మ్యాజిక్.!         [Cbfc, Cbfc New Film Certification Guidelines 2026, mandatory drug warnings , censor board new rules, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]
మానవ శరీరం అత్యంత సంక్లిష్టమైనది, అందులోనూ మెదడు మరింత అద్భుతమైన నిర్మాణంతో కూడుకున్నది. శతాబ్దాలుగా వైద్య ప్రపంచం మరియు సైన్స్ రంగం మానవ మెదడును ఒకే రకమైన మూల కణ సమూహం నుండి ఉద్భవించిన ఒకే అవయవంగా భావిస్తూ వచ్చాయి. అంటే పిండం అభివృద్ధి చెందే ప్రాథమిక దశలోనే ఒకే మూలం నుంచి మెదడులోని వివిధ భాగాలు రూపుదిద్దుకుంటాయని విశ్వసించారు. అయితే అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా పరిశోధన ఈ పాత నమ్మకాలను పూర్తిగా తిరగరాస్తోంది. మానవ మెదడు ఒకే మూలం నుండి కాకుండా, రెండు వేర్వేరు కణ సమూహాల నుంచి స్వతంత్రంగా ఆవిర్భవించిందని ఈ సంచలన అధ్యయనంలో తేలింది. స్టాన్‌ఫోర్డ్ డెవలప్‌మెంటల్ బయోలాజికల్ రీసెర్చర్ మరియు ఈ అధ్యయన సీనియర్ రచయిత కైల్ లోహ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ కొత్త విషయాన్ని ప్రపంచానికి వెల్లడించింది. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 500 మిలియన్ సంవత్సరాల క్రితమే స్వతంత్రంగా అభివృద్ధి చెందిన రెండు వేర్వేరు కణ వ్యవస్థల కలయిక ద్వారా మన మెదడు రూపుదిద్దుకుంది. మానవ మెదడును సాధారణంగా పూర్వ మెదడు, మధ్య మెదడు, పశ్చాత్ మెదడు అనే మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజిస్తారు. భాష, తార్కిక ఆలోచన, చైతన్యం, అమూర్త ఆలోచనల వంటి సంక్లిష్టమైన సామర్థ్యాలకు పూర్వ మెదడు కేంద్రంగా నిలుస్తుంది. మరోవైపు శ్వాస తీసుకోవడం, హృదయ స్పందనలు, నిద్ర, ఆకలి వంటి ప్రాథమిక జీవక్రియలతో పాటు ముఖ కదలికలు, మాట్లాడటం, మింగడం వంటి కార్యకలాపాలను పశ్చాత్ మెదడు నియంత్రిస్తుంది. పిండం అభివృద్ధి చెందే ప్రారంభ దశలోనే పూర్వ మెదడు మరియు పశ్చాత్ మెదడు ప్రాంతాలు రెండు వేర్వేరు అభివృద్ధి మార్గాలను అనుసరిస్తాయని ఈ అధ్యయనంలో గుర్తించారు. మెదడు వెనుక భాగంతో పోలిస్తే ముందు భాగం పూర్తిగా భిన్నమైన మూల కణ సమూహం నుండి ఉద్భవిస్తుందని ప్రయోగాత్మకంగా నిరూపించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ విభజన కేవలం మానవులకే పరిమితం కాలేదని, కోళ్లు, జీబ్రాఫిష్, ఏకార్న్ వార్మ్స్ వంటి ఇతర ప్రాణుల జీవ పరిణామ క్రమంలో కూడా ఇదే రెండు భాగాల అభివృద్ధి నమూనా స్పష్టంగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని బట్టి ఈ పరిణామ ప్రక్రియ జీవుల చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైనదని స్పష్టమవుతోంది. వైద్య వైజ్ఞానిక రంగానికి ఈ ఆవిష్కరణ ఒక గొప్ప మైలురాయిగా మారనుంది.  ప్రయోగశాలల్లో మానవ పశ్చాత్ మెదడు కణాలను కృత్రిమంగా పెంచడం శాస్త్రవేత్తలకు ఎంతో కష్టతరంగా ఉండేది. కానీ ఈ కొత్త అవగాహన సహాయంతో స్టాన్‌ఫోర్డ్ పరిశోధకుల బృందం మూలకణాల నుంచి విజయవంతంగా హిండ్ బ్రెయిన్ మోటార్ న్యూరాన్లను రూపొందించింది. ప్రయోగశాలలో రూపుదిద్దుకున్న ఈ న్యూరాన్లు విద్యుత్ క్రియాశీలతను ప్రదర్శించడమే కాకుండా, ముఖం మరియు మింగే కండరాలను నియంత్రించే ప్రత్యేక ప్రోటీన్లను కూడా ఉత్పత్తి చేశాయి. ఈ విప్లవాత్మక ఫలితాలు రాబోయే రోజుల్లో మోటార్ న్యూరాన్ వ్యాధులైన అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ (ALS), స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) వంటి తీవ్రమైన నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో కొత్త వెలుగులు నింపనున్నాయి. ప్రయోగశాలలో నాడీ కణాలను సృష్టించి, వ్యాధి బారిన పడినప్పుడు కణాలు ఎలా దెబ్బతింటున్నాయో నిశితంగా పరిశీలించడానికి ఇది దోహదపడుతుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో నూతన ఔషధాలు, జీన్ థెరపీలను విజయవంతంగా పరీక్షించే అవకాశం కలుగుతుంది. రానున్న రోజుల్లో వెన్నుపాముతో పాటు నాడీ వ్యవస్థలోని ఇతర భాగాలకు కూడా ఇలాంటి ప్రాచీన అభివృద్ధి మూలాలు ఉన్నాయా అనే కోణంలో శాస్త్రవేత్తలు మరిన్ని విస్తృత పరిశోధనలు నిర్వహించనున్నారు.     [ Human Brain, Brain Development, Stanford University, Stem Cells, Kyle Loh, Forebrain, Hindbrain, Motor Neurons, ALS, Spinal Muscular Atrophy ]
మన చిన్నతనంలో అమ్మమ్మలు, నాయనమ్మలు చేతులతో స్వయంగా చేసిన వంటల రుచి, ఆ సువాసనలు ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతాయి. మైదా పిండి, నీళ్లతో పిండి కలిపి, క్షణాల్లో సన్నని రవ్వలాంటి సేమియాను తమ చేతులతోనే తయారుచేసి, పెద్ద పెద్ద పళ్లెంలో వేసి తిరిగే పంఖా కింద ఆరబెట్టే ఆ దృశ్యాలు ఇప్పటి తరానికి ఒక అపురూపమైన జ్ఞాపకం. కానీ, ఆ చేతివంట నేర్చుకోకపోవడం వల్ల, ఆ తరం మనల్ని విడిచివెళ్లాక ఆ ప్రాచీన రుచులు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోతున్నాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో, మన సాంప్రదాయ వంటల వారసత్వాన్ని, కుటుంబ మూలాలను కాపాడుకునేందుకు కొత్త తరం ఒక గొప్ప ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఆహారం అంటే కేవలం కడుపు నింపుకునే తిండి మాత్రమే కాదు, అది మన బాల్యంతో, మన సంస్కృతితో, మన మూలాలతో అనుసంధానమైన ఒక బలమైన జ్ఞాపకం. ముంబైకి చెందిన ప్రసిద్ధ ఆహార చరిత్రకారుడు కురుష్ దలాల్ ప్రకారం, ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ తగ్గుముఖం పట్టి, చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిన తర్వాతే ప్రజలు తమ సాంప్రదాయ వంటలను, ఇంటి రుచులను ఎంతగానో మిస్ అవుతున్నారు. పూర్వకాలంలో వంటల చరిత్రను, సాంప్రదాయాలను కాపాడే బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. అయితే, గత 10 ఏళ్లలో పురుషులు కూడా వంటింట్లోకి అడుగుపెట్టి, కాలగర్భంలో కలిసిపోతున్న తమ కుటుంబ సాంప్రదాయ వంటకాలను వెతికి మరీ నేర్చుకోవడం గమనార్హం. NRIలు సైతం భారతదేశానికి వచ్చినప్పుడు పాతకాలపు పార్శీ వంటకాలైన చోరా మా పాయా, వాల్, మసూర్ మా జీబ్ వంటి అరుదైన వంటకాలను అడిగి మరీ చేయించుకుని తింటున్నారంటే ప్రాచీన రుచులపై ఉన్న మక్కువ అర్థమవుతుంది. సాహిత్యం మరియు ఆహారాన్ని జోడిస్తూ బెంగళూరులో ప్రారంభమైన  ఫ్రమ్ వర్డ్స్ టు వోక్  అనే ఫుడ్-ఇన్-లిటరేచర్ క్లబ్ కేవలం 3 మంది సభ్యులతో ప్రారంభమై, నేడు 100 మందికి పైగా సభ్యులతో అలకరిస్తోంది. ప్రతీ నెలా శనివారం కలిసే ఈ క్లబ్ సభ్యులు పుస్తక పఠనం ద్వారా ఆహారానికి, సంస్కృతికి, వలసలకు, ఆకలికి మధ్య ఉన్న బంధాన్ని చర్చించుకుంటారు. మరోవైపు,  నివాలా  అనే క్యులినరీ హెరిటేజ్ ప్లాట్‌ఫారమ్‌ను స్థాపించిన శ్రుతి తన తల్లిని కోల్పోయిన తర్వాత ఈ అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఒక తరం నుండి మరొక తరానికి వంటకాలు అందించే ప్రక్రియలో ఇప్పటికే 30% నుండి 40% వరకు సాంప్రదాయ వంటకాల జ్ఞానం నశించిపోయిందని ఆమె గణాంకాలు చెబుతున్నాయి. ఈ విలువైన వంటల వారసత్వాన్ని కాపాడుకోవడానికి నివాలా ఒక సరికొత్త మార్గాన్ని కనుగొంది. వారు క్యూఆర్ కోడ్‌లు (QR Codes) కలిగిన డిజిటల్ మరియు ప్రింటెడ్ రెసిపీ పుస్తకాలను రూపొందిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే మన అమ్మమ్మలు లేదా నాయనమ్మలు ఆ వంటకాన్ని తమ సొంత గొంతుతో ఎలా చేయాలో వివరించే ఆడియో రికార్డింగ్ వినబడుతుంది. ఇది కేవలం వంట విధానం మాత్రమే కాదు, మన పెద్దల గొంతును, వారి ప్రేమను కలకాలం దాచుకునే ఒక భావోద్వేగ కానుక. వీరు ప్రచురించిన  మెమోరీస్ ఆన్ ఎ ప్లేట్  అనే పుస్తకానికి 2024 లో ప్రతిష్టాత్మక  గుర్మాండ్ వరల్డ్ కుక్‌బుక్ అవార్డు  (Gourmand World Cookbook Award) లభించింది. మీ ఇంట్లో కూడా తరతరాల నాటి వంటింటి జ్ఞాపకాలను కాపాడుకోవడానికి 6 సులువైన మార్గాలు ఉన్నాయి. మొదటిది, తాతయ్యలు, అమ్మమ్మల పేర్లు చెక్కిన పాతకాలపు కంచాలు, రాగి లేదా ఇత్తడి పాత్రలను భద్రపరుచుకోవడం. రెండవది, రోలు, పప్పు గుత్తి, చెక్క పూరీ పీట వంటి ప్రాచీన వంటింటి పరికరాలను ఫొటోలు తీసి వాటి వెనుక ఉన్న కథను రాసిపెట్టుకోవడం. మూడవది, మన పెద్దలు స్పూన్లు, గ్రాములలో కాకుండా  పిడికెడు ,  చిటికెడు  అంటూ చెప్పే అంచనా కొలతలను సరిగ్గా అర్థం చేసుకుని రికార్డ్ చేయడం. నాల్గవది, అమ్మమ్మ లేదా నాయనమ్మ వంట చేసేటప్పుడు వారి స్వరంలోనే కనీసం 30 సెకన్ల ఆడియో రికార్డ్ చేసుకోవడం. ఐదవది, తరతరాలుగా వస్తున్న ఇంట్లోనే చేసుకునే మూలికా వైద్యాన్ని, చిట్కాలను రాసి పెట్టుకోవడం. ఆరవది, వంటల తయారీలో వాడే ప్రాంతీయ పదాలను, భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవడం. కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచంలో మనుషుల జీవితాల అనిశ్చితిని గ్రహించిన చాలామంది, తమ ఇంట్లోని చివరి తరం పెద్దల వద్ద ఉన్న ఈ అమూల్యమైన రుచుల జ్ఞానాన్ని కాపాడుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు.     [ Traditional Indian Recipes, Culinary Heritage, Family Recipes, Food History, Grandmother Recipes, Parsi Cuisine, Nivala, From Words to Wok, Memories on a Plate, Gourmand World Cookbook Award ]
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఉదయాన్నే టిఫిన్ వండుకోవడానికి సమయం సరిపోక చాలామంది ఒక అరటిపండుతో తమ రోజును ముగించేస్తుంటారు. చవకగా లభించడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందనే భావనతో పరగడుపున అరటిపండు తినడం ఎంతోమందికి ఒక రోజువారీ అలవాటుగా మారిపోయింది. పొటాషియం, విటమిన్లు, ఫైబర్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండే అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనేది ఎంత నిజమో, దానిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనేది కూడా అంతే పచ్చి నిజం. పరగడుపున అరటిపండు తింటే శరీరంలో అసలు ఏం జరుగుతుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలు మరియు దాగి ఉన్న ప్రమాదాల గురించి పోషకాహార నిపుణులు వెల్లడించిన అనేక ఆసక్తికర విషయాలను ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా ఒక మీడియం సైజ్ అరటిపండులో దాదాపు 98 కేలరీలు మరియు 4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. ఉదయాన్నే దీనిని తీసుకున్నప్పుడు ఇందులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజమైన చక్కెరలు శరీరానికి వెంటనే అపరిమితమైన శక్తిని అందిస్తాయి. అలాగే అరటిలోని కరిగే పీచు పదార్థమైన పెక్టిన్ పేగుల పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ, ఇవన్నీ అరటిపండును ఇతర ఆహారాలతో కలిపి తిన్నప్పుడే సాధ్యమవుతాయి. కేవలం అరటిపండును మాత్రమే ఖాళీ కడుపుతో తీసుకుంటే, అందులోని చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా విపరీతంగా పెంచేస్తాయి. దీనిని అదుపు చేయడానికి శరీరం అధిక మొత్తంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా కొద్దిసేపటికే బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పడిపోయి, విపరీతమైన నీరసం, అలసట మరియు కడుపులో మళ్లీ ఆకలి భావన మొదలవుతాయి. మరొక ప్రధానమైన ప్రమాదం ఏమిటంటే, అరటిపండులో మెగ్నీషియం మరియు పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో అరటిపండు తిన్నప్పుడు రక్తంలో మెగ్నీషియం శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇది శరీరంలో ఉండే క్యాల్షియం మరియు మెగ్నీషియం సమతుల్యతను దెబ్బతీసి గుండెపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా అరటిపండులో ఉండే సహజ ఆమ్లత్వం వల్ల సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ మరియు కడుపులో మంట వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం) బాధిత ప్రజలు, అసిడిటీ సమస్యతో సతమతమయ్యేవారు మరియు బరువు తగ్గాలని చూస్తున్నవారు పొరపాటున కూడా ఉదయాన్నే పరగడుపున అరటిపండు తినకూడదు. అలా అని అరటిపండు తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, దానిని తినే విధానాన్ని మార్చుకుంటే చాలు. ఉదయాన్నే అరటిపండు తినాలనుకునేవారు దానిని ఎప్పుడూ ఒంటరిగా తీసుకోకూడదు. ఓట్ మీల్, గోరువెచ్చని పాలు, పెరుగు లేదా బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, ఫైబర్ తో పాటు నట్స్ లోని ప్రొటీన్లు, మంచి కొవ్వులు శరీరానికి సమతుల్యంగా అంది బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. లేదా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ పూర్తయిన తర్వాత లేదా మధ్యాహ్నం వేళలో అరటిపండు తీసుకోవడం అత్యంత సురక్షితమైన పద్ధతి. రోజువారీగా 1 నుంచి 2 అరటిపండ్లను సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.     [ Banana, Empty Stomach, Banana Benefits, Blood Sugar, Insulin, Potassium, Magnesium, Digestive Health, Diabetes, Healthy Breakfast ]
ఎర్ర గోంగూర.. కేవలం తెలుగు రాష్ట్రాల రుచుల్లోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిచుకుంది. ఆకుకూరల్లో గోంగూరకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూరలో ఆరోగ్య గుణాలు, పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది దీని పులుపుదనం వల్ల లేదా పులుపు ఎక్కువైతే ఏమన్నా సమస్యలు వస్తాయేమోనని కాస్త దూరంగా ఉంటారు. కానీ, ఎర్ర గోంగూర రోజూ లేదా వారానికి రెండు మూడు సార్లు తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. అసలు ఎర్ర గోంగూరలో  ఉండే పోషకాలు ఏమిటి? ఎర్ర గోంగూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకుంటే ఎర్ర గోంగూరను అస్సలు వదిలిపెట్టరు.  ఎర్ర గోంగూర గురించి వివరంగా తెలుసుకుంటే.. ఎర్ర గోంగూర అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రక్తహీనతకు చెక్ పెడుతుంది:  నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. ఎర్ర గోంగూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఎర్ర గోంగూర ఒక సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది:  వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు సహజంగా వస్తుంటాయి. ఎర్ర గోంగూరలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఎముకలను దృఢంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. చిన్నపిల్లల పెరుగుదలకు, ఎముకల ఎదగడానికి ఇది చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:  ఎర్ర గోంగూరలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును వేగవంతం చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, పేగుల్లో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:  ఈ ఆకుకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినందిస్తుంది. కంటి చూపు పెరిగేందుకు దోహదం చేస్తుంది:  ఎర్ర గోంగూరలో విటమిన్ ఏ తగినంత ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రేచీకటి, కళ్ళు పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తూ, దృష్టి లోపాలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి రక్షణ:  ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నిరోధించడంలో ఎర్ర గోంగూర  కీలకంగా పనిచేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు:  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలు పడకుండా చూడటానికి ఇది దోహదపడుతుంది. అలాగే తలకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి:  ఎర్ర గోంగూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న ఎర్ర గోంగూరను  దైనందిన ఆహారంలో పప్పు రూపంలోనో, పచ్చడి రూపంలోనో లేదా ఇతర కూరల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.                       *రూపశ్రీ.  
మన చుట్టూ ఎక్కడ చూసినా కనిపించే కొన్ని మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో కుప్పింటాకుకూడా ఒకటి. దీనినిపిప్పింటాకు, మురిపిండి, హరిత మంజరివంటి పేర్లతో కూడా పిలుస్తారు.  శాస్త్రీయంగా దీనిని Acalypha indica అంటారు. కుప్పింటాకును మన సంప్రదాయ వైద్య విధానాల్లో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగాపిప్పి పన్ను నొప్పి, పంటి సమస్యలు, గజ్జి, దురద, తామర వంటి చర్మ సమస్యలకు సంప్రదాయంగా ఉపయోగించే విధానాల గురించి ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరిస్తున్నారు. కుప్పింటాకు మొక్కలోని ఆకులు, వేర్లు తదితర భాగాలను వివిధ సంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగించినట్లు సమాచారం ఉంది. అయితే ఏ ఆరోగ్య సమస్యకైనా స్వయంగా చికిత్స చేసుకోవడం కాకుండా, సరైన వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కుప్పింటాకు మొక్కను ఎలా గుర్తించాలి? పిప్పి పన్ను నొప్పి, చర్మ సమస్యల వంటి వాటికి దీనిని సంప్రదాయంగా ఎలా ఉపయోగిస్తారు? ఈ ఆకు వల్ల చెప్పుకునే ఇతర ప్రయోజనాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నీలిబృంగాది తైలం పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణకు ఉపయోగించే  ఒక అద్భుతమైన మూలికా నూనెగా పేరుగాంచింది. నేటి కాలంలో పెరిగిన కాలుష్యం, మానసిక ఒత్తిడి,  జీవనశైలి సరిగా లేకపోవడం,  రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ నీలిబృంగాది తైలం ఒక సహజసిద్ధమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ నూనె గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నూనె తయారీలో వాడే పదార్థాలు.. ఈ నూనె తయారీలో నీలి, భృంగరాజ్ లేదా గుంటగలగర, ఆమ్లా లేదా ఉసిరి, శతక్రాంత, అజక్షీర అంటే మేక పాలు, మహిష క్షీర అంటే  బర్రె పాలు, గోక్షీర అంటే ఆవు పాలు,  మరియు కొబ్బరి పాలు లేదా నువ్వుల నూనె వంటి శక్తివంతమైన ఆయుర్వేద మూలికలు మరియు పాలను ఉపయోగిస్తారు. ఈ పదార్థాల కలయిక జుట్టుకు , కుదుళ్లకు కావలసిన సమగ్ర పోషణను అందిస్తుంది. ప్రయోజనాలు.. నీలిబృంగాది తైలం క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం చాలా  తగ్గుతుంది. ఇది కుదుళ్లను దృఢంగా మార్చి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే నీలి , భృంగరాజ్ మూలికలు జుట్టు సహజ రంగును కాపాడటంలో విశేషంగా తోడ్పడతాయి. చిన్న వయస్సులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో , జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జుట్టు పెరగడమే కాకుండా, తలలో వచ్చే చుండ్రు , దురద సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కుదుళ్లలో రక్తప్రసరణను మెరుగుపరచి, వెంట్రుకలు చిట్లడాన్ని , పొడిబారడాన్ని అడ్డుకుంటాయి. ఈ తైలం కేవలం జుట్టుకే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే చలవ చేసే గుణం వల్ల రాత్రి పూట ఈ నూనెతో తలకు మర్దన చేసుకుంటే ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది. కంటి అలసటను తగ్గించి, శిరోభారాన్ని ఉపశమనం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఎలా వాడాలి?  ఈ నూనెను వాడే విధానం కూడా చాలా సులభం. కొద్దిగా తైలాన్ని తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించి, మునివేళ్ళతో  సున్నితంగా మర్దన చేయాలి. కనీసం అర గంట నుండి గంట సేపు ఉంచుకున్న తర్వాత మెత్తటి సీకాయ లేదా మైల్డ్ ఆయుర్వేద షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.  సహజమైన పద్ధతిలో జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా , అందంగా మార్చుకోవడానికి నీలిబృంగాది తైలం చాలా మంచి ఎంపిక.                        *రూపశ్రీ.