జగన్ ప్రచారంలో బాబాయ్ నామస్మరణ

కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరు ప్రస్తుతం ఈ సామెత చెప్పినట్టే వుంది. బాబాయి వివేకా హత్యను ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష తెలుగుదేశంతోపాటు, తన సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీత  ప్రస్తావించే అవకాశం వుంది కాబట్టి, అలా ప్రస్తావిస్తే అది తనకు నెగటివ్ అయ్య ప్రమాదం వుంది కాబట్టి వైసీపీ వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రతిపక్ష పార్టీలతోపాటు వివేకా కుటుంబ సభ్యులు కూడా వివేకా హత్య గురించి మాట్లాడకూడదని కోర్టు  ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరూ వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడ్డం లేదు. కానీ, ఇప్పుడు వివేకా హత్య గురించి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడే బాధ్యతను స్వయంగా జగనే తీసుకున్నారు. ఏ సభలో మాట్లాడినా వివేకా ప్రస్తావన తప్పకుండా తెస్తున్నారు. చిన్నాన్నకి రెండో భార్య వున్నట్టు అందరికీ తెలుసు కదా అని జనంతో అంటున్నారు. అవినాష్ రెడ్డి చాలా అమాయకుడు అన్నట్టు సర్టిఫికెట్ ఇస్తున్నారు. కోర్టు వివేకా హత్య గురించి ప్రతిపక్షాలు, షర్మిల, సునీత మాట్లాడవద్దని అన్నదే తప్ప నన్ను కాదు కదా అని జగన్ భావిస్తున్నారో ఏమో. ఏది ఏమైనా వివేకా హత్య గురించి ప్రస్తావించి రాజకీయంగా లాభం పొందాలని జగన్ అనుకుంటే అది బూమ్‌రాంగ్ అవడం ఖాయం.
Publish Date: Apr 26, 2024 7:05PM

ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి 3 సీట్లు వ‌స్తే, ముద్ర‌గ‌డ ఇంట్లో అంట్లు తోముతా

ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది.  ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు. టీడీపీ నేటిజన్లు జగన్ బ్యాండేజ్ సైజు పెరిగిందంటూ పోస్టులు పెడుతున్నారు. జగన్ ఇకపై ఆ బ్యాండేజ్ తీసేస్తేనే బెటర్, లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని  వైఎస్ వివేకా కుమార్తె సునీత ట్వీట్ చేశారు. ఇదే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ట్విట్టర్ లో స్పందించారు. "2014, 2019 ఎన్నికల్లో శవరాజకీయాలతో నెట్టుకొచ్చిన జగన్... ఈసారి ఒక డ్రామాతో వచ్చాడు. కనపడని ఒక గులకరాయి తగిలిందంట. బ్యాండ్ వేసాడు. రోజురోజుకు ఆ బ్యాండ్ పెద్దదవుతోంది. మే 13 ఎన్నికల రోజు వరకు డ్రామా ఆడిస్తానే ఉంటాడు ఈ నాటకాల రాయుడు" అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు!  మరోపక్క టీడీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. ఈ నెల 13న బ్యాండేజ్ సైజు చిన్నగా ఉంది.. ప్రస్తుతం అది పెద్దగా అయ్యింది అంటూ... “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు. అయితే నేను వున్నాను. న‌న్ను గుర్తించండి అంటూ థర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు పృథ్వీ రాజ్ ఓ ఛాలెంజ్ విసిరారు. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ ముద్ర‌గ‌డ‌ను ల‌క్ష్యంగా  చేసుకొని ఆయ‌న విమ‌ర్శ‌లు చేసారు.  ముద్రగడ కాపు ఉద్య‌మ నాయ‌కుడిగా ప్ర‌స్థానం ప్రారంభించి, ఇప్పుడు రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా, రెడ్డి సేవ‌కుడిగా మారార‌ని ఆరోపించారు.  కిర్లంపూడి లో కూర్చుని క‌బుర్లు చెబుతున్న ముద్ర‌గ‌డ‌ త‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు, రైస్ మిల్లుల‌కు ఉన్న విద్యుత్ బ‌కాయిలు ఎంతో చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు. ఉత్త‌రాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ కనీసం మూడు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక‌వేళ మూడు సీట్లు వైసీపీ గెలిస్తే మాత్రం నేను ఆయన ఇంట్లో అంట్లు తోముతాన‌ని అన్నారు.  ప్రస్తుతం ముద్ర‌గ‌డను ప‌ట్టించుకునేవారు, న‌మ్మేవారు ఎవ‌రూ లేర‌ని పృథ్వీ గట్టిగా చెబుతున్నారు. మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్‌చరణ్ స‌హా ప‌లువురు కూటమికి మద్దతుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే రాబోతున్నాట‌. అలాగే సీఎం జ‌గ‌న్‌పై కూడా పృథ్వీ విమ‌ర్శ‌లు చేసారు. అయితే దీనిపై వైసీపీ నాయ‌కులు స్పందించారు.  ఉత్తరాంద్ర లో వైసీపీ గెలవడం పక్కా అని,  తాను చెప్పినట్లు అంట్లు తోమాడానికి గిన్నెలు కూడా రెడీగా ఉన్నాయని వైసీపీ నాయకులు అంటున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 26, 2024 7:03PM

జేడీ లక్ష్మీనారాయణని ఎవరు హత్య చేయాలనుకుంటున్నారు?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి, విశాఖ ఉత్తర స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది. లక్ష్మీనారాయణ గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వణుకుపుట్టేలా వున్నాయి. విశాఖపట్టణంలో పోటీ చేస్తున్న తనను చంపడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తనకు ప్రాణహాని వుంది కాబట్టి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని వుందని అన్నారు తప్ప, తనకు ఎవరి ద్వారా ప్రాణహాని వుందో చెప్పడం లేదు. ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆరోపణలు చేశారో కూడా అర్థం కాకుండా వుంది.  గతంలో జగన్‌ని జైలుకు పంపిన సీబీఐ మాజీ అధికారి లక్స్మీనారాయణ. అప్పటి నుంచి ఆయనకు ఒక హీరో వర్షిప్ వచ్చింది. తమ నాయకుడి చేత చిప్పకూడా తినిపించారు కాబట్టి వైసీపీ మూకలకు ఆయన మీద కోసం వుంటుంది కాబట్టి వారు హత్యాయత్నం చేసే అవకాశం వుందా అనే అనుమాలు కలగడం సహజం. అయితే జేడీ ఆ పరిస్థితి నుంచి ఏనాడో బయటపడిపోయారు. ఆమధ్య జగన్ ప్రభుత్వాన్ని, జగన్ బుర్రలోంచి ఊడిపడ్డ పరమ శుద్ధ దండగ వాలంటీర్ వ్యవస్థని ఆకాశానికి ఎత్తేయడం ద్వారా ఆయన వైసీపీ వర్గాలకు అస్మదీయుడిగా మారారు. మరి ఇప్పుడు  ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది? నన్ను హత్య చేయాలని చూస్తున్నారు. రక్షణ కల్పించడం అని కాకుండా, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన తనను ఎవరు చంపాలని అనుకుంటున్నారో క్లియర్‌గా బయట పెట్టాలి. అంతే తప్ప అర్ధోక్తిలో స్టేట్‌మెంట్లు ఇచ్చి జనాల్లో లేనిపోని అనుమానాలు కలిగేలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు.
Publish Date: Apr 26, 2024 6:43PM

వంశీకి దింపుడు కళ్లెం ఆశకూడా మిగల్లేదుగా?

 వల్లభనేని వంశీ  నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.  అలా చెప్పేస్తూనే ఏదో ఓ మేరకు సానుభూతి ఓట్లను రాబట్టుకోవడానికి చివరి ప్రయత్నం కూడా చేశారు. గన్నవరం నుంచి ఇక తాను పోటీ చేయనని చెప్పిన వల్లభనేని వంశీ.. వచ్చే ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి దుట్టారామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తారనీ, తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు. ఇదంతా ఆయన ఎన్నికల నిమినేషన్ ర్యాలీ వెలవెలబోయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ వంశీ పలికిన పలుకులు.  దుట్టారామచంద్రరావు కుమార్తెకు వచ్చే ఎన్నికలలో మద్దతు ఇస్తానంటూ వంశీ చెప్పడం వెనుక ఈ ఎన్నికలో దుట్టా వర్గం కనీసం ఇప్పటికైనా తనకు మద్దతుగా చురుగ్గా పని చేస్తుందన్న చివరి ఆశ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీలో వంశీకి మద్దతు కరవైంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా వంశీ అనుచరులుగా ఉన్నవారిలో 90 శాతం మందికి పైగా ఆయన తెలుగుదేశం వీడగానే ఆయనకు దూరం అయ్యారు. ఇక వైసీపీ నుంచి తెలుగుదేశం గూటికి చేరి గన్నవరం తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వెంట ఆయన అనుచరవర్గమంతా టీడీపీ పంచన చేరిపోయింది. ఇక నియోజకవర్గంలో బలమైన దుట్టా రామచంద్రరావు వంశీకి మద్దతుగా పని చేయడానికి ససేమిరా అంటున్నారు.  ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి వంశీ చేసినదేమీలేదన్న ఆగ్రహం నియోజకవర్గ ప్రజలలో బలంగా కనిపిస్తోంది.   అది వంశీ నామినేషన్ ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. తీసుకువచ్చిన కూలి జనం కూడా మధ్యలోనే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయారు. అదే తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ నామినేషన్ ర్యాలీ కళకళలాడింది. భారీ జనసందోహంతో  జైజై ధ్వానాలతో ఆ ర్యాలీ సాగింది. జనం స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో  వంశీకి పరిస్థితి అర్ధమైంది.  దుట్టాను శరణుజొచ్చారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయను.. మీ కుమార్తెకే మద్దతు ఇస్తానంటూ బతిమలాడుతున్నారు. అయితే ఇప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దుట్టా మెత్తబడినా ఆయన వర్గం మాత్రం వంశీకోసం పని చేసే పరిస్థితి లేదని సోదాహరణంగా వివరిస్తున్నారు.  మొత్తం మీద వంశీకి గెలుపుపై దింపుడు కళ్లెం ఆశకూడా మిగలలేదని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. 
Publish Date: Apr 26, 2024 5:36PM

జగన్ మీద హైపర్ ఆది వేసిన పంచ్‌ల లిస్టు!

జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా హైపర్ ఆది వేస్తున్న పంచ్‌లు అదరిపోతున్నాయి. ఆది స్పీచ్‌లకు ప్రజల నుంచి విశేష ప్రతిస్పందన లభిస్తోంది. ఇదిగో హైపర్ ఆది జగన్ బ్యాచ్ మీద వేస్తున్న పంచ్‌ల లిస్టు.. 1. కూటమిని చూసి వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు. కానీ, పైకి మాత్రం సింహం సింగిల్‌గా వస్తుంది అంటున్నారు. మరి 2014లో కూడా సింహం సింగిల్‌గా వచ్చింది కదా.. మరి ఎందుకు ఓడిపోయింది? ఈసారి కూడా అదే కూటమి ఏర్పడింది.. ఈసారి కూడా కూటమికి అదే విజయం.. వైసీపీ అదే ఓటమి దక్కుతుంది. 2. షూటింగ్‌లన్నీ ఆపుకుని ప్రచారానికి వచ్చాను.. అక్కడ షూటింగ్‌లు లేకపోయినా.. ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా వుండే వాళ్ళని మాటలతో షూట్ చేయడం కంటిన్యూ అవుతుంది. 3. కమెడియన్ ప్రచారానికి వచ్చాడని వైసీపీ వాళ్ళు అంటున్నారు.. నేను ప్రొఫెషనల్‌గానే కమెడియన్‌ని.. వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్‌ని కాదు. 4. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ వైసీపీ వాళ్ళు ఊదరగొడుతున్నారు. రెండు చోట్ల ఓడిపోయినా ఎంతోమంది కష్టాన్ని తీర్చాడు.. అదే ఆయన గెలిస్తే, ప్రజల కష్టం కాంపౌండ్ దాటకుండా చూసుకుంటాడు. 5. రికార్డులు కొల్లగొట్టడానికో, ఆస్తులు కూడబెట్టుకోవడానికో సినిమాలను ఒప్పుకునే హీరోలను చూసి వుంటాడు.. కానీ, కౌలు రైతుల కష్టాలు తీర్చడానికి సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్. 6. ఆయన ప్రెజెంట్ ఆస్తి ఎంత వుంటుందో తెలుసా? నాకు తెలిసి ఈ స్టేజీ మీద వున్న నాయకుల ఆస్తికంటే తక్కువే వుంటుంది. ఎందుకంటే, వచ్చింది వచ్చినట్టు పంచుకుంటూ వెళ్ళడమే తప్ప, డబ్బులు పెంచుకుంటూ వెళ్ళే మనస్తత్వం ఆయనకి లేదు. 7. వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి రెడీగా వుంటారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖ అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది. 8. వారాహి బండి యాత్ర ఆపేస్తారా? ఆయనకి తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు.. అప్పుడు మీ పని కాశీ యాత్రే. 9. పవన్ కళ్యాణ్ జనాల పక్షాన వున్నాడు కాబట్టే జనసేనానిగా వున్నాడు. మీరు ఇలాగే విసిగిస్తే ‘వీరమల్లు’ బయటకి వస్తాడు.. జాగ్రత్త. 10. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదురా.. ప్రేమకు లొంగే స్టార్.. 11. దత్తపుత్రుడు.. దత్తపుత్రుడు అన్న నోళ్ళతోనే అంజనీ పుత్రుడు అనిపించుకునే రోజు వస్తుంది. 12. మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బతీసేలా మాట్లాడారా? ఈసారి జనసేన కొట్టే దెబ్బకి మీ అబ్బ గుర్తొస్తాడు. 13. 151 మంది ఒక్కడికి భయపడిపోతున్నారు. 14. పవన్ కళ్యాణ్‌ది నిలకడలేని రాజకీయం కాదు.. నిఖార్సైన రాజకీయం.
Publish Date: Apr 26, 2024 4:55PM

హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలయ్య భార్య నామినేషన్!

అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ముంగిట నిలిచిన బాలకృష్ణకు పోటీగా, అదే పార్టీ నుంచి నందమూరి వసుంధర నామినేషన్ దాఖలు చేయడం ఏమిటి అనుకుంటున్నారా?  ఉండండి అక్కడికే వస్తున్నాం. ఆమె తెలుగుదేశం డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా డమ్మి అభ్యర్థుల చేత నామినేషన్ దాఖలు చేయించడం సహజమే. సాధారణంగా ఆ డమ్మి అభ్యర్థులు ఆయా అభ్యర్థుల కుటుంబీకులే అయి ఉంటారు. ఏదైనా సాంకేతిక కారణాల చేత నిమినేషన్ తిరస్కరణకు గురైతే బ్యాక్ అప్ గా ఉండేందుకు ఇలా డమ్మి క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేస్తారు. అయితే బాలకృష్ణ ఇలా బ్యాక్ అప్ కోసం నామినేషన్ దాఖలు చేయించడం ఇదే తొలి సారి. ఈ సారి ఏపీలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగానూ రిస్క్ తీసుకోరాదన్న ఉద్దేశంతోనే బాలకృష్ణ డమ్మి అభ్యర్థిగా తన భార్య వసుంధర చేత నామినేషన్ వేయించారని అంటున్నారు. హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి హిందూపురం నియోజకవర్గంలో ఎన్నిక జరిగిన ప్రతిసారీ తెలుగుదేశం పార్టీయే గెలుస్తూ వస్తోంది. జగన్ వేవ్ కొనసాగిన 2019 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ విజయం సాధించారు. విశేషం ఏమిటంటే 2019 ఎన్నికలలో ఆయనకు 2014 ఎన్నికలలో కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది.  
Publish Date: Apr 26, 2024 4:47PM

ఇక సర్వేలతో పనిలేదు.. వైసీపీ వాళ్ళ ముఖాలు చాలు!

మొన్నటి వరకు నేషనల్ ఛానల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ పరిస్థితి ఏమిటో తమతమ సర్వేల ద్వారా తెలిపాయి. ఏ ఛానెల్ లేదా సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే అయినా ఒకే రిపోర్టు ఇచ్చింది.. ఈసారి ఎన్నికలలో ఏపీలో వైసీపీ ఓడిపోతుంది.. టీడీపీ కూటమి విజయం సాధిస్తుంది. ఇప్పటి వరకు చాలా సర్వేలు విడుదలయ్యాయి. అన్ని సర్వేల ఫలితం ఒకటే.. వైసీపీ ఖేల్ ఖతమ్ అనే. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతోపాటు పార్లమెంట్ స్థానాలను కూడా ఆ పార్టీ భారీగా కోల్పోబోతోందని సర్వేలు తేల్చాయి. ఈ సర్వేలన్నీ దాదాపుగా కోడికత్తి-2 సంఘటనకు ముందు చేసినవే.. ఈ సంఘలనకు ముందు వైసీపీకి 30 వరకు సీట్లు వచ్చే అవకాశం వుందని ఓవరాల్‌‌గా చెప్పాయి. అయితే ఈ సంఘటన తర్వాత జనం ఆలోచనలో ఇంకా బాగా మార్పు వచ్చిందని, ఈ నాటకాన్ని వారు అసహ్యించుకుంటున్న నేపథ్యంలో ముందుగా అనుకున్న సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి సర్వేలకు కామా పడింది. పోలింగ్ పూర్తయిన తర్వాత సర్వేల పరంపర ఎలాగూ కొనసాగుతుంది. మరి ఈ మధ్యకాలంలో సర్వేలు లేకపోతే ఎలా? ఏం పర్లేదు.. సర్వేలు లేకపోయినా వైసీపీ నాయకుల ముఖాలు చూస్తే చాలు.. ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో అర్థమైపోతుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనే మాటని పెద్దలు ఊరకే అనలేదు. ముందుగా త్వరలో మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ముఖం చూడండి.. ఆయన ముఖంలో భూతద్దం పెట్టి వెతికినా ఏ మూలనా కళ అనేది కనిపించడంలేదు. కూటమి ధాటికి ‘ఓటమి’ అనేది ఆయన ముఖంలో క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తోంది. ఇక ఇతర వైసీపీ నాయకుల ముఖాలు చూస్తే, అందరి ముఖాల్లో ఓటమి కళ సెవెన్టీ ఎంఎంలో కనిపిస్తూ వుంటుంది. పాపం అదేంటో, వైసీపీ నాయకులు నోటితో గెలుస్తాం అని చెబుతూ వుంటే, ముఖాలు మాత్రం ఓడిపోతాం అని చెప్పకనే చెబుతున్నాయి. 
Publish Date: Apr 26, 2024 4:05PM

కడప జిల్లాలో వైసీపీ ఓటమికి బాటలు వేసిన జగన్ వ్యాఖ్యలు!

ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ముఖ్యంగా గురువారం (ఏప్రిల్ 25)న పులివెందులలో జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి, స్వయంగా ఆయన ప్రతిష్టకు తీరని నష్టం చేకూర్చాయని విశ్లేషిస్తున్నారు. అడబిడ్డపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల సామాన్య జనంలో కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సరిగ్గా ఎన్నికల ముందు జగన్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల ప్రభావం ఒక్క పులివెందుల నియోజకవర్గానికే పరిమితం కాదనీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట చెల్లెలి చీర రంగుపై జగన్ చేసిన వ్యాఖ్య జగన్ చేసిన పెద్ద బ్లండర్ గా అభివర్ణిస్తున్నారు.  ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వైసీపీకి పెట్టని కోట లాంటి ఉమ్మడి కడప జిల్లాలో కూడా వైసీపీ ఓటమికి బాటలు పరిచాయంటున్నారు.  నిజానికి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో సొంత చెల్లెలు షర్మిల, వివేకా కుమార్తె సునీత గత కొన్నినెలలుగా తనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా జగన్ ఇప్పటి వరకూ వారికి కౌంటర్ ఇవ్వలేదు. అసలు పట్టించుకోనట్లుగానే ఉన్నారు. వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా షర్మిల, సునీతలపై విమర్శలు చేశారు. వారి వ్యక్తిగత విషయాలపై కూడా కామెంట్లు పెట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ జగన్ మాత్రం ఓ మేరకు సంయమనం పాటించారు. ఇక వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా కూడా షర్మిల, సునీతల వ్యాఖ్యలు, విమర్శలపై స్పందించడం మానేసిన తరుణంలో జగన్ తన చెల్లెలి చీర రంగుపై చేసిన వ్యాఖ్యతో  ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. సామాన్య జనం కూడా జగన్ దిగజారి మాట్లాడారని అంటున్నారు. బాహాటంగానే జగన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. షర్మిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా స్వయంగా జగన్ కే కాదు పార్టీకి కూడా తీరని నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్న వ్యాఖ్యలకు షర్మిల ఇచ్చిన సమాధానం జగన్ ఇప్పటి వరకూ ఓన్ చేసుకుంటూ వస్తున్న వైఎస్ వారసత్వాన్నే ఆయనకు దూరం చేసేలా ఉందని  అంటున్నారు. ఇంతకీ జగన్ సంయమనం కోల్పోయి సొంత చెల్లెలని కూడా చూడకుండా ఆమె వ్యక్తిత్వాన్నే కించపరిచేలా మాట్లాడడానికి కారణం ఫస్ట్రేషనే అంటున్నారు పరిశీలకులు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వైఎస్ వివేకా హత్య కేసులో అందరి అనుమానాలూ అవినాష్ రెడ్డిపైనే ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు, కోర్టుల్లో విచారణ కూడా ఆ అనుమానాలు కేవలం అనుమానాలు కావనే విధంగానే సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ అవినాష్ ను వెనకేసుకు రావడం,  చెల్లెళ్లపై ఎదురుదాడికి దిగడం, వారిని ప్రత్యర్థులు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారంటూ విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేకపోగా ప్రతికూలతే ఎక్కవగా కనిపిస్తోంది.   ఇప్పుడు తాజాగా జగన్ షర్మిల చీర రంగుపై చేసిన వ్యాఖ్యలతో ఇటీవలి కాలంలో పెద్దగా వినిపించని ప్రశ్నలు కూడా సామాన్య జనం నుంచి వినవస్తున్నాయి.  వివేకా హత్య కేసులో విపక్ష నేతగా సిబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ ను జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఒక వేళ అవినాష్ ఆరోపిస్తున్నట్లు వివేకా హత్యలో సునీత, ఆమె భర్త ప్రమేయం ఉంటే సునీత స్వయంగా సీబీఐ విచారణ కోరుతూ కోర్టు ను ఆశ్రయించి మరీ ఎందుకు సాధించారు. అంటూ జనం చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పులివెందులలో గురువారం (ఏప్రిల్ 25) నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ చెల్లెలి చీర రంగుపై చేసిన వ్యాఖ్యలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలు ఎన్నిలకపై తప్పక ప్రభావం చూపుతాయని పరిశీలకులు అంటున్నారు.  
Publish Date: Apr 26, 2024 3:28PM

చెల్లి వాటా చెల్లికి ఇచ్చేయొచ్చు కదా జగన్?!

ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే.. నువ్వు చెల్లికి అప్పు ఇచ్చినట్టు వుంది.. కానీ, అది అప్పు కాదని, తనకు ఆస్తిలో వాటాగా రావలసిన చాలా డబ్బులో కొంత డబ్బుని ‘అప్పు’ రూపంలో ఇచ్చావంటా? ఈ విషయం మాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకు.. చెల్లెమ్మ చేతికి మైకు ఇస్తే చాలు ముందుగా తనకు రావలసిన తన ఆస్తి గురించే మాట్లాడుతోంది మరి. ఆమె అలా రోడ్డు మీదకి వచ్చి తన ఆస్తి గురించి లబోదిబో అంటోంది కాబట్టి, ఇష్యూ పబ్లిక్‌లోకి వచ్చేసింది కాబట్టి మీ కుటుంబ ఆస్తి వివరాల గురించి మాట్లాడే అవకాశం అందరికీ మీరే ఇచ్చినట్టు అయింది. ఆ మహానేత, నాన్నగారు పోయిన తర్వాత ఆయన ‘కష్టపడి’ సంపాదించిన మొత్తం అన్నాచెల్లెళ్ళు మీరిద్దరూ పంచుకోవాలి కదా.. ఆయన కీర్తిశేషుడై చాలా సంవత్సరాలైంది. ఇంతవరకు ఆస్తుల పెంపకం ప్రస్తావన తేకుండా మొత్తం నీ దగ్గరే వుంచేసుకుంటే ఎలా జగన్ బ్రో? పాపం ఆయన ఊహించని విధంగా అకస్మాత్తుగా చనిపోయారు. ఒకవేళ ఆయనే బతికుంటే, చక్కగా ఆస్తిమొత్తాన్నీ ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చి వుండేవారు కదా? తండ్రి తర్వాత తండ్రి లాంటి నువ్వు పాపం నీ చెల్లికి తండ్రి లేని లోటు తీర్చి ఆస్తి పంచి ఇస్తే ఇప్పుడు పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా. ఆస్తి వస్తుంది, పోతుంది.. ఆత్మీయతలు, అనురాగాలు పోతే తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. అందుకని ఒక్కగానొక్క చెల్లిని ఏడిపించకుండా ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తి ఆమెకి ఇస్తే మీ అనురాగాలు కొనసాగుతాయి.. అంతేకాదు.. పైన వున్న మీ నాన్న వైఎస్సార్, తాత రాజారెడ్డి, బాబాయ్ వివేకా కూడా చాలా సంతోషిస్తారు. అయినా అంత డబ్బు ఏం చేసుకుంటావ్ జగన్? మీ తాత, మీ నాన్న అంత సంపాదించి ఏం చేసుకున్నారు? ఒక్క రూపాయి అయినా తీసుకెళ్ళారా? ఎవరైనా అంతే, మొన్న కంటికి పైన తగిలిన రాయి ఏ కణతకో తగిలి వుంటే పరిస్థితి ఏమయ్యేది? అందుకని, ఇప్పటి వరకు అయిన రచ్చ చాలు.. ఇక ఈ రచ్చకి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన బాధ్యత నీదే.
Publish Date: Apr 26, 2024 2:52PM

నా బిడ్డను అన్యాయంగా అరెస్టు చేశారు.. కేసీఆర్ సెంటిమెంట్ ఓట్లు రాలుస్తుందా?

కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు. బస్సు యాత్ర పేరుతో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటున్నారు. బస్సు యాత్రకు ముందు ఓ టీవీ చానెల్ లో మాట్లాడిన ఆయన మేడిగడ్డ కుంగుబాటు చాలా చిన్నదనీ, అటువంటివి సహజమనీ చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఫోన్ ట్యాపింగ్ ను కూడా ఆయన అటువంటిది జరిగితే అది అధికారుల తప్పు తనకేం సంబంధం అని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇలా అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో  ముఖ్యమంత్రిగా తాను రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యంగా పని చేశానని చెప్పుకున్నారు. అయితే ఆయన మాటలను జనం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ పండించైనా సరే ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం మొదలు పెట్టారు.  తెలంగాణను పార్టీ పేరు నుంచే దూరం చేసుకున్న ఆయన ఇప్పుడు తెలంగాణ సాధకుడిని అని చెప్పుకుంటే జనం మెచ్చరనుకున్నారో ఏమో.. కుమార్తె అరెస్టు అంశాన్ని ఎత్తుకున్నారు.  తన బిడ్డను అక్రమంగా అరెస్టు చేశారంటూ సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నిస్తున్నారు.  మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన తరువాత చాలా రోజుల వరకూ కనీసం స్పందించలేదు. అదే కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేసినప్పుడు ఖండించిన కేసీఆర్.. తన కుమార్తె అరెస్టుపై మాత్రం మాట్లాడలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తరువాత ఎన్నికల ప్రచారంలో కవితను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ సానుభూతి పొందే యత్నం చేస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా భువనగిరిలో ఆయన మాట్లాడుతూ..కవిత అరెస్టు విషయాన్ని ప్రస్తావించారు. తప్పుడు కేసులో కవితను బీజేపీ సర్కార్ జైల్లో పెట్టిందన్న కేసీఆర్ ఈ సంఘటన బీజేపీ కపటత్వానికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు. తన కుమార్తెకు నిజంగా మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉంటే అసెంబ్లీ ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.    వాస్తవానికి కవిత అరెస్టైన సందర్భంలోనే తెలంగాణ సమాజం సీరియస్ గా తీసుకోలేదు.  ఆమె అరెస్టైన సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త నిరసనల పిలుపునకు ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. అప్పట్లో కవిత అరెస్టు సార్వత్రిక ఎన్నికలలో  కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి.    తెలంగాణ ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ పితగా నిన్నటి వరకూ ప్రజల మన్ననలు అందుకున్న కేసీఆర్ తనయను ఈడీ అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలు పెద్దగా స్పందించలేదు. రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగలేదు. చాలా ఉదాశీనంగా వ్యవహరించారు. ఇక కవిత పట్ల ప్రజల నుంచే కాదు, పార్టీ శ్రేణుల నుంచి కూడా ఏ మంత సానుభూతి లభించలేదు. పైపెచ్చు అవినీతికి పాల్పడితే అనుభవించక తప్పదుకదా అన్న వ్యాఖ్యలూ వినవచ్చాయి. వాటన్నిటి కారణంగానే కేసీఆర్ కవిత అరెస్టుపై స్పందించేందుకు వెనుకాడారనీ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఇక లోక్ సభ ఎన్నికల ముంగిట కవిత అరెస్టును తురుఫు ముక్కగా వాడుకోవాలని చూస్తున్న కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది. 
Publish Date: Apr 26, 2024 1:44PM

గుడివాడ, గన్నవరం వైసీపీలో కనిపించని జోష్.. ముందుగానే చేతులెత్తేసిందా?

గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ  విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇరువురూ కూడా తెలుగుదేశంతో రాజకీయ అడుగులు మొదలు పెట్టిన వారే. అయితే కొడాలి నాని ముందుగా వైసీపీలోకి జంప్ కొడితే.. గత ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన తరువాత గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జంప్ కొట్టారు. ఇరువురూ కూడా తెలుగుదేశం అధినేతపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నవారే. వారిరువురూ వారి వారి నియోజకవర్గాలలో తిరుగులేని నేతలుగా ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చారు. తీరా ఈ ఎన్నికలలో నామినేషన్ వేసే సమయానికి వారిరువురి ధీమా సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. ఒక వైపు తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీ ఆర్భాటంగా ప్రజల భాగస్వామ్యంతో జరిగితే.. కొడాలి నాని, వల్లభనేని వంశీల నామినేషన్ ర్యాలీలో ప్రజా భాగస్వామ్యం మాట అటుంచి కనీసం పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం కనిపించలేదు. దీంతో ఇరువురిలోనూ ఓటమి భయం తీసుకువచ్చిన అసహనం పెచ్చరిల్లుతోందని అంటున్నారు.  ముందుగా కొడాలి నాని విషయం తీసుకుంటు.. భారీ ర్యాలీతో తన నామినేషన్ ర్యాలీ నిర్వహించాలని కొడాలి నాని భావించారు. పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని పార్టీ క్యాడర్ కు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే గురువారం ( ఏప్రిల్ 25) కొడాలి నాని నామినేషన్ ర్యాలీ చూసిన వారు జోష్ కనిపించలేదంటున్నారు. అనుకున్న స్థాయిలో  జనం రాకపోవడంతో కవర్ చేసుకుందుకు తన నివాసం నుంచి కొడాలి నాని ర్యాలీని ఇరుకు సందుల గుండా నిర్వహించారు.  ఈ ర్యాలీలో నానితోపాటు వైసీపీ మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్‌, జడ్పీ  చైర్‌పర్సన్‌ ఉప్పల హారిక, పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. అనుకున్నస్థాయిలో  పార్టీ కార్యకర్తలు సైతం రాలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వచ్చిన వారు కూడా ఏదో మమ అన్నట్లుగా ర్యాలీలో పాల్గొన్నారు కానీ ఎవరిలోనూ నాని విజయం పట్ల ధీమా కనిపించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నినాదాలలో జోష్ కనిపించలేదనీ, ర్యాలీని ఇరుకు రోడ్ల గుండా నిర్వహించడమే  ఆ ర్యాలీకి స్పందన కనిపించలేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. మొత్తం మీద గుడివాడలో కొడాలి నాని నామినేషన్ ర్యాలీ వెలవెలబోయి ఆయన గాలి తీసేసిందని అంటున్నారు.   భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన చేయాలని ఎంతగా ప్రయత్నించినా జనం మాత్రం రాలేదు. అసలు నాని ప్రచారంలోనే ఆయనకు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిని ఇసుమంతైనా పట్టించుకోని నానికి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైన దాఖలాలు లేవు. పైపెచ్చు ఎక్కడికక్కడ నిలదీతలు, నిరసనలే వ్యక్తం అయ్యాయి. అదే ఆయన నామినేషన్ ర్యాలీలోనూ ప్రతిఫలించింది. దీంతో నామినేషన్ ర్యాలీని తెలుగుదేశం కార్యాలయం మీదుగా నిర్వహించి గొడవలు సృష్టించాలని నాని వర్గం చేసిన ప్రయత్నం కూడా ఆ రూట్ లో ర్యాలీకి పోలీసులు ససేమిరా అనడంతో విఫలమైంది. రెండు రోజుల ముందుగానే గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెనిగండ్ల రాము ఆ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ప్రజా భాగస్వామ్యంతో కళకళలాడింది. వేలాది మందితో సాగిన ఆయన నామినేషన్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించిందని స్థానికులు వ్యాఖ్యానించారు.    ఇహ ఇప్పుడు గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ నామినేషన్‌  సందర్భంగా జరిగిన ర్యాలీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ర్యాలీకి జనాలను తరలించేందుకు  పెద్దఎత్తున డబ్బు, మద్యం, బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ జరిగినా ప్రజలు మాత్రం ర్యాలీలో పాల్గొనేందుకు పెద్దగా ఉత్సాహం చూపలేదు.  ఆశించిన స్థాయిలో  జనాలు రాకపోవడంతో  వంశీ అసహనానికి లోనయ్యారు. నామినేషన్ అనంతరం ఆయన ప్రసంగంలో అది స్పష్టంగా ప్రతిఫలించింది.  గన్నవరం నియోజకవర్గంలో మండల, గ్రామ స్థాయిల్లో పలువురు నాయకులు తెలుగుదేశం గూటికి చేరిపోయారు. దీంతో క్షేత్రస్థాయిలో వైసీపీకి నాయకత్వమే లేకుండా పోయింది.  అదే గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ నామినేషన్ ర్యాలీ వేలాది మందితో ఆద్యంతం ఉత్సాహంగా జారింది. ఈ ర్యాలీతో పోల్చి నామినేషన్ ర్యాలీయే గన్నవరం ఫలితాన్ని తేల్చేసిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో వైసీపీలో జోష్ కనిపించడం లేదనీ, క్యాడర్ లో ఉత్సాహం కానరావడం లేదనీ, అదే ఆయా నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల ర్యాలీలో ప్రతిఫలించిందనీ చెబుతున్నారు.  
Publish Date: Apr 26, 2024 12:11PM

ఏపీలో భానుడి భుగభగలు

ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా శక్రవారం (ఏప్రిల్ 26) రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 174 మండలాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఇక రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 25)నంద్యాలలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే విజయనగరం జిల్లా రాజాంలో 45.5, అల్లూరి జిల్లా కొండై గూడెంలో 45.1, కడన జిల్లా ఖాజీపేటలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 
Publish Date: Apr 26, 2024 12:08PM

బాబూమోహన్ దిక్కులేని రాజకీయాలు!

అందుకే ఆయన రాజకీయంగా ఆయన పరిస్థితి దిక్కుమాలిన స్థితికి చేరుకుంది. గురువారం నాడు వరంగల్ పార్లమెంట్ స్థానానికి వీల్ చైర్లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇంతకీ మీరు నామినేషన్ వేసింది ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగానేగా అని అడిగితే, ‘ఛ.. ఛ.. ఆ పార్టీలో నేనెనెప్పుడు చేరాను? కాఫీ తాగుదువుగాని రా అని కేఏ పాల్ పిలిస్తే వెళ్ళాను. ఆయన నాకు కండువా కప్పి వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించేశారు. కానీ నేను ఆ పార్టీలో చేరలేదు.. ఆ పార్టీ సభ్యుణ్ణి కూడా కాదు. ఆ పార్టీకి ఆరోజే టాటా చెప్పేశాను. స్థానిక ప్రజలు నన్ను నా స్వస్థలమైన వరంగల్ నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో నామినేషన్ దాఖలు చేశాను’ అని చెప్పుకొచ్చారు. నిజానికి బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నానని కె.ఎ.పాల్‌తో కలసి ప్రకటించారు. అప్పటి వరకు తాను వున్న బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్టు కూడా ప్రకటించారు. మధ్యలో ఓసారి వరంగల్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాబూమోహన్ బరిలో నిలిచే అవకాశం వుందని వార్తలు వచ్చినప్పుడు బాబూమోహన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తన పేరును బీఆర్ఎస్ పార్టీ ఇలా వాడుకుంటే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. నిజంగానే బీఆర్ఎస్ ఈయనకు టిక్కెట్ ఆఫర్ ఇచ్చినట్టే బిల్డప్పు ఇచ్చారు. చివరికి ఇప్పుడు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బాబూమోహన్‌కి పిలిచి మరీ అందోల్ టిక్కెట్ ఇచ్చింది. మంత్రి పదవి కూడా కట్టబెట్టింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వున్న సమయంలో బాబూమోహన్ నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకి వచ్చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలో కొంతకాలం కేసీఆర్‌తో స్నేహబంధం కొనసాగించారు. ఎప్పుడైతే కేసీఆర్ తనను దూరం పెట్టడం ప్రారంభించారో, పొమ్మనలేక పొగపెట్టడం మొదలుపెట్టారో బాబూమోహన్ పార్టీకి క్రమంగా దూరమవుతూ, చివరికి పార్టీలో నుంచి బయటకి వచ్చేశారు. ఈసారి మకాం బీజేపీలో వేశారు. మొన్నటి ఎన్నికలలో అందోల్ టిక్కెట్ కోసం తన కొడుకుతోనే గొడవపడి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీకి చేరువై, ఆ తర్వాత దూరమై ఇప్పుడు ఇండిపెండెంట్‌గా మిగిలి, తనకు రాజకీయంగా కొత్త అయిన వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. రాజకీయంగా తన కెరీర్ ముగిసిన విషయాన్ని బాబూమోహన్ ఇంకా గ్రహించలేదు. ఏడుపదులు దాటిన బాబూమోహన్ ఇక రాజకీయాలకు స్వస్తి పలికి విశ్రాంతి బాటలో నడిస్తే బాగుంటుంది!
Publish Date: Apr 26, 2024 11:57AM

నిజామాబాద్ లో నెగ్గేదెవ‌రు? అప్పుడు పసుపు... ఇప్పుడు గల్ఫ్‌ బోర్డు!

నిజామాబాద్ లో హోరాహోరీ సమరం సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ హేమా హేమీలే! ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని బ‌ట్టి చూస్తే  ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు!  ఏడు సెగ్మెంట్లలో మూడు చోట్ల‌ బీఆర్‌ఎస్‌ గెలిస్తే..  కాంగ్రెస్‌, బీజేపీ రెండేసి చొప్పున పంచుకున్నాయి! పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు మూడు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి!  1) కాంగ్రెస్‌ నుంచి జీవన్‌ రెడ్డి పోటీ లో ఉన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ చేతిలో 15,822 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.  2) బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సర్పంచ్‌ నుంచి ఆర్టీసీ చైర్మన్‌ వరకు పదవులను చేపట్టడమే కాదు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగానూ పని చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి చేతిలో దాదాపు 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.  3) బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ సిటింగ్‌ ఎంపీ. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోరుట్ల నుండి శాసనసభకు పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10,305 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు.  శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన ఈ ముగ్గురూ వారి, వారి పార్టీల తరపున ఈ సారి నిజామాబాద్ లోక్ సభ స్థానం నుండి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, గత ఎన్నికలలో పసుపుబోర్డు తెస్తానని రాసిచ్చిన బాండ్ పేపర్, సొంత డబ్బులతో తెరిపిస్తానన్న షుగర్ ఫ్యాక్టరీ హామీలు ఈ సారి ఆయ‌న‌కు చిక్కులు తెస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై ప్రధానమంత్రితో ప్రకటన చేయించినా, ఆ తర్వాత ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేక‌పోవ‌డం,  పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి  అధికార పార్టీ గ్యారెంటీ ల్ని ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి అయ్యేలా చూసుకుందామని రేవంత్ రెడ్డి జోష్ పెంచారు.   ముగ్గురూ ఉద్ధండులే కావడంతో ఇక్కడ ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురికీ రాజకీయ పరపతి ఉండడం, ఆయా సామాజిక వర్గాల మద్దతు ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది.  ఈ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థి గెలుపును డిసైడ్ చేసేది గల్ఫ్‌, బీడీ కార్మికులని చెప్ప‌వ‌చ్చు.  ఉపాధి కోసం భర్తలు గల్ఫ్‌ దేశాలకు వెళ్లగా.. భార్యలు బీడీలపై ఆధారపడి పని చేస్తున్నారు. బీడీ, గల్ఫ్‌ కుటుంబాల ఓటర్లు ఐదున్నర లక్షల వరకూ ఉంటారు. వీరు తీసుకునే నిర్ణయం ఎన్నికల్లో కీలకం కానుంది. అందుకే, అన్ని పార్టీలూ వారిని ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నాయి.  1. ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి పది రోజుల క్రితం గల్ఫ్‌ సంఘాలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. వారికిచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు పునరావాసం కల్పిస్తామని, గల్ఫ్‌లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపారు.  అలాగే, నియోజకవర్గంలో మున్నూరు కాపు, పద్మశాలి సామాజికవర్గ ఓటర్లు కూడా ఎక్కువే. బరిలో ఉన్న సిటింగ్‌ ఎంపీ అర్వింద్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికల్లో వీరి ఓట్లు గంపగుత్తగా అర్వింద్‌కు పడగా.. ఈదఫా ఇద్దరూ చీల్చుకునే అవకాశం ఉంది. పద్మశాలి ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఇక్క‌డ ఓట్లు చీలితే అది కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. 2. పదేళ్లలో వారికి కేసీఆర్‌ సర్కారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తన‌కు ఓట్లు కురిపిస్తాయని బీఆర్‌ఎస్‌ నేత భావిస్తున్నారు.  3. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా నిజామాబాద్ ఓట‌ర్ల‌ మద్దతు తమ కేనని బీజేపీ అంచనా వేసుకుంటోంది.  నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో మైనారిటీ ఓటర్లూ కీలకమే. ఇక్కడి పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల వరకూ మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. సగానికి సగం ఓట్లు తమకూ వస్తాయని బీఆర్‌ఎస్‌ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ముస్లిం ఓట్ల చీలిక తమకు లాభిస్తుందనే బీజేపీ ధీమాగా ఉంది.  ఇక్క‌డ ఓ విష‌యం మాట్లాడుకోవాలి. అదే నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ. ప్రతి ఎన్నికలో ఇక్కడ నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ ఎజెండాగా మారుతోంది. ఈ ఎన్నికలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే సెప్టెంబరు 17 నాటికి ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డితో సహా నేతలు హామీలు ఇస్తున్నారు. చెరుకు రైతుల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను చేస్తున్నారు.  తనను గెలిపించగానే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి అర్వింద్‌తోపాటు పార్టీ నేతలు హామీలు ఇస్తున్నారు. రైతులను మోసం చేసేందుకే బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ ప్రకటనలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.  రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్‌ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం ప్రతిసారీ విలక్షణ తీర్పునే ఇస్తున్నారు నిజామాబాద్ ఓట‌ర్లు. రైతులే ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారు ఎటు మొగ్గితే వారే విజయాన్ని సాధిస్తున్నారు. ఎంపీ హోదాలో కవిత ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పసుపు బోర్డు తీసుకురాకపోవడంతో రైతులే 2019లో పోటీగా నామినేషన్లు వేశారు. పార్లమెంట్‌ చరిత్రలోనే ఏకంగా 186 మంది పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న కవితను ఓడించడంతోపాటు పసుపు బోర్డు తీసుకు వస్తామన్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు పట్టం కట్టారు. ఐదేళ్ల తర్వాత పసుపు బోర్డు ప్రకటించి జీవో జారీ చేసినా.. దానిని ఎక్కడ పెడతారో ఇంకా స్పష్టం చేయకపోవడంతో ఈసారి వారు తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది. ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే నిజామాబాద్ ఓటర్లు ఈసారి ఎవరిని గెలిపిస్తార‌నేది ఉత్కంఠ‌గా మారింది. మళ్లీ గెలిచి సత్తా చూపాలని అరవింద్‌, పార్లమెంటులో కాలు మోపాలని జీవన్‌ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ లు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే నిజామాబాద్ ఓటర్ ఈ సారి ఏ పార్టీ వైపు మొగ్గు చూప‌నున్నారనేది ఉత్కంఠ‌గా మారింది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌    
Publish Date: Apr 26, 2024 11:08AM