ఓటర్లకి చెల్లని నోట్లు పంచిన జగన్ పార్టీ అభ్యర్థి

 

ఈమధ్య జరిగిన మునిసిపల్ ఎన్నికలలో చెల్లని నోట్లు పంచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని పోలసులు అరెస్టు చేశారు. నోట్లు పుచ్చుకున్న ఓటర్లని కూడా అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ మునిసిపల్ ఎన్నికలలో కౌన్సిలర్‌గా పోటీ చేసిన వైకాపా అభ్యర్థి బొమ్మారెడ్డి ధనలక్ష్మి ఓటర్లకు చెల్లని నోట్లు పంపిణీ చేసింది. నోట్లు అందుకున్నప్పుడు గమనించని ఓటర్లు ఆ తర్వాత మాకు చెల్లని నోట్లు పంచావేంటని ఆందోళనకి దిగారు. ఈ విషయం ఆనోటా ఆనోటా పోలీసులకు చేరింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓట్లను కొనడానికి నోట్లు వినియోగించిన ‘ధన’లక్ష్మిని అరెస్టు చేశారు. ఆమె దగ్గరి నుంచి 32 వేల రూపాయలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడంతోపాటు డబ్బు తీసుకుని ఓట్లు వేయడం కూడా నేరమే కాబట్టి నోట్లు పుచ్చుకున్న కొంతమంది ఓటర్లను కూడా అరెస్టు చేసి కేసులు పెట్టారు.