సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ కి శుభాకాంక్షలు

 

ఏపీలో అధికారం దక్కించుకోబోయేది ఎవరనే విషయం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. ఈ క్రమంలోనే ఓ అడుగు ముందుకేసిన ఓ వైసీపీ నేత.. 'ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు' అంటూ బ్యానర్లు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఓట్ల లెక్కింపు సందర్భంగా అమరావతిలోని తాడేపల్లి సమీపంలోని తన నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్.. పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జగన్ అమరావతి వచ్చారని తెలుసుకున్న వైసీపీ నేతలు.. తాడేపల్లికి క్యూ కడుతున్నారు. దీంతో తాడేపల్లిలోని జగన్ కొత్త ఇల్లు పరిసరాలు వైసీపీ బ్యానర్లతో నిండిపోయాయి. ఈ క్రమంలోనే పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన దొరబాబు అనే వైసీపీ నేత 'ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు' అంటూ బ్యానర్లు ఏర్పాటు చేయడం ఆసక్తిరేపుతోంది.