ఉదయగిరి గడ్డ కాకర్ల సురేష్ అడ్డ! ఉదయగిరి కోటపై టీడీపీ జెండా!
posted on May 8, 2024 4:06PM
రాయలవారి కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఉదయగిరి జగన్ పాలనలో కళావిహీనంగా మారింది. పట్టణ ముఖ ద్వారంలోని ఉదయగిరి ఆనకట్ట చెరువు ఆధునికీకరణ పనులు నిధులులేక ఆగిపోయాయి. గండిపాళెం జలాశయం రూపురేఖలు కోల్పోయింది. ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, కొండాపురం మండలాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించటానికి వీలుగా గండిపాళెం జలాశయం వద్ద ఏర్పాటు చేసిన సబ్ మిషన్ ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోయింది. 2002లో సబ్ మిషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో 46 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు నీటిని సరఫరా చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల మంజూరును నిలిపేసింది. దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయటానికి వీలుగా పట్టణంలోని గండిపాళెం మార్గంలో 2018 తెదేపా ప్రభుత్వ హయాంలో రూ. 2 కోట్ల నిధులతో మినీ స్టేడియం మంజూరైంది. అయితే ప్రభుత్వం మారటంతో ఈ మినీ స్టేడియం నిర్మాణ పనులకు నిధులు నిలిపేశారు. తాగునీటి సమస్య తో పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూటమి అధికారం లోకి రాగానే పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ హామీనిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తోంది.
కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం ఆయన తల్లి మస్తానమ్మ, సతీమణి ప్రవీణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలు
వారికి కర్పూర హారతులు ఇచ్చి పూలను వేదజల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. టీడీపీతోనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ను, ఎంపీ అభ్యర్థి వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అఖండ మెజారిటీ తో గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల తెలిపారు. వినూత్నంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను, కాకర్ల సురేష్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. వైసీపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి.. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఓట్లను వేయించుకోవాలనే కుట్రలకు అధికార పార్టీ పాల్పడుతోందని, మద్యం, నగదు పంపిణీతో పాటు పోలింగ్ రోజు గొడవలతో భయోత్పాత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ తన దైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూటమికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ సర్వేల్లో తేలిపోయింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.