వైఎస్ జగన్@ 500 కి.మీ

రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయాణంలో ఆయన 500 కిలోమీటర్లను పూర్తి చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులో ఇవాళ ఆయన ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ ఓ మొక్కను నాటారు. నవంబర్ 6వ తేదిన కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక స్థలం నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటికే కడప, కర్నూలు జిల్లాల్లో యాత్రను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లా మీదుగా సాగుతున్నారు. ఈ యాత్రలో ప్రభుత్వ అవినీతిపై విమర్శలు సంధిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు.