రియా చాలా చెప్పింది.. ఆ త‌ర్వాత‌..?

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ మ‌ర‌ణం ఎన్నెన్ని సంచ‌ల‌నాలకు సాక్షీభూత‌మైంది! ఎన్నెన్ని మ‌లుపులు తిరుగుతున్న‌ది! ఎంతెంత మందిని బైటికి తీస్తున్న‌ది! ఇదంతా ఒక క్ర‌యిమ్ థ్రిల్ల‌ర్ బాలీవుడ్ సినిమాను త‌ల‌పిస్తున్న‌ది. ప్ర‌ధానంగా రియా చ‌క్ర‌వ‌ర్తి తెర‌మీదికొచ్చింది. ఆమె సుశాంత్ ప్రియురాలిగా ముద్ర‌ప‌డి అనుమానాస్ప‌ద స్వార్ధ‌పూరిత చ‌ర్య‌ల‌తో సుశాంత్ మ‌ర‌ణానికి కార‌ణ‌మైంద‌న్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న‌ది. ఇదంతా స‌రే. రోజువారీ ప‌రిణామాలు తెలుస్తూనే ఉన్నాయి. సుశాంత్ మ‌ర‌ణం హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అన్న‌ది తేల్చేందుకు మొద‌లైన ఈ కేసు ద‌ర్యాప్తు బీహార్‌, మ‌హ‌రాష్ట్ర పోలీసుల మ‌ధ్య భేదాభిప్రాయాల‌తో ఇంకొన్ని మ‌లుపులు తిరిగి చివ‌రికి డ్రగ్స్ బాట ప‌ట్టింది. సుశాంత్ మ‌ర‌ణంతో బాలీవుడ్ లోని కొంద‌రు ప్ర‌ముఖుల పేర్లు గాలిలో ఊగిస‌లాడాయి. కొంద‌రు తెగువ క‌లిగిన వారైతే కొన్ని పేర్లు బ‌య‌ట పెట్టారు కూడా. అందులోని నిజానిజాలు నిర్ధార‌ణ కావాల్సి ఉంది. అలాగే డ్ర‌గ్స్ కేసులోనూ చాలా పేర్లు తెర‌మీదికొస్తున్నాయి. రియా చ‌క్ర‌వ‌ర్తి చెబుతున్న జాబితాలో ప్ర‌ముఖంగా తెలుగు హీరోయిన్ రకుల్ పేరు వ‌చ్చింది. వాళ్లిద్ద‌రూ ముంబాయ్ లో క‌లిసి దిగిన ఫోటోలు కూడా బ‌హిరంగ‌మ‌య్యాయి. 

 

సుశాంత్ కు చెందిన ఒక ఫామ్ హౌజ్‌లో బాలీవుడ్, తాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ర‌చూ క‌లిసి పార్టీలు చేసుకుంటుంటార‌ని రియా చెప్పింది. ఆ పార్టీల్లో మాద‌క‌ద్ర‌వ్యాల‌ను తీసుకుంటార‌ని కూడా చెప్పింది. ఇదేదో రియా ఇప్పుడు ఒక అండ‌పిండ బ్ర‌హ్మాండాన్ని బ‌ద్ద‌లు చేసింద‌ని భావించ‌న‌క్క‌ర్లేదు. ఇది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. సినీన‌టులు, ఇంకా చెప్పాలంటే ఈనాటి టీవీ న‌టులు య‌థేచ్చ‌గా మాద‌క ద్ర‌వ్యాల‌ను వాడుతున్నారు. త‌మ గ్లామ‌ర్ పెంచుకోవ‌డానికి అవి వాడ‌క త‌ప్ప‌ద‌ని కొంద‌రు బాహాటంగానే ప్ర‌క‌ట‌న‌లిచ్చారు. కొద్దిపాటి మోతాదులో వాటిని తీసుకోవ‌డం నేరం కాద‌ని కూడా వారు త‌మ చ‌ర్య‌ల్ని స‌మ‌ర్ధించుకుంటున్నారు. ఇదంతా ప‌క్క‌న బెడితే రియా చ‌క్ర‌వ‌ర్తి చెబుతున్న పేర్ల మీద మాద‌క‌ద్రవ్యాల నిరోధ‌క శాఖ అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది ఇక్క‌డ ముఖ్యాంశం. నిన్న‌టికి నిన్న ఈ కేసు విచారిస్తున్న సంబంధిత శాఖాధికారి త‌మ జాబితాలో బాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్లేవీ లేవ‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చారు. తాము కేవ‌లం మ‌త్తు ప‌దార్ధాల ఏజెంట్ల‌ను, త‌యీరీదార్ల‌ను, స‌ర‌ఫ‌రాదార్ల‌ను మాత్ర‌మే ప‌ట్టుకుంటున్నామ‌ని, వారిమీదే నిఘా ఉంచామ‌ని వెల్ల‌డించారు. ఇది చాలా కీల‌క ప్ర‌కట‌న‌. మ‌రి రియా చెప్పే పేర్ల సంగ‌తేమిటి? సుశాంత్ మ‌ర‌ణం కేసుని దాని ప‌రిధిని దాటించి మ‌త్తుప‌దార్ధాల వైపుకి మ‌ళ్లించారు. పోనీ మ‌త్తుప‌దార్ధాలు సేవిస్తున్న వారి ఆట క‌ట్టిస్తారా అంటే తాము చేయాల్సింది అది కాద‌ని అధికారులే చెబుతున్నారు. 

 

2017లో  తెలంగాణా రాష్ట్రంలోనూ తెలుగు సినీ న‌టులు మాద‌క ద్ర‌వ్యాలు వాడుతున్నార‌న్న కేసు కొద్ది వారాల పాటు హ‌ల్ చ‌ల్ చేసింది. పూరీ జ‌గ‌న్నాధ్‌, ఛార్మి, న‌వ‌దీప్‌, త‌రుణ్‌, సుబ్బ‌రాజు, సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడు త‌దిత‌రుల్ని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు టీమ్ విచారించింది. అప్ప‌ట్లో అది పెద్ద సంచ‌ల‌నం. ఏరోజుకారోజు ద‌ర్యాప్తుకి పిలిచిన వారిని అరెస్టు చేస్తార‌న్న ఉత్కంఠ‌. కాని అది అతి తేలిగ్గా అట‌కెక్కింది. మాద‌క‌ద్రవ్యాలు తీసుకునే వారు నేర‌స్ధులు కార‌న్న సిద్దాంతాన్ని తెర‌మీదికి తెచ్చారు. కేవలం వీరికి స‌రఫ‌రా చేసిన‌వారిని క‌నుగొనేందుకే వారిని పిలిచి ప్ర‌శ్నించిన‌ట్టు తేల్చేశారు. 

 

ఇప్పుడు రియా డ్ర‌గ్స్ కేసు ఎటు వెళ్ల‌బోతోంది? ఆమెని అరెస్టు చేశారు. ఆమె సుశాంత్‌కి మాద‌క ద్ర‌వ్యాలు ఇచ్చింద‌న్న‌ది అభియోగం. ఒక‌వంక స్వ‌ల్ప మోతాదులో అది తీసుకోవ‌డం నేరం కాదంటున్నారు. మ‌రి ఆమె అత‌డికి స్వ‌ల్ప మోతాదులోనే తెప్పించి ఇచ్చానంటున్న‌ది. దానివ‌ల్లే సుశాంత్ మ‌ర‌ణించాడ‌ని ద‌ర్యాప్తు సంస్ధ‌లు తేలుస్తాయా? సుశాంత్‌ని మాన‌సికంగా వ‌త్తిడికి గురిచేసి, అత‌డికి సినిమా అవ‌కాశాలు రాకుండా చేశార‌న్న ఒక ప్రధాన అభియోగం ఎటు పోయిన‌ట్టు? అది వ‌దిలేసి, సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రియా మీద నిఘా పెట్టారు. సుశాంత్ మ‌ర‌ణించాక అత‌ని బ్యాంకు అకౌంట్ నుంచి కొన్ని కోట్లు మాయ‌మ‌య్యాయి. ఇది రియా ప‌నేన‌ని సుశాంత్ తండ్రి అభియోగం. ఆ ప్ర‌కారం పోలీసులు ఆమె మీద నిఘా పెట్టారు. చివ‌రికి అది మాద‌క ద్ర‌వ్యాల వైపు మ‌ళ్లింది. అంటే ఇప్ప‌టికి రెండు మ‌లుపులు తిరిగిన‌ట్టు. ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగుతంది?  మాద‌క ద్ర‌వ్యాలు తీసుకునే ప్ర‌ముఖ హీరోలు, ద‌ర్శ‌క‌లు పేర్లు సోష‌ల్ మీడియాలో వ‌చ్చేస్తున్నాయి. కంగ‌నా ర‌నౌత్ ప‌రోక్ష ప్రస్తావ‌న‌లో కొన్ని పేర్లు తెర‌మీదికి తెచ్చింది. కాని వారికి ఏమీ కాదు. కేవ‌లం రియాకు మాత్ర‌మే ఇది నేరంగా వ‌ర్తిస్తుంది. మ‌న చ‌ట్టాల్లోని లొసుగులు క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతున్నాయ్‌!

-రాజా రామ్మోహ‌న్ రాయ్‌