పాకిస్థాన్‌లో పరిస్థితి ఘోరం...

 

మనం స్వాతంత్ర్య దినోత్సవం ప్రశాంతంగా చేసుకున్నాం. పాపం పాకిస్థాన్ పరిస్థితే ఘోరంగా వుంది. ఆగస్టు 14న ఉద్రిక్తతల మధ్యే అక్కడ స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. 15వ తేదీకి ఆ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ర్యాలీలు ఊపందుకున్నాయి. తాహిరుల్ ఖాద్రి అనే మత గురువు ఇచ్చిన పిలుపు మేరకు ఆయనకి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) అనే సంస్థకి చెందిన కార్యకర్తలు ఇస్లామాబాద్‌లో నానా హడావిడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇస్లామాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఒకపక్క పీటీఐ ఉద్యమకారులు, మరోపక్క సైన్యం.. వీళ్ళ మధ్యలో బిక్కుబిక్కుమంటున్న సామాన్య జనం. రిగ్గింగ్ చేసి గెలిచిన నవాజ్ షరీఫ్ రాజీనామా చేసేవరకు తమ ఉద్యమం ఆగదని పీటీఐ కార్యకర్తలు అంటుంటే, వాళ్ళని అణిచేస్తామని మిటలరీ అంటోంది. ఇదిలా వుంటే, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌ వాహనంపై గుజ్రన్‌వాలా సిటీలో అధికార పీఎంఎల్‌ -ఎన్‌ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అధికార పార్టీ కార్యకర్తలు తనను హతమార్చేందుకు తన వాహనంపై కాల్పులు కూడా జరిపారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఉన్న పౌర ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఎవరూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడరాదని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాల జారీ చేసింది. అలాంటి చర్యలకు పాల్పడితే దేశ ద్రోహం అవుతుందని తెలిపింది.