కోఠీలో 45 లక్షల చోరీ.. కళ్ళలో కారం..

 

హైదరాబాద్‌లోని కోఠీ ప్రాంతంలో భారీ దారిదోపిడీ జరిగింది.45 లక్షల రూపాయలున్న బ్యాగ్‌తో బైక్ మీద వెళ్తున్న వ్యక్తుల కళ్ళలో కారం చల్లిన దుండగులు ఆ 45 లక్షల రూపాయలున్న బ్యాగ్‌ను దోచుకుని పారిపోయారు. పూర్తి జనసమ్మర్థం వున్న సమయంలోనే ఈ చోరీ జరగడం దొంగల తెగింపును సూచిస్తోంది. బేగంపేటలోని తరుణి డెయిరీలో పనిచేసే శ్యాం సుందర్ అనే వ్యక్తి తన సంస్థకు చెందిన 45 లక్షల రూపాయలను కోఠీలోని విజయాబ్యాంకులో జమ చేయడానికి తన బావ దిలీప్‌తో కలసి బైక్ మీద బయలుదేరాడు. కోఠీలోని ఉస్మానియా వైద్య కళాశాల దగ్గరకు వీరి బైక్ రాగానే రెండు బైక్స్ మీద వచ్చిన దుండగులు వీరిద్దరి కళ్ళలో కారం జల్లి, శ్యాం సుందర్ తలమీద కత్తితో గాయం చేసి క్యాష్ బ్యాగ్‌తో పారిపోయారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా వున్న వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు.