ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఆత్మహత్య

 

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకి జీతం ఎక్కువగానే వుంటుందిగానీ, వత్తిడుల కారణంగా జీవితమే తక్కువైపోతోంది. చిన్న చిన్న విషయాలకే హర్టయిపోతూ చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తనువులు చాలిస్తున్న ఘటనలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వేర్వేరుగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒకరు భార్యతో గొడవ పడటం కారణంగా ఆత్మహత్య చేసుకుంటే, మరొకరు తాను ప్రేమించిన అమ్మాయి తిరస్కరించిందన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

 

మురళీ విహార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొద్ది రోజుల క్రితం ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన ఓ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరిద్దరూ హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో కాపురం పెట్టారు. నెల రోజులుగా వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. గురువారం ఉదయం చూస్తే మురళి ఫ్యాన్‌కి ఉరి వేసుకుని కనిపించాడు.

 

అలాగే రవీంద్రనాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రేమించినది ఒకర్ని పెళ్ళి చేసుకున్నది మరొకర్ని. అయితే అప్పటి నుంచి మానసికంగా నలిగిపోతున్న రవీంద్రనాథ్ తాను ప్రేమించిన అమ్మాయికి తాను దూరం కావడాన్ని తట్టుకోలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి  ఉరి వేసుకుని చనిపోయాడు.