పాకిస్థాన్ మరో ఓటమి.. ఆరుపరుగుల తేడాతో టీమ్ ఇండియా చేతిలో పరాజయం

ఐసీసీ మెగా టోర్నమెంట్లలో పాకిస్థాన్ పై విజయాల సంప్రదాయాన్ని భారత్ కొనసాగిస్తోంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం (జూన్ 9)న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఐసీపీ టోర్నీలలో పాకిస్థాన్, టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ అంటే అదో మహాసంగ్రామంగా, రెండు దేశాల మధ్య యుద్ధంగా క్రికెట్ అభిమానులు భావిస్తారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ కు మించి భారత్ పాక్ మధ్య మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తారు. అటువంటి మ్యాచ్ లో   టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి పాక్‍ను కుప్పకూల్చారు. స్వల్ప స్కోరును కాపాడి జట్టును గెలిపించారు. బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‍లో టీమ్ ఇండియా గొప్పగా పోరాడి అద్భుత విజయం సాధించింది.   న్యూయార్క్‌లోని నసావూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో టీమిండియా బౌలర్లు సమష్టిగా సత్తా చాటి పాకిస్థాన్‍ను మట్టికరిపించారు.  భారత బ్యాటర్లు విఫలమై 119 స్కోరుకే టీమ్ ఇండియా చాపచుట్టేస్తే.. ఆ స్వల్ప స్కోరును పాకిస్థాన్ ఛేదించే అవకాశం ఇవ్వకుండా బౌలర్లు జట్టకు విజయాన్ని అందించారు.  ఓటమి తప్పదనుకున్న దశ నుంచి జట్టు గెలుపు సంబరాలు చేసుకునేలా చేశారు. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లతో సత్తా చాటాడు. 15వ ఓవర్, 19వ ఓవర్లో చెరో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‍ను మలుపుతిప్పాడు. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు  హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. మహమ్మద్ సిరాజ్ వికెట్ తీయకున్నా 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి రాణించాడు. భారత బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేసి పరాజయం పాలైంది.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (13)ను ఐదో ఓవర్లో ఔట్ చేసి భారత్‍కు బ్రేక్ ఇచ్చాడు బుమ్రా. అయితే, మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (31) నిలకడగా ఆడాడు. ఉస్మాన్ ఖాన్ (13)ను అక్షర్ పటేల్ పదో ఓవర్లో ఔట్ చేయగా.. ధాటిగా ఆడిన ఫకర్ జమాన్ (13)ను పాండ్యా పెవిలియన్‍కు పంపాడు. నిలకడగా ఆడిన ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‍ను 15వ ఓవర్లో బుమ్రా బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఐదు ఓవర్లలో గెలిచేందుకు పాకిస్థాన్ 37 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ తరుణంలో భారత బౌలర్లు మళ్లీ విజృభించారు. 16వ ఓవర్లో అక్షర్ పటేల్ రెండు పరుగులే ఇచ్చాడు. దీంతో పాక్ ఒత్తిడిలో కూరుకుపోయింది. 17వ ఓవర్లో షాదాబ్ ఖాన్ (4)ను హార్దిక్ ఔట్ చేశాడు. జస్‍ప్రీత్ బుమ్రా 19వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చాడు. ఇఫ్తికార్ (5)ను ఔట్ చేశాడు. దీంతో పాక్ ఓటమి అంచులకు చేరింది. చివరి ఓవర్లో పాక్‍కు 18 పరుగులు అవసరమయ్యాయి. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో 11 పరుగులు రాగా.. 6 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. చివరి ఓవర్ తొలి బంతికి ఇమాద్ వసీం (15)ను అర్షదీప్ ఔట్ చేయగా.. నాలుగు, ఐదు బంతులకు ఫోర్లతో నసీమ్ షా (10 నాటౌట్) కాస్త టెన్షన్ పెట్టాడు. అయితే, చివరి బంతిని అర్షదీప్ కట్టడి చేశాడు. దీంతో టీమిండియా విజయం సాధించింది.

అంతకు ముందు  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగుకు ఆలౌటైంది.  రిషబ్ పంత్ 31 బంతుల్లో 42 పరుగులు (ఆరు ఫోర్లు) రాణించాడు.   అక్షర్ పటేల్ కూడా 18 బంతుల్లో 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. పంత్, అక్షర్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిరువురూ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.   విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దూబే (3) త్వరగా ఔటయ్యారు. హార్దిక్ పాండ్యా (7) ఎక్కువ సేపు నిలువకపోగా.. రవీంద్ర జడేజా (0) డకౌట్ అయ్యాడు. చివర్లో అర్షదీప్ సింగ్ (9), మహమ్మద్ సిరాజ్ (7 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.

పాకిస్థాన్ పేసర్లు నసీమ్ షా, హరీస్ రవూఫ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. మహమ్మద్ ఆమిర్ రెండు తీశాడు. షహీన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టాడు. ఆరంభంలో వాన వల్ల మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. అయితే, పూర్తి ఆట సాధ్యమైంది.  ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‍పై భారత్ ఆధిపత్యం కొనసాగింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు ఇరు జట్లు 8సార్లు తలపడగా.. భారత్ 7సార్లు విజయం సాధించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu