బీజేపీలో చేరికపై సచిన్ సంచలన వ్యాఖ్యలు
posted on Jul 15, 2020 11:18AM
సచిన్ పైలట్ ను డిప్యూటీ సీఎం, రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు కొందరు బీజేపీ నేతలు కూడా సచిన్ పైలట్ కు తమ పార్టీ తలపులు తెరిచే ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, దీనిపై తాజాగా స్పందించిన సచిన్ పైలట్.. తాను బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. తాను అటువంటి ప్రణాళికలు ఏమీ వేసుకోలేదని తెలిపారు. గత ఆరు నెలలుగా తాను జ్యోతిరాదిత్య సింధియాను కానీ బీజేపీ నేతలను కానీ కలవలేదన్నారు.
తాను బీజేపీలో చేరుతున్నానంటూ కొందరు చేస్తోన్న వ్యాఖ్యలు తనను అవమానించడానికేనని సచిన్ పైలట్ చెప్పారు. తాను బీజేపీని ఓడించడానికి పని చేశానని, అలాంటప్పుడు ఆ పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు చెప్పారు. సచిన్ పైలట్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు, సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది.