కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు

 

40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ కోస్గి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్‌ గెలిచింది. ఇప్పుడు ప్రజాకూటమిని గెలిపించడానికి రాహుల్‌ గాంధీ వచ్చారు. రాహుల్‌ రాకతో కోస్గి పునీతమైందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. కొస్గిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. తనను కొడంగల్‌ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారన్నారు. 9ఏళ్ల క్రితం కొడంగలా.. వరంగలా అని అవమానించారు. ఢిల్లీ వరకు కొడంగల్‌ గళాన్ని వినిపించా అన్నారు. కేసీఆర్‌పై పోరాటం చేస్తున్నందుకు 39 అక్రమ కేసులు పెట్టారని, అయినా వెనక్కి తగ్గేది లేదు.. ప్రజల అండతో చివరిదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయి. కురుక్షేత్రంలో ప్రజలే గెలుస్తారని అన్నారు. కేసీఆర్‌ దగ్గర అధికారం, ధనం ఉంటే మనవైపు ధర్మం, న్యాయం ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు.
 
కేసీఆర్‌ కుటుంబాన్ని మరోసారి గెలవనీయం. ఒక్కసారి వాళ్లు గెలిస్తే వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. యువత బలిదానంతో వచ్చిన తెలంగాణలో కేవలం కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపేశాడు అని విమర్శించారు. కేసీఆర్‌లా కుటుంబంలో ఒకరికి కాదు.. ముసలమ్మ, ముసలయ్యకు రెండు పెన్షన్లు రూ.4వేలు ఇస్తామన్నారు. ఇది కాంగ్రెస్‌ వాగ్ధానమని, గుండెల నిండా ఊపిరి పీల్చుకుని హస్తం గుర్తును గెలిపించండని కోరారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.