బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్! అమిత్ షానే సంధానకర్తన్న రేవంత్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో నేతలు చేస్తున్న హాట్ కామెంట్స్ కాక రేపుతున్నాయి. అక్బరుద్దీన్, బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య ప్రతిరోజు రాత్రి ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తోందని ఆరోపించారు. ఫోన్ కాన్ఫరెన్స్ కు అమిత్ షానే సంధానకర్తగా ఉన్నారని చెప్పారు. రాత్రి సమయంలో బండి సంజయ్, అరవింద్, అసద్, అక్బరుద్దీన్ స్క్రిప్ట్ తయారు చేసుకోవడం..ఉదయం సురభి నాటకానికి తెర లేపుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

 

పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ, ఎంఐఎంలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని రేవంత్ రెడ్డి విమర్శించారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ.. పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు. పీవీ, ఎన్టీఆర్ లపై నిజంగా బీజేపీకి ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా.. ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదని తెలిపారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదన్నారు. ప్రజలు ఇలాంటి ఎమోషన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు రేవంత్ రెడ్డి.