లీజుకి రామోజీ ఫిల్మ్ సిటీ..!! వాస్తవం ఏంటంటే...
posted on Jun 29, 2020 5:05PM
ఆసియాలోనే అతి పెద్ద సినిమా స్టూడియోగా పేరు తెచ్చుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ.మన తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలుస్తోంది. ఐతే కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీ ని డిస్ని హాట్ స్టార్ కు లీజుకిచ్చేశారని అటు సోషల్ మీడియాలోనూ ఇటు కొన్ని వెబ్ సైట్లలోనూ కొన్ని వార్తలు వచ్చాయి.. కరోనా కారణంగా అటు షూటింగ్ లు, ఇటు టూరిస్టుల తాకిడి లేకపోవడం తో లీజుకు ఇస్తున్నారని ఆ వార్తల సారాంశం.
తాజాగా ఇదే విషయమై ఫిల్మ్ సిటీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. రామోజీ ఫిల్మ్సిటీని అద్దెకు, లీజుకు ఇచ్చారన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తేల్చేసింది. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాణ సంస్థలు సోనీ పిక్చర్స్, జీ టీవీ వంటి వారిని రామోజీ ఫిల్మ్సిటీ లో షూటింగ్ కోసం ఆహ్వానించినట్టు ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ముంబైలో షూటింగులు చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. అంతే కాకుండా దేశంలో ఎక్కడా కూడా షూటింగులకు అనువైన వాతావరణం ప్రస్తుతం లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని ఫిల్మ్సిటీకి వచ్చి షూటింగులు చేసుకోమని ఆ సంస్థల ప్రతినిధులకు ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. షూటింగులకు అన్ని విధాలా అనువైనది కావడం తో పాటు అన్ని మౌలిక వసతుల్ని ఉచితంగా కల్పిస్తామని ఫిల్మ్సిటీ ఆహ్వానాలు పంపింది. ఆ ఆహ్వానానికి జీ టీవీ, సోనీ పిక్చర్స్ తమ అంగీకారం తెలిపాయని సమాచారం.