చిరంజీవి..నేను కాంగ్రెస్ నేతల౦: రామచంద్రయ్య
posted on Jun 27, 2013 4:35PM
మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి, తాను కాంగ్రెస్ పార్టీ నేతలమని..తమకంటూ సొంత అభిప్రాయాలు ఉండవని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. రాయల తెలంగాణ వాదన అర్థం పర్థం లేనిదిగా ఆయన కొట్టిపారేశారు. తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.
మరో వైపు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పిసిసి అద్యక్షుడు బొత్స ఉత్తరాఖండ్ వెళుతున్నారు. అక్కడ వరదబాదితులకు అవసరమైన సహాయ, సహకారాలపై వారు సమీక్ష చేయనున్నారు. తెలుగువారిని ఆదుకునే విషయంలో ఉత్తరాఖండ్ లో వివక్ష చూపుతున్నారని కేంద్ర హోం మంత్రి షిండే కి చిరంజీవి ఫిర్యాదు చేశారు. కొందరు టూర్ ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని,అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.