పాలమూరు నుండి రాహుల్ పోటీ చేయాలి
posted on Oct 22, 2013 5:38PM
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలోని మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని దిగ్విజయ్ సింగ్ వద్ద ప్రతిపాదించినట్లు రాష్ట్ర మంత్రి డీకె అరుణ తెలిపారు. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తో ఆమె భేటీ అయింది. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తరువాత తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందని, సోనియాగాంధీ పట్ల ప్రజలు నమ్మకంగా ఉన్నారని ఆమె తెలిపారు. అందుకే రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ జిల్లా నుండి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు.
ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డిలను రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించారు. రాహుల్ కార్యాలయం నుండి వారికి పిలుపురావడంతో వారు ఢిల్లీకి వెళ్లారు. అదే సమయంలో తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో డీకె అరుణ కూడా జిల్లా మంత్రిగా అక్కడికి వెళ్లి రాహుల్ ను జిల్లా నుండి పోటీ చేయాలని కోరినట్లుంది.