కేరళ నుంచి ఎంపీగా పోటీ చేయనున్న రాహుల్ గాంధీ

 

కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తారని కొన్ని రోజుల కిందట వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. రాహుల్‌ కేరళలోని వాయనాడ్ నియోజవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే కేరళ పార్టీ కార్యకర్తలు రాహుల్‌ను కోరారని, కేరళ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తోందని చెప్పారు. కార్యకర్తల విజ్ఞప్తిని రాహుల్ సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉందన్నారు. యూపీలో అమేథి నుంచి రాహుల్ పోటీపై ఆయన వివరణ ఇస్తూ, అమేథీ తన 'కర్మభూమి' అని రాహుల్ చెబుతుంటారని, అమేథీ ఆయనతోటే ఉంటుందని చెప్పారు.
 
తమిళనాడు, కర్ణాటక పార్టీ విభాగాలు సైతం రాహుల్‌ను తమతమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే రాహుల్‌కు విజ్ఞప్తి చేశాయి. తాజాగా, కేరళ కాంగ్రెస్ యూనిట్ సైతం రాహుల్‌ను వాయనాడ్ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరింది. గత ఏడాది కేరళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఐ షానవాస్ కన్నుమూయడంతో వాయనాడ్ సీటు ఖాళీ అయింది. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్ధిఖ్ పోటీలో ఉన్నప్పటికీ, రాహుల్ పోటీ చేస్తానంటే స్వచ్ఛందంగా తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. మరి దీనిపై రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.