రిక్షాలో పేటీఎం సీఈవో.. ఆశ్చర్యపోయిన అఖిలేష్
posted on Oct 29, 2016 1:00PM
నగరాలలో ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రతి ఒక్కరూ గురి కావాల్సిందే. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. ఆఖరికి ఎంత ప్రముఖులైనా సరై ట్రాఫిక్ టార్చర్ అనుభవించాల్సిందే. ఇలాంటి సమస్యే ఎదురైంది పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు. సీఎం అఖిలేష్ ను కలవడానికి బయలు దేరిన ఆయన ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ఇక ముందుకు కదిలే గత్యంతరం లేకపోవడంతో.. ఓ రిక్షాకార్మికుడు ఆపద్బాంధవుడిలా ఆయనను ఆదుకున్నారు. ఆయనను తన రిక్షాలో ఎక్కించుకొని సీఎం నివాసం 5 కాళిదాస్ మార్గ్కు తీసుకెళ్లారు. దీంతో విజయ్ శేఖర్ శర్మ రిక్షాలో రావడంతో అఖిలేశ్ ఆశ్చర్యపోయారు. తాను- సీఈవోతోపాటు రిక్షా కార్మికుడు ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘నగరంలోని ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల పేటీఎమ్ సీఈవో విజయ్ రిక్షా సైకిల్లో రావాల్సి వచ్చింది. మెట్రో రాకతోనే లక్నోలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. వారి సంగతేమో కానీ సీఈవోను తీసుకొచ్చినందుకు గాను రిక్షావాలాకు మాత్రం అదృష్టం కలిసొచ్చింది. అతనికి రూ. 6వేల రివార్డుతోపాటు కొత్త రిక్షా సైకిల్, కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని సీఎం అఖిలేశ్ హామీ ఇచ్చారు.