పవన్ గుండు గుట్టు విప్పిన పరిటాల సునీత

 

తెలుగునాట టీడీపీ అభిమానులను.. పవన్ ఫ్యాన్స్‌ మెదళ్లను కొన్ని దశాబ్దాల నుంచి తొలిచేస్తున్న ప్రశ్న.. పవన్‌కు పరిటాల రవి గుండు కొట్టించాడా లేదా..? కొట్టించాడని రవి అభిమానులు జబ్బలు చరవడం.. అంత సీను లేదని పవన్ ఫ్యాన్స్ ఎదురుదాడికి దిగడం పది, పదిహేను సంవత్సరాల నుంచి చూస్తునే ఉన్నాం. కానీ ఇంత వరకు పవన్ గుండు కథ గుట్టు విప్పే సాహసం చేసిన వారు ఎవ్వరు చేయలేదు. ఇరుపక్షాల కౌంటర్లు.. రీకౌంటర్ల తర్వాత కొంతకాలానికి ఈ కథ మరుగున పడిపోయింది. కానీ తాజాగా పవన్ తన గుండు కథను తనే కదపడంతో మళ్లీ ఈ విషయం అందరికీ గుర్తొచ్చింది. నాకు పరిటాల రవి ఎవరో కూడా తెలియదని.. అయినా ఎవరో నా దగ్గరికి వచ్చి, నాకు గుండు కొడితే నేను ఊరుకుంటునా అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాల్లో పలు రకాల హెయిర్ స్టైల్స్‌తో చిరాకు వచ్చి గుండు చేయించుకున్నా తప్పించి దీని వెనుక పరిటాల రవి లేరని స్పష్టం చేశారు. పవన్ తాజా వ్యాఖ్యలతో మళ్లీ తెలుగునాట వేడి మొదలైంది.. మరచిపోయిన కథను మీడియా తవ్వి మరి బయటకు తీస్తూ.. ప్రతి రోజు కథనాలు వండి వారుస్తోంది.

 

ఇలాంటి తరుణంలో సీన్‌లోకి పరిటాల రవి సతీమణి ఏపీ మంత్రి పరిటాల సునీత ఎంటరయ్యారు. తన భర్త పవన్ కళ్యాణ్‌కి గుండు కొట్టించి అవమానించారన్న వార్తల్లో నిజం లేదన్నారు. తన భర్తకు, పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి పరిచయం లేదని. అసలు రవికి గుండు కొట్టించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తన భర్త అంత మూర్ఖుడు కాదని.. నాడు రవి అంటే గిట్టని వారు ఇలాంటి పుకార్లను పుట్టించి ప్రచారం చేశారని సునీత ఆరోపించారు. ఈ సంగతి పక్కన బెడితే పవన్‌కు తాను గుండు కొట్టించలేదని స్వయంగా దివంగత పరిటాల రవే ఒప్పుకున్నారు. అప్పట్లో ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి ఈ విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని తన ఇంటి పక్కన స్థలాన్ని చిరంజీవి కొనుగోలు చేయాలని భావించారు.. దీంతో ఆయన్ను వారించానని చెప్పారు. తన ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఆ ప్రాంతంలో వచ్చిపోయే వారిని తన వాళ్లు ఆరా తీస్తుంటారని.. అది చిరంజీవికి.. ఆయన అభిమానులకి ఇబ్బందిగా మారకూడదనే తాను ఆ స్థలం విషయంలో కలగజేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అంతే తప్ప చిరు కుటుంబంలో ఎవరితోనూ తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. మరి ఆయనే క్లారిటీ ఇస్తే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల వెనుక ఎవరున్నారు..? లేదంటే అసలు నిజం వేరే ఉందా..? ఈ సమస్యలన్నింటికి సమాధానం కాలమే చెబుతుంది.