పవన్ పార్టీ కష్టమే..

 

పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన’కు ఎన్నికల బరిలో చోటు లభించేలా లేదు. ఇప్పటికే షెడ్యూలు విడుదలవడం, ఎన్నికలకు తక్కువ వ్యవధి ఉండడం, పార్టీ కోసం దరఖాస్తు చేసుకుని రెండు రోజులే కావడం చూస్తుంటే తక్షణం పార్టీ ఏర్పాటు సాధ్యం కాదని తెలుస్తోంది. అయితే స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులపై పోటీచేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘‘జనసేన పేరుతో మార్చి 10న ఒక దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తులో పవన్‌కల్యాణ్‌ను అధ్యక్షుడిగా పేర్కొన్నారు. జనసేన పార్టీతో పోటీ చేస్తామని ఉంది. రెండు రోజులే అయింది ఆ లెటర్ వచ్చి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అది కష్టం. నోటిఫై చేయాలి. పబ్లిక్ హియరింగ్ కావాలి. ఈ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఆరేడు నెలలు పడుతుంది. ఈ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దానిలోపే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కష్టం..’’ అని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటిస్తే.. వేరే పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని, రిజిస్ట్రేషన్ లేకుండా అసలు ప్రకటించకూడదని, పబ్లిక్‌గా వాడుకోకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే పార్టీ జెండా, ఎజెండా లాంటివి ప్రకటించడానికి సాంకేతికంగా వీలు కాదన్న మాట. అది కాకుండా ఇంకేమైనా చెప్పుకొంటే చెప్పకోవచ్చు.