బయటపడుతున్న పరిటాల కేసులో రాజకీయ కోణం..!

 

తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత ఆమె పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లు, పరిటాల శ్రీరామ్ పై నమోదుచేయబడిన హత్యాయత్నం కేసులో ఇమిడిఉన్నరాజకీయకోణం కూడా క్రమంగా బయటకోస్తోంది.

 

ధర్మవరం పోలీసులు, పరిటాల శ్రీరామ్ అనుచరులుగా చెప్పబడుతున్న ఆరుగురు వ్యక్తులను స్థానిక కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేసారు. వారు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు పరిటాల శ్రీరామ్ పై కూడా కేసు నమోదు చేసి, అతన్నిఅరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, ఆవిషయం తెలిసుకొన్నపరిటాల శ్రీరామ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, ముందస్తు బెయిలుకోసం కోర్టులో దరఖాస్తు చేసుకొన్నాడు.

 

పోలీసుల గాలింపు చర్యలో భాగంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత మరియు వారి బంధువుల ఇళ్ళలో సోదాలు నిర్వహించడం వివాదాస్పదమయింది. ముఖ్యంగా ఒక మహిళా శాసనసభ్యురాలి ఇంట్లో ఆమె అనుమతి లేకుండా రాత్రిపూట పోలీసులు గాలింపు చేప్పటి ఎందుకు అంత అత్యుత్సాహం చూపారో తెలుపాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. పరిటాల సునీత పత్రికలవారితో మాట్లాడుతూ, హత్యయత్నం మీద అరెస్టు చేసిన వారిని వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా, పోలీసులు వారిని ఇంకా తమ ఆధీనంలోనే ఎందుకు ఉంచుకొన్నారు? అని ప్రశ్నించడంతో పోలీసులు కూడా జవాబు చెప్పలేకపోయారు.

 

అనంతపురం జిల్లాలో గత అనేక సం.లుగా పరిటాల కుటుంబము తెలుగుదేశం పార్టీకి మద్దతునిస్తూ, ఆ జిల్లాలో పార్టీకి బలమయిన పునాదివేసింది. ప్రస్తుతం హత్యాయత్నం నుండి బయటపడినట్లు చెపుతున్న కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డి, కొద్దికాలంక్రితం జరిగిన సహకార సంస్థ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయాడు. తన విజయానికి తెలుగుదేశమే గండి కొట్టిందని అయన ఆరోపించినట్లు వార్తలొచ్చాయి కూడా. ఆ ఎన్నికలలో పరిటాల కుటుంబం చక్రం తిప్పడం వల్లనే తను ఓటమి చవిచూసినట్లు భావిస్తున్న సుధాకర్ రెడ్డి, పరిటాల కుటుంభాని, తెలుగుదేశం పార్టీని ద్వేషించడం సహజమే.

 

ఇక, కొత్తగా బరిలోకి దిగిన వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ప్రాతినిద్యం వహిస్తున్నతోపుదుర్తి ప్రకాష్ రెడ్డికూడా పరిటాల కుటుంబం తన రాజకీయ ప్రస్తానంలో ఒక అడ్డుగోడగా నిలిచినట్లు భావిస్తూ, పరిటాల కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి మద్య ఉన్న అనుబందము విడగొట్టిననాడే తనకి జిల్లాలో మనుగడ సాధ్యం అని తెలుసుకొన్నాడు. అందుకే, తనకు ప్రమేయంలేని పరిటాల కేసులో వేలు పెడుతూ ఒకనాడు పరిటాల రవిని ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పరిటాల శ్రీరామ్ ను కూడా ప్రోత్సహిస్తోందని ఆరోపించేడు. అంటే గాక పరిటాల శ్రీరామ్ తో లోకేష్ కి ఉన్న స్నేహ సంబందాల గురుంచి కూడా ప్రశ్నించేడు. తెలుగుదేశం పార్టీ రాయలసీమలో శాంతి కోరుకొంటే, ముందు పరిటాల సునీతని, ఆమె అనుచరులను పార్టీనుండి బహిష్కరించాలని డిమాండ్ చేసాడు. అంతేగాకుండా పరిటాల శ్రీరామ్ నడుపుతున్న వెబ్ సైటును కూడా వెంటనే పోలీసులు మూయించేయాలని డిమాండ్ చేసాడు.

 

దీనిని బట్టి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబముకు గల ప్రాముక్యత అర్ధమవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరో వైపు వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరూ కూడా తెలుగుదేశం-పరిటాల కుటుంబం మద్యన ఉన్న బలమయిన బందం తెంచగలిగినప్పుడే తమ రాజకీయ ప్రస్థానం సాధ్యమని గ్రహించి, జిల్లాలో తెలుగుదేశానికి పునాదివంటి పరిటాల కుటుంబాన్ని లక్ష్యం చేసుకొని ఆరంబించిన ప్రయత్నాలలో భాగంగానే పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.