ఏడాది క్రితం ఇదే రోజు.. ఫ్యాన్ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకొని వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఘన విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి కావడంతో 'అపూర్వ ఘట్టానికి సంవత్సరం' అంటూ వైసీపీ కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ఇక వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అయితే వరుస ట్వీట్లతో వైసీపీ ఘన విజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

"ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు చిరస్మరణీయం." అంటూ ఏడాది క్రితం వైఎస్ జగన్ తో విజయానందాన్ని పంచుకుంటున్న ఫోటోని షేర్ చేశారు.

"తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత." అంటూ జగన్ ని ప్రశంసించారు.

"ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్’ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం ‘పది తలల విషనాగు’తో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు." అంటూ ఓ వైపు జగన్ ని ప్రశంసిస్తూ, మరోవైపు ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ విజయ సాయి ట్వీట్ చేశారు.