భ‌ళ్లాల దేవుడికి స‌రిసాటి.. కాల‌కేయుడికి మీరే పోటీ

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. ఏపీ సీఎం చంద్రబాబు మీద విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ కోసం 6 వేల కోట్లిస్తే.. టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా అంచనాలు పెంచుకుంటూ పోతుందని, పోలవరం చంద్రబాబుకి ఎటిఎం లా మారిందని విమర్శించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు వేసి తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని, చంద్రబాబు బాహుబలిలో భ‌ళ్లాల దేవుడిలా తయారయ్యారని మోదీ విమర్శించారు.

చంద్రబాబుపై మోదీ చేసిన విమర్శలకు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఎత్తేసి దండయాత్ర చేస్తున్న కాల‌కేయుడు నరేంద్ర మోదీ గారూ! కేంద్రం నుండి ఒక్క పైసా సహాయం లేకపోయినా ఆంధ్రులు తలెత్తుకొని నిలబడేలా చేసిన బాహుబలి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.' అని ట్వీట్ చేశారు. 'ఆంధ్ర‌ప్ర‌దేశ్ హెరిటేజ్ చూసుకోవ‌డానికి చంద్ర‌బాబున్నారు. హెరిటేజ్ సంస్థని చూసుకోవ‌డానికి బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రిగారు ఉన్నారు. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల హెరిటేజ్ కి మోడీ గారు చౌకీదార్‌గా మారారు.' అని విమర్శించారు. '54 వేల కోట్ల‌య్యే పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కి 6 వేల‌కోట్లిచ్చి పూర్తిచేయ‌లేదంటున్నారు. మీకు లెక్క‌లు రావా? ఆంధ్రుల జీవ‌నాడి పోల‌వ‌రం అంటే లెక్కే లేదా? గుజ‌రాత్‌లో న‌ర‌మేథం సాగించిన న‌రేంద్ర మోడీ గారూ! అరివీర భ‌యంక‌రులైన మీరు భ‌ళ్లాల దేవుడికి స‌రిసాటి. కాల‌కేయుడికి మీరే పోటీ!' అంటూ లోకేష్ వరుస ట్వీట్లతో మోదీపై విరుచుకుపడ్డారు.