రాష్ట్రంలో 24శాతం అటవీ ప్రాంతాన్ని 33శాతం చేస్తాం
posted on Jul 6, 2020 5:57PM
పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం..
బాసర ట్రిపుల్ ఐటీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
రాష్ట్రంలో ఉన్న 24శాతం అటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెంచడానికే ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీలో ఆయన మొక్కలు నాటారు. పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు సీఎం ప్రణాళికలు రూపొందించారని ఆయన అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ఐదేండ్ల నుంచి కొనసాగుతున్న ఆ కార్యక్రమంలో ఇప్పటివరకు 182 కోట్లకు పైగా మొక్కలు నాటామన్నారు. ఆరవ విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
బాసరలో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 50 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 30 వేల మొక్కలు నాటారని 20 వేల మొక్కలు నాటాల్సి ఉందన్నారు. మొక్కలు పెంచడంతో వాతావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు పడుతాయని చెప్పారు. ప్రతి గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారని దీని ద్వరా కొంత మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.