చిన్నారుల పరిస్థితి విషమం.. శాంతి ర్యాలీలు

 

మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల్లో ఐదు మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈమేరకు శనివారం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 15 మంది చిన్నారులు కోలుకుంటున్నారు. కోలుకుంటున్న విద్యార్థులను కాసేపట్లో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యశోద ఆస్పత్రిలో మొత్తం 20 విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.

 

మరోవైపు మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తుప్రాన్‌లోని విద్యార్థులు శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటు కృష్ణా జిల్లా నూజివీడులోని విద్యార్థులు కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేపట్టారు. ప్రమాదంలో మరణించిన చిన్నారుల ఆత్మ శాంతించాలని ప్రార్థించారు.