లక్ష్మీపార్వతి లబోదిబో!

 

 

 

ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా జంప్ జిలానీల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి నాయకులు మారుతూ వుండటం నేచురల్. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరు. ఏ నాయకుడు ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా చేరొచ్చు. అయితే నందమూరి లక్ష్మీపార్వతి మేడమ్ విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఆమె ఏ పార్టీలో అయినా చేరొచ్చుగానీ, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఎంతమాత్రం లేదు.. లేదు.. లేదు.. లేనేలేదు!

 

లక్ష్మీపార్వతి, చంద్రబాబు మధ్య ఎంతటి వైరం వుందో, చంద్రబాబు మీద ఆమెకి ఎంత పగ వుందో ఫ్లాష్ బ్యాక్ రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. అలాంటి లక్ష్మీపార్వతి మేడమ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పుకార్లు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పుకారు విన్నవాళ్ళందరూ ఇది కలా, నిజమా అనుకున్నారు. తామసలు జీవించి ఈ భూమ్మీదే వున్నామా అనే సందేహాలు కూడా చాలామందికి వచ్చాయి.  ఈ పుకార్లు విని లబోదిబోమన్న లక్ష్మీ పార్వతి వెంటనే వాటిని ఖండించారు. తానేంటి.. తెలుగుదేశం పార్టీలో చేరడమేంటని విస్తుపోయారు. ఇలాంటి దారుణమైన పుకార్లను సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.