టీఆర్ఎస్ సెంటిమెంట్ ను మార్చిన జీవన్రెడ్డి
posted on Nov 14, 2018 2:56PM
టీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతి విషయంలో సెంటిమెంట్ ఫాలో అవుతారు.ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వెంకన్నను కేసీఆర్ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్ కోనాయిపల్లికి వచ్చి వెంకటేశ్వరస్వామికి పూజలు చేశాకే నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ ఎన్నికలకు కూడా నామినేషన్ వేసేముందు కోనాయిపల్లిలో పూజలు జరిపించి నామినేషన్ వేశారు.అయితే ఈ సెంటిమెంట్ నామినేషన్స్ కి మాత్రమే పరిమితం కాదు చివరికి అభ్యర్థుల ప్రకటనలోనూ ఫాలో అవుతున్నారు కేసీఆర్.
ఎన్నికల్లో కేసీఆర్ మొట్ట మొదటి టికెట్ కేటాయించిన వారు ఓడిపోతారనే సెంటిమెంట్ ఉండేది.ఆలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం 2004లో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో దిగారు.అయితే, ఆ ఎన్నికల్లో కేసీఆర్ మొట్టమొదటి టికెట్గా ప్రకటించిన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పాపారావ్ ఓటమి పాలయ్యారు.2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డిని ప్రకటించారు.ఆయన కూడా ఓడిపోయారు. దీంతో టీఆర్ఎస్ అధినేత తొలి టికెట్ ప్రకటించిన అభ్యర్థి ఓటమి పాలవుతారనే ప్రచారం సాగింది.అయితే ఈ ప్రచారానికి 2014 ఎన్నికల ఫలితాలే అడ్డుకట్ట వేశాయి.
2014 ఎన్నికల్లో ఆర్మూర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నియోజకవర్గం ఇన్చార్జి ఆశన్నగారి జీవన్రెడ్డి 13,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.2013 లో టీఆర్ఎస్ 13వ ఆవిర్భావ సభను జీవన్రెడ్డి విజయవంతంగా నిర్వహించిందనుకు కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మరీ టీఆర్ఎస్ మొట్ట మొదటి అభ్యర్థిగా ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి జీవన్రెడ్డి పేరును ప్రకటించారు.మొత్తానికి జీవన్ రెడ్డి గెలిచారు.దీంతో జీవన్ రెడ్డి మొదటి టికెట్ కేటాయించిన వ్యక్తి ఓటమి పాలవుతాడనే సెంటిమెంట్ కి స్వస్తి పలకడంతో ఇప్పడు జరగనున్న ఎన్నికలకు సెంటిమెంట్ ని ఫాలో అయ్యే కేసీఆర్ మొట్టమొదట బీ-ఫారం జీవన్ రెడ్డి కే ఇచ్చారు.మరి ఈసారి కూడా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూద్దాం..!!