కిక్కిరిసిన రాజాజీ హాల్‌... అమ్మ ముఖమే కనిపించడం లేదు..

 

గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిన్న రాత్రి తన తుదిశ్వాసను విడిచారు. దీంతో రాష్ట్రం మొత్తం కన్నీరు మున్నీరవుతోంది. పార్టీ నేతల, కార్యకర్తలు, అభిమానులు జయ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. మొదట ఆమె పార్థివదేహాన్ని..ఆమె అధికార నివాసమైన పోయెస్ గార్డెన్‌కు తరలించారు. కొద్దిసేపు అక్కడ ఉంచిన అనంతరం ప్రజల సందర్శనార్థం ప్రఖ్యాత రాజాజీ హాల్‌కు తరలించారు. ప్రజల సందర్శనార్థం ఈ రోజు మొత్తం అక్కడే ఉంచుతారు. ‘అమ్మ’ను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. రాజాజీ హాల్ వరండాలో దాదాపు 25 మెట్లకు పైన ఐస్ బాక్స్ పై జయలలిత మృతదేహాన్ని ఉంచగా, ప్రజలు సందర్శించేందుకు మూడు వరుసల క్యూలైన్ ను మెట్లకు దిగువన దాదాపు 25 మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. దీంతో అప్పుడే ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అయితే తమకు అమ్మ ముఖమే కనిపించడం లేదని ప్రజలు, అభిమానులు ఆరోపిస్తున్నారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.