రైతులకు కంటకప్రాయుడు..కాంట్రాక్టర్లకు ప్రియుడు

 

కామారెడ్డిలో కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.కేసీఆర్‌ కాంట్రాక్టుల పేరిట ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఆయనను రైతులకు కంటకప్రాయుడు.. కాంట్రాక్టర్లకు ప్రియుడు అని తాను గతంలో అన్నానని గుర్తు చేశారు.ప్రాజెక్టులన్నీ ఆంధ్రా గుత్తేదారుల చేతిలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు ఆంధ్రా గుత్తేదార్లకు రూ.75వేల కోట్ల పనులు అప్పగించారని తెలిపారు. రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి నాలుగేళ్లు చేశారు.దీంతో రుణమాఫీపై వడ్డీ పెరిగి ప్రజలపై భారంపడిందన్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామంటే.. కేసీఆర్‌ రూ.లక్ష మాత్రమే చేస్తామంటున్నారని తెలిపారు.

సచివాలయానికి రాకుండా రాష్ట్రాన్ని పాలించిన ఏకైక వ్యక్తి కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ లాంటి భాష మాట్లాడేవారు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేరన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదని చెప్పారు. మైనార్టీలను మోసం చేసేందుకే మోదీతో కుమ్మక్కై కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలపై తాను చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా 70ఏళ్లు దాటాయి గనక తనకు మతి తప్పిందన్నట్టుగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారం ఇస్తే దోచుకుంటారని తెలిపారు.