దోపిడీ సొమ్ముతో విధ్వంసానికి కుట్ర!?

ఇటీవలి ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయాన్ని వైసీపీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నాడు. త‌న రాజ్యాన్ని శ‌త్రువులు ఆక్ర‌మించుకున్నార‌న్న రీతిలో ఆయన వ్య‌వ‌హార‌శైలి ఉంది. ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం.. ప్ర‌జ‌లు మ‌న ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌ను ఛీ కొట్టార‌ని జ‌గ‌న్ అంగీకరించలేకపోతున్నారు. తన రాజ్యాన్ని కబళించేశారన్న కక్షతో రగిలిపోతున్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. అందుకు తగ్గట్టుగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌ల‌హాలు ఇచ్చే నేత‌లు సైతం ఉండ‌టంతో ఆయ‌న‌ పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ప‌ నిండా రెండు నెల‌లుకాలేదు. అప్పుడే రాష్ట్రంలో ఏదో జ‌రిగిపోతుంద‌ని జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్ట‌డం చూసి జనం న‌వ్వుకుంటున్నారు. సాధార‌ణంగా కొత్త‌గా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. స‌ర్దుబాటు కావ‌టానికి క‌నీసం ఆరు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. గ‌త ప్ర‌భుత్వంలో చేసిన అప్పులు, రాబ‌డి త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న‌కు రావ‌డంతో పాటు.. శాఖ‌ల వారిగా అధికారుల‌ను స‌ర్దుబాటు చేసుకోవ‌టం, పాలనపై ప‌ట్టు సాధించడం కోసం స‌మ‌యం ప‌డుతుంది.  కానీ, జ‌గ‌న్ తీరు చూస్తుంటే.. కుర్చీ నాది, దానిలో కూర్చోవ‌డానికి చంద్ర‌బాబు ఎవ‌రు అనే ఆక్రోశంతో, ఆవేశంతో ఉడికిపోతున్నట్లు కనిపిస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా ఆ కుర్చీని లాక్కోవాల‌నే దుగ్ధతో  ఎంత‌కైనా తెగించేందుకు జ‌గ‌న్‌, ఆయ‌న టీం సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకోసం నెల‌కు వంద కోట్లు ఖ‌ర్చు చేసేందుకు స‌న్న‌ద్ద‌మైన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. 

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌లో అరాచ‌కాల‌కు హ‌ద్దు లేకుండా పోయింది. ఆయ‌న అనుచ‌రులు రాష్ట్ర‌ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్ప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లపై అక్ర‌మ కేసులు పెట్టి చిత్ర హింస‌ల‌కు గురిచేశారు. ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన వారిని అక్ర‌మ కేసుల‌లో ఇరికించి మరీ జైళ్ల‌కు పంపించారు. మొత్తంగా చెప్పాలంటే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో వైసీపీ నేత‌లు ఉన్మాదుల్లా వ్య‌వ‌హ‌రించారు. త‌మ‌ అరాచ‌క పాల‌న‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసి మ‌రోసారి అధికారంలోకి రావాల‌న్న జ‌గ‌న్ వ్యూహాల‌కు జనం ఎన్నికలలో చెక్ పెట్టారు.  ప్ర‌జ‌లంతా ఏక‌మై వైసీపీని ఘోరంగా ఓడించారు. ఘోర ఓట‌మిని త‌ట్టుకోలేక జ‌గ‌న్ మాన‌సిక  ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని ఆయన  ఆంత‌రంగికులే చెబుతున్నారు. నెల‌న్న‌ర రోజుల్లో స‌రైన తిండి, నిద్ర లేక జ‌గ‌న్ బ‌రువు కూడా త‌గ్గారంటున్నారు. 2019లో జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌భుత్వ భ‌వ‌నాలు కూల్చివేత‌లు, ప్ర‌తిప‌క్ష నేత‌ల అక్ర‌మ అరెస్టుల‌తో అరాచ‌క పాల‌న‌కు తెర‌లేపారు. ప్ర‌స్తుతం అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఎక్క‌డా ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్త‌కుండా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా ప్ర‌ణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. దీంతో ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వం తీరుప‌ట్ల సంతోషంగా ఉన్నారు. నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జల నుంచి వ‌స్తున్న మంచి స్పంద‌న‌ను చూసి జ‌గ‌న్ రగిలిపోతున్నారు. ఈ సానుకూల వాతావరణాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా  రాష్ట్రంలో అల్ల‌ర్ల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు   ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి , పోల‌వ‌రం ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన చంద్ర‌బాబు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా, కంపెనీలు ఏర్పాట‌య్యేలా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కూట‌మి ప్ర‌భుత్వంలో ప్ర‌శాంత పాల‌నకు స‌హ‌క‌రిస్తే  రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీలు క్యూ క‌డ‌తాయ‌ని, త‌ద్వారా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మంచి పేరు వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అదే జ‌రిగితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీ ఉనికిమాత్రంగా కూడా మిగిలే అవకాశం లేదని   జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం హ‌యాంలో అరాచ‌కాలు, హ‌త్య‌లు పెరిగిపోయాయ‌ని, 36 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య‌లు చేశార‌ని జ‌గ‌న్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కూట‌మి ప్ర‌భుత్వం 50రోజుల పాల‌న‌లోనే రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపు త‌ప్పాయ‌ని, రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలంటూ జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్టారు. ఢిల్లీలో ధ‌ర్నాకు కోట్లాది రూపాయ‌లు జ‌గ‌న్ ఖ‌ర్చు చేశారు.  కానీ, కూట‌మి పార్టీల నేత‌ల దాడుల వ‌ల్ల చ‌నిపోయిన 36 మంది వివ‌రాలు ఇవ్వాల‌ని కోరితే మాత్రం జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు నీళ్లు నములుతున్నారు. కేవ‌లం రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీల ప్ర‌తినిధులు ముందుకు రాకుండా ఉండాల‌నే జ‌గ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని కూట‌మి పార్టీల నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

రాబోయే కాలంలోనూ రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించేలా జ‌గ‌న్, ఆయ‌న బృందం ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ప‌నిచేయ‌లేని ప‌రిస్థితి క‌ల్పించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్ర‌మంలో అన్ని జిల్లాల్లో, అన్ని ప‌ట్ట‌ణ కేంద్రాల్లో ధ‌ర్నాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఆందోళ‌న‌లు, అల్ల‌ర్ల‌తో రాష్ట్రం మొత్తం అశాంతి సృష్టించాల‌న్న‌ది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది. ఇందుకోసం జ‌గ‌న్ నెల‌కు వంద కోట్లు ఖ‌ర్చుచేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఈ బాధ్య‌త‌ల‌ను మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి అప్ప‌గించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ధ‌నుజ‌య రెడ్డి, మిథ‌న్ రెడ్డితోపాటు జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌గా మెలిగిన వైసీపీ నేత‌లు వంద‌ల కోట్ల ప్ర‌జా సొమ్మును దోపిడీ చేశారు. ఆ సొమ్మును బ‌య‌ట‌కు తీసి జిల్లాల్లో అల్ల‌ర్లు సృష్టించేందుకు ఉప‌యోగించ‌బోతున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ కుట్ర‌ల‌ను చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏ విధంగా తిప్పికొడుతుంద‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu