కుప్పకూలిన ఫేస్ బుక్ షేర్లు..
posted on Jul 26, 2018 5:15PM
వివాదాస్పద డేటా అనలిటికల్ కంపెనీ కేంబ్రిడ్జి అనలిటికా మూత పడనుంది. ఈ సంస్థ మాతృ కంపెనీ అయిన బ్రిటన్కు చెందిన ఎస్సీఎల్ ఎలక్ర్టానిక్స్ కూడా దివాళా తీయనుంది. కంపెనీ వ్యాపారం గణనీయంగా పడిపోవడంతో కంపెనీని మూసివేయాలని ప్రమోటర్లు నిర్ణయించారు. 2014లో ఫేస్బుక్ డేటాతో అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంతో పాటు బ్రెగ్జిట్లో ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేసేలా డేటాను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను కేంబ్రిడ్జి అనలిటికా ఎదుర్కొంటోంది.కంపెనీ దివాళా పిటీషన్ను బుధవారం దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
కంపెనీ ప్రతికూలంగా వచ్చిన వార్తల కారణం ఉన్న వ్యాపారం పోయిందని, కొత్త ఆర్డర్లు లేనందున కంపెనీని మూసివేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.డేటా దుర్వినియోగ కుంభకోణం, వాటికి సంబంధించిన దర్యాప్తుల ప్రభావం నుంచి బయటపడేందుకు ఫేస్బుక్ ప్రయత్నిస్తుండగా కేంబ్రిడ్జి అనలిటికా కారణంగా జరిగిన సమాచార దుర్వినియోగం వల్ల మరో ఎదురుదెబ్బ తగిలింది.బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత కొన్ని గంటలకు ఫేస్బుక్ షేర్లు బాగా పడిపోయాయి.దాదాపు 21శాతం పడిపోయి సుమారు 130 బిలియన్ డాలర్ల( భారత కరెన్సీలో సుమారు 8.92 లక్షల కోట్లు) సంపద ఆవిరైపోయింది.సంస్థ షేర్లు పడిపోవడంతో సీఈఓ మార్క్ జుకర్బర్గ్ 16.8బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదను కోల్పోయారు.
గురువారం ట్రేడింగ్లో కూడా సంస్థ షేర్లు నష్టాలతో ముగిస్తే జుకర్బర్గ్ బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో మూడో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోతారు. ఫేస్బుక్ సమాచార భద్రత, ప్రైవసీపై అధికంగా పెట్టుబడులు పెట్టి దుర్వినియోగం జరగకుండా చూసేందుకు కృషి చేస్తున్నట్లు ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు. భద్రతపై పెడుతున్న పెట్టుబడులు మెల్లగా తమ లాభాలపై ప్రభావం చూపుతాయని అన్నారు.సమాచార దుర్వినియోగం వల్ల యూరోపియన్ యూనియన్లో మిలియన్ మంది వినియోగదారులను ఫేస్బుక్ కోల్పోయిందని జుకర్బర్గ్ వెల్లడించారు.