పురంధీశ్వరీకి షాకిచ్చిన ఓటర్....అన్యాయం చేసే పార్టీలతోనే ఎందుకుంటున్నారమ్మా?

 

త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారడంతో.. పార్టీలన్నీ కలిసి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని తెగ కష్టపడుతున్నారు. దీనిలో భాగంగానే ప్రచార కార్యక్రమాల్లో బిజీ.. బిజీగా పాల్గొంటున్నారు. అంతేకాదు ఈ ప్రచార కార్యక్రమాల్లో మన ఏపీ నేతలు కూడా పాల్గొంటున్నారు. అలా ప్రచార కార్యక్రమానికి వెళ్లిన బీజేపీ నేత పురంధీశ్వరీకి ఓ షాక్ తగిలింది. ఇంతకీ ఆ షాక్ ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే..  రాయచూరు జిల్లాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పురంధీశ్వరీని ఓ ఓటర్ ఓ ప్రశ్న అడిగాడు...  ‘అమ్మా… గత ఎన్నికలలో ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ కు ఓటేయమన్నారు… ఇప్పుడు వచ్చి బిజెపికి ఓటేయమంటున్నారు. ఏపీకి అన్యాయం చేసే పార్టీలతోనే ఎప్పుడు ఎందుకుంటున్నారమ్మా?’ అంటూ అవాక్కయ్యే ప్రశ్న వేసాడు. ఇక ఆ ఓటర్ అడిగిన ప్రశ్నకు షాకైన పురంధీశ్వరీ తేరుకొని సమాధానం చెప్పుకున్న ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే మళ్లీ ఆ ఓటరు...‘మాది గుడివాడ, మీ నాన్న గారు పార్టీ స్థాపించినపుడు జెండా మోసా, ఆ అభిమానంతోనే అడుగుతున్నా, వేరొకర్ని అయితే అడిగేవాడ్ని కాదు’ అంటూ మరో చురక అంటించారు. దీంతో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక..  ‘న్యాయం చేసే పార్టీలకే ఓటు వేయాలని, తనది రాజకీయం కాదని’ ఓ ముక్క చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయినట్లుగా సమాచారం. మొత్తానికి బీజేపీ నేతలకు ఒకదాని తరువాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరి ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంత వరకూ విజయం సాధిస్తుందో చూద్దాం...