భారత్ లో ఒక రోజు అత్యధిక కేసుల రికార్డు

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రమవుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం ప్రకటించిన వివరాల ప్రకారం నిన్న ఒక్క రోజులో 29,429 మందికి కొత్తగా కరోనా సోకింది. మరో పక్క 582 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,36,181కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,309కి చేరింది. ప్రస్తుతం 3,19,840 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు దేశంలో కరోనా నుండి 5,92,032 మంది కోలుకున్నారు. ఇక మనదేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 63శాతం ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.