ఓట్ల కోసం వ్యాక్సిన్ వాయిస్! జోరుగా కరోనా పాలిటిక్స్  

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఖతం చేసే వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఇంకా తుది దశకు రాకముందే.. వ్యాక్సిన్ వార్ కూడా మొదలైంది. తామే ముందు కరోనా టీకా తీసుకురావాలని కొన్ని దేశాల మధ్య పోటీ జరుగుతుండగా.. రాజకీయ పార్టీలు మాత్రం ఓట్ల వేటలో వ్యాక్సిన్ వార్ కు దిగాయి. ఓట్ల కోసం కరోనా వ్యాక్సిన్ ను ఉపయోగించుకుంటున్నారు నేతలు. నవంబర్ లో ఎన్నికలు జరగనున్న అమెరికాలో ప్రచారమంతా కరోనా వ్యాక్సిన్  చుట్టే తిరుగుతోంది. తాను మళ్ళీ గెలిస్తేనే వ్యాక్సిన్ త్వరగా వస్తుందని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. లేకపోతే అది మరింత ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. అంతే కాదు ఎన్నికల ముందే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని చెబుతున్నారు ట్రంప్. అయితే  ట్రంప్ ప్రత్యర్ధి , డెమెక్రాట్ అభ్యర్థి జొ బైడెన్ మాత్రం మార్కెట్లోకే రాని వ్యాక్సిన్ ఎక్కడ నుంచి తెస్తారంటూ ట్రంప్ ను ప్రశ్నిస్తున్నారు. 

 

మన దేశంలోనూ కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుండగా రాజకీయ వేడి మాత్రం రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న  బీహార్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఇవ్వడం దుమారం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్ వస్తే అందరికీ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ. బీహార్‌లో ప్ర‌తి ఒక ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామన్నది  తమ తొలి హామీ అని ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అయితే బీజేపీ కరోనా  హామీపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఉచిత వ్యాక్సిన్ హామీ పెద్ద బూటకమని విమర్శించారు రాహుల్ గాంధీ. ఎన్నికలు జరగనున్నది ఎప్పుడు? వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడు? వీళ్లు ఇచ్చేది ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు. ఇంకా రాని వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని ప్రజలకు ఎలా చెబుతారు? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 

 

బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఇతర పార్టీలు కూడా మండిపడుతున్నాయి. బీహార్ లో ఉచితంగా ఇస్తే దేశమంతా ఉచితంగా ఎవరు ఇస్తారు అంటూ  కొన్ని పార్టీలు నిలదీస్తున్నాయి. వ్యాక్సిన్ దేశానికి సంబంధించింది అని...బిజెపికి సంబంధించింది కాదని పలువురు నేతలు ఘాటుగా స్పందించారు. కరోనా వ్యాక్సిన్‌ను బీహార్‌ కోసమే రిజర్వ్‌ చేశారా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీహారీలకు ఫ్రీ టీకా ఇస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీపై ఆయన ఈ విధంగా ట్వీట్‌ చేశారు. జనాల్లో తిరుగుతున్నా మీకు వైరస్‌ సోకలేదు.. టీకా వేసుకున్నారా?’ అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు.. లేదని చెబుతూ కేటీఆర్‌ ఈ సమాధానం చెప్పారు. రాజకీయాలకు వ్యాక్సిన్ అంశాన్ని వాడుకోవటంపై ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. 

 

బీహార్ లో బీజేపీ ఉచిత వ్యాక్సిన్ హామీ నేపథ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా ముందుగానే ప్రకటన చేశారు. వ్యాక్సిన్ వస్తే తమిళనాడు ప్రజలకు ఫ్రీగా ఇచ్చేస్తామని ఆయన వెల్లడించారు. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో కరోనా కీలక అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అమెరికా సహా అన్ని దేశాల్లోనూ రాజకీయ పార్టీలు కరోనా వ్యాక్సిన్ ను ఓట్ల రాబట్టుకోవడం కోసం ఉపయోగించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో పరిశోధన సంస్థలు స్పష్టంగా చెప్పడం లేదు. అలాంటి సమయంలో ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడమంటే ప్రజలను మోసం చేయడమేనన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది.